Monday, September 3, 2018

వామన చింతకాయలు

ఆలూరుకృష్ణప్రసాదు .

వామన చింతకాయలు .

వామన చింతకాయలు అంటే  కొత్తగా  సీజన్లో  చింత చెట్లకు  కాసే, గింజ పట్టని  చిన్న చిన్న చింతకాయలు.

ఇవి చిన్నవిగా ఉంటాయి కనుక వామనుల వారు కూడా పొట్టిగా  ఉంటారు కనుక మా ప్రాంతంలో  వీటిని  వామన చింతకాయలు లేదా  చిట్టి /  పొట్టి చింతకాయలు అని అంటాము .

ఈ చింతకాయలతో  పులిహోర  చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

మనం  ఇంట్లో చేసుకునే పులిహోరకు , గుళ్ళో మనకు ఆచార్యుల వారు పెట్టే పులిహోరకు  రుచిలో చాలా తేడా ఉంటుంది .

గుళ్ళో ప్రసాదం రుచి మనకు  ఇంట్లో రాదు.

కారణం మనం పులిహోరలో చింతపండు రసం వాడతాము.

ఆచార్యుల వారు చింతకాయలు  తొక్కి పులిహోర లో వేసి తయారు చేస్తారు .

అదే ప్రధానమైన తేడా.

ఈ విషయం నా చిన్ననాటి పూజారి స్నేహితుడు  చెప్పారు .

ఇంక వామన చింతకాయలతో పులిహోర ఏ విధముగా  తయారు చేస్తారో  మనం తెలుసుకుందాం .

వామన చింతకాయలతో పులిహోర .
**********************

వామన చింతకాయులు. --
ఒక  100  గ్రాములు .

ఈ కాయలను  శుభ్రంగా  కడిగి ఆర నిచ్చి , చిన్న ముక్కలుగా తరుగుకొని , తగినంత  ఉప్పు  మరియు అర స్పూను పసుపు వేసుకుని  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఈ మొత్తం  100  గ్రాముల  పచ్చడిలో  సగం పచ్చడి అంటే షుమారు 50  గ్రాముల  పచ్చడి తీసుకోవాలి .

మిగిలిన  పచ్చడి విడిగా చిన్న జాడీ లోకి తీసుకుంటే ,తర్వాత అవసరమైనప్పుడు  మనం మామూలుగా  చింతకాయ పచ్చడి భోజనాలలోకి చేసుకోవచ్చును.

పచ్చిమిర్చి  --  10
కరివేపాకు  --  నాలుగు  రెమ్మలు .
బియ్యము  --  ఒక గ్లాసు లేదా
షుమారు  150  గ్రాములు.
పసుపు --  అర  స్పూను
ఉప్పు  --  తగినంత .

పోపునకు.

ఎండుమిరపకాయలు  -- 8 .
పచ్చిశనగపప్పు  -- రెండు స్పూన్లు .
చాయమినపప్పు --  రెండు స్పూన్లు
వేరుశనగ గుళ్ళు -- నాలుగు స్పూన్లు .
ఆవాలు --  ముప్పావు స్పూన్ .
జీడిపప్పు  --  8  పలుకులు .
ఇంగువ  - తగినంత .
నూనె  --  125 గ్రాములు.

తయారీ విధానము .

ఒక గ్లాసు  బియ్యం కడిగి  తగినన్ని  నీళ్ళు పోసుకుని స్టౌ మీద పెట్టి  కొంచెం  పొడి పొడి లాడే విధముగా  వండుకోవాలి .

ఇప్పుడు  ఒక బేసిన్ లో ఉడికిన అన్నం వేసుకుని ,  అందులో పావు స్పూను పసుపు , రెండు రెమ్మలు కరివేపాకు , కొద్దిగా  ఉప్పు మరియు  ఒక అర గరిటెడు  నూనె వేసి , గరిటెతో వేడి మీదనే బాగా కలుపు కోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండి  పెట్టి మిగిలిన మొత్తము  నూనె వేసుకుని , నూనె బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , ఆవాలు,  ఇంగువ , వేరుశనగ గుళ్ళు మరియు  జీడిపప్పు ను వేసి పోపును బాగా వేగనివ్వాలి .

తర్వాత అందులో పచ్చి మిర్చి , కరివేపాకును వేసి రెండు నిముషాలు  పచ్చి మిర్చి ని  మగ్గ నివ్వాలి .

తర్వాత  మిక్సీ  వేసుకుని  సిద్ధంగా  ఉంచుకున్న  చింతకాయల  మిశ్రమమును కూడా పోపులో వేసుకుని  రెండు నిముషాలు  ఈ మిశ్రమము పచ్చి వాసన పోయేదాకా  మగ్గనివ్వాలి.

తర్వాత  ఈ పోపును  బెసిన్ లో సిద్ధంగా  ఉంచుకున్న  అన్నము లో వేసుకుని  చేతితో  నాలుగు  మూలలా  బాగా కలిసే విధముగా  కలుపుకోవాలి .

చింతకాయల మిశ్రమములో మరియు  అన్నము లో  సరిపడే  ఉప్పు వేసుకుంటాము  కనుక రుచి చూసి ఉప్పు తగ్గితే కలుపుకోండి .

అంతే ఘుమ ఘుమ  లాడే  ఇంగువ వాసనతో  వామన చింతకాయలతో పులిహోర  సర్వింగ్  కు సిద్ధం.

ఇప్పుడు  మార్కెట్లో ఈ చిన్న చింతకాయలు బాగా దొరుకుతున్నాయి  .

కనుక  ఇప్పుడు ఈ వామన చింతకాయల పులిహోర చేసుకోవచ్చును.

శ్రావణ మాసం లో లక్ష్మీ అమ్మ వారికి , భాద్రపద మాసంలో గణపతికి , ఆశ్వయుజ మాసంలో  దుర్గా  దేవికి  మహా నైవేద్యం గా కూడా  ఈ పులిహోర నివేదన చేయవచ్చును .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటోలు నా స్వంతం .

ముక్కల పులుసు

ఆలూరుకృష్ణప్రసాదు .

ముక్కల  పులుసు .

కావలసినవి .

చింతపండు  --  50 గ్రాములు విడదీసి  15 నిముషముల ముందు  వేడి నీటిలో నానబెట్టి ఒక గ్లాసు చిక్కని రసం తీసుకొని  సిద్ధంగా  ఉంచుకోవాలి.

ఆనపకాయ /   సొరకాయ  -- లేతది.
కాయలో  సగం  ముక్క లేదా షుమారు 150 గ్రాముల ముక్క.
దోసకాయ   --  ఒకటి
బెండకాయలు  --  ఎనిమిది
టమోటోలు  --  రెండు
వంకాయలు -- రెండు
పచ్చి మిర్చి  ---   5
కరివేపాకు  --   మూడు  రెబ్బలు
కొత్తిమీర    ---  ఒక  కట్ట
పసుపు  ---   కొద్దిగా
ఉప్పు  ---  తగినంత
బియ్యపు  పిండి  --   స్పూనున్నర
కారం  ---  అర స్పూను .

పోపుకు  .

నూనె  ---   రెండుస్పూన్లు
ఎండుమిరపకాయలు   --  3
మెంతులు ---   కొద్దిగా
జీలకర్ర  ---  పావు స్పూను
ఆవాలు  --  అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా
బెల్లం  --  చిన్న ముక్క

తయారీ  విధానము .

అనపకాయ /  సొరకాయ  పై చెక్కు తీసి  ముక్కలుగా  తరుగు కోవాలి.

అదే  విధంగానే   దోసకాయ  కూడా  పై  చెక్కు  తీసి  గింజల  చేదు  చూసుకుని   ముక్కలుగా   తరుగు  కోవాలి.

వంకాయలు , టమోటోలు  మరియు  బెండకాయలు ముక్కలుగా  తరుగు కోవాలి .

పచ్చిమిర్చి   నిలువుగా   చీలికలు  గా  తరగాలి  .

ఒక  గిన్నెలో  ఈ  తరిగిన   ముక్కలన్నీ  వేసి  , చింతపండు  రసం వేసి  మరి ఒక  రెండు  గ్లాసుల  నీళ్ళు పోయాలి .

అందులో  పసుపు , ఉప్పు , చిన్న బెల్లం  ముక్క వెయ్యాలి .

పచ్చిమిర్చి , కరివేపాకు   కూడా  వెయ్యాలి .

ఇప్పుడు  స్టౌ  వెలిగించి   ఈ  పులుసు  గిన్నె  పెట్టి  మీడియం  సెగన  ముక్కలన్నీ  ఉడికి  దగ్గర  పడేలా  ఉడకనివ్వాలి . తర్వాత అర స్పూను  కారం వెయ్యాలి.

తర్వాత  ఒక  అర గ్లాసు  నీళ్ళలో   ఒకటిన్నర   స్పూను  బియ్యపు  పిండి  వేసి  చేత్తో బాగా  కలిపి  మరుగుతున్న పులుసు లో  పోయాలి .

మరో మూడు నిముషముల తర్వాత పులుసు  చిక్క పడగానే  దింపుకోవాలి .

తర్వాత  స్టౌ  మీద  పోపు  గరిట  పెట్టుకుని  రెండు స్పూన్లు   నూనె  వేసి  నూనె కాగగానే  ఎండుమిర్చి , మెంతులు , జీలకర్ర  , ఆవాలు , ఇంగువ  వేసి  పోపు  పెట్టు కోవాలి .

పైన  తరిగిన   కొత్తిమీర   వేసుకోవాలి .

అంతే  ఘమ  ఘమ  లాడే  ఇంగువ  పోపుతో ఆనప కాయ  దోసకాయ  వంకాయ  బెండకాయల ముక్కల   పులుసు  సర్వింగ్   కు  సిద్ధం.

అప్పాలు

ఆలూరుకృష్ణప్రసాదు .

రేపు   శ్రావణ  శుక్ర వారము .

వరలక్ష్మీ  వ్రతము.

అమ్మవారికి  అప్పాలు  చాలా ప్రీతికరమైనవని  దేవి గుడిలోని  పూజారి గారు  తెలియచేసారు .

రేపు  వరలక్ష్మీ  అమ్మ వారికి  ప్రత్యేకంగా  నివేదనకు  అప్పాలు తయారీ విధానము .

ప్రియమిత్రులందరికీ .

అమ్మ వారి  ప్రసాదము  అప్పాలు  తయారు  చేయు  విధానము .

కావలసినవి .

షుమారుగా  ఒక  కప్పు  కొలతగా  పెట్టుకోండి .

గోధుమ పిండి   ---   అరకప్పు

బియ్యపు  పిండి  ---  అర కప్పు

బెల్లం  తరిగిన   పొడి  --  ఒక  కప్పు

పచ్చి కొబ్బరి  తురుము ---  పావు  కప్పు    

యాలకుల పొడి  ---  అర  స్పూను 

నెయ్యి  ---  రెండు  స్పూన్లు

నూనె  ---  200  గ్రాములు

తయారీ  విధానము  .

ముందుగా   స్టౌ  మీద  బాండీ  పెట్టి తరిగిన   బెల్లం  పొడి  వేసి  బెల్లం పొడి  మునిగే  వరకు  నీళ్ళు  పోసి  బెల్లం   కరిగాక   నీళ్ళు  బాగా  తెర్లనివ్వాలి .

పాకం  రావక్కరలేదు.

గోధుమ  పిండి  మరియు  బియ్యపు  పిండి రెండూ  జల్లెడ  పోసుకుని  లేదా  రెండూ బాగా కలుపుకొని , తెర్లుతున్న  నీళ్ళలో  ముందు యాలకుల  పొడి వేసి , తర్వాత  ఈ  పిండి , కొబ్బరి తురుము  మరియు  రెండు స్పూన్లు   నెయ్యి  వేసి  బాగా  గరిటెతో  కలిపి   స్టౌ  వెంటనే   ఆపేయాలి.

కొద్ది  సేపు   తర్వాత  చేతికి  నెయ్యి  రాసుకొని  ఎడం  అర చేతిలోకి  కొద్దిగా   ఈ  మిశ్రమాన్ని  తీసుకొని   కుడి  చేతి  వేళ్ళతో  పాలకోవా  బిళ్ళలు  లాగా  చిన్న  చిన్న  అప్పాలు  మాదిరిగా   పిండి  అంతా  వత్తుకొని  వేరే  ప్లేటులో  పెట్టుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  వేరే  బాండి  పెట్టి  నూనె  అంతా  పోసి  నూనె  బాగా   కాగనివ్వాలి .

తర్వాత  షుమారు ఎనిమిది  పది  అప్పాలు  వేసి  ఎక్కువ   సేపు  ఉండనివ్వకుండా  వెంటనే  తీసెయ్యాలి .

ఎక్కువ   సేపు  ఉంటే  అప్పాలు  మాడి  పోతాయి.

ఇవి  కొబ్బరి  బూరెల్లా  కొంచెం   మెత్తగా   ఉంటాయి .

అప్పాలు  గట్టిగా   కావాలనుకునే  వాళ్ళు  ముప్పావు  కప్పు  బియ్యపు  పిండి  , పావు కప్పు  గోధుమ పిండి  వేసుకుని   చేసుకోవాలి .

అంతే  అమ్మ  వారి  ప్రసాదానికి  అప్పాలు  సిద్ధం.

కొంచెం   పెద్దవి  చేసుకుంటే  బూరెల్లా  టిఫిన్  గా  కూడా  బాగుంటాయి .

సంబంధిత రెసిపీ  మరియు ఫోటోలు  నా  స్వంతం .

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి