Showing posts with label వడియాలు. Show all posts
Showing posts with label వడియాలు. Show all posts

Thursday, April 16, 2020

బియ్యప్పిండి వడియాలు

బియ్యపు పిండితో వడియాలు.

ఆలూరుకృష్ణప్రసాదు .
బియ్యపు పిండితో వడియాలు.

ఏప్రిల్  మూడవ వారంలో ఉన్నాము. ఎండలు కూడా బాగా మండుతున్నాయి.

బియ్యపు పిండితో వడియాలు  పెట్టుకోవడానికి  ఇదే మంచి తరుణం.

 పరిస్థితులు  ఎలా ఉన్నా  ఈ సీజన్ లో వడియాలు , ఊరగాయలు
పెట్టుకోకపోతే ఏడాది అంతా  ఇవి లేక ఇబ్బంది పడాలి.

ఇక బియ్యపు పిండితో వడియాలు తయారీ విధానము  గురించి  తెలుసుకుందాం .

బియ్యపు  పిండితో వడియాలు.
******************

కావలసినవి.

రెండు గ్లాసుల బియ్యము రాత్రి నాన పోసుకుని ఉదయాన్నే కడిగి వడకట్టు కోవాలి.

బియ్యపు పిండి వడియాలు తయారీకి ఒక గ్లాసు కొలత పెట్టుకోండి.

ఉదయాన్నే  తడి  బియ్యము పిండి మెత్తగా మర పట్టించు కోండి.

బియ్యము తడపకుండా  పొడి  బియ్యము మర పట్టించి  పోయిన సంవత్సరం మా  శ్రీమతి  వడియాలు పెట్టింది.

ఎందుకో  సరిగ్గా  రాలేదు. వడియము  ఎండాక ముక్కలుగా  విరిగి పోయింది.

మా ఇంటి  ఎదురుగా  ఉన్నవారు వడియాలు , అప్పడాలు అవి పెడుతుంటారు. వారిని అడిగితే  తడి బియ్యపు పిండితో  పెడితే వడియాలు బాగా  వస్తాయని  వారే  చెప్పారు.

వారు చెప్పినట్లుగా  ఈ ఏడాది  తడి బియ్యము  మర పట్టించి  చేసింది.

వడియాలు అన్నీ  విరగకుండా  బాగా  వచ్చాయి.

తడి  బియ్యము  పిండి  పట్టించాక పిండి  జల్లెడతో  పిండి  జల్లించుకోండి. పిండి  ఎంత వచ్చిందీ  ఒక గ్లాసుతో కొలుచుకోండి.

గ్లాసుతో కొలుచుకోవడం ఎందుకంటే  ఒక  గ్లాసు  బియ్యపు పిండికి  ఆరుగ్లాసుల నీళ్ళు పడతాయి .

అందువలన  పిండి  గ్లాసుతో కొలుచుకోవడం తప్పనిసరి. 

పచ్చి మిరపకాయలు  - 12

జీలకర్ర  -  ముప్పావు స్పూను.

ఉప్పు  - తగినంత. ఉప్పు షుమారుగా జాగ్రత్తగా  వేసుకోవాలి . ఉప్పు కొద్దిగా  తగ్గినా పర్వాలేదు . కాని ఎక్కువైతే  వడియాలలో ఉప్పు ఎక్కువై  రుచి పాడవుతుంది.
  
తయారీ  విధానము .

బియ్యపు పిండి  పట్టించిన రోజు ఉదయం ఒక గిన్నెలో  పిండి కొలత ప్రకారము  ఒక గ్లాసు  బియ్యపు పిండికి  ఆరు గ్లాసుల చొప్పున నీళ్ళు పోసుకోవాలి.

స్టౌ  మీద కొలుచుకున్న నీళ్ళ గిన్నెను పెట్టి  నీళ్ళను బాగా  తెర్ల నివ్వాలి.

ఒక గిన్నెలో  గ్లాసు బియ్యపు పిండి  వేసుకుని  అందులో  ఒక  గ్లాసు నీళ్ళు  పోసుకుని  చేతితో  బాగా  కలుపుకోవాలి.

పచ్చి మిరపకాయలు , జీలకర్ర  మరియు తగినంత  ఉప్పు మిక్సీలో మెత్తగా  వేసుకుని  విడిగా ఉంచుకోవాలి.

నీళ్ళు కళా పెళా తెర్లుతున్నప్పుడు  జీలకర్ర , పచ్చిమిర్చి  పేస్ట్ ను వేసి గరిటెతో  బాగా  కలుపుకోవాలి.

వెంటనే  విడిగా నానబెట్టిన  బియ్యపు పిండిని  కూడా వేసుకుని  స్టౌ మీడియం సెగలో పెట్టుకుని  దగ్గరే ఉండి  పిండి ఉండకట్టకుండా మరియు అడుగంటకుండా బాగా  ఉడికి చిక్కగా  దగ్గర పడే  వరకు గరిటెతో  బాగా కలుపుతుండాలి.

ఒక పది నిముషాలు ఉడికిన పిండిని  చల్లారనివ్వాలి.

ఎందుకంటే  వేడి మీద వడియాలు పెడితే వడియాలు  మైనపు కాగితానికి   అంటుకుని ఒక పట్టాన ఊడి రావు. ఎండాక ముక్కలుగా  విరిగి పోతాయి.

కొద్దిగా చల్లారిన తర్వాత  ఎండలో ఒక  మైనపు పట్టాను  పర్చుకుని , ఒక గరిటెతో  కాచిన బియ్యపు పిండిని  గుండ్రముగా వడియాలు వీలయినంత  పల్చగా పెట్టుకోవాలి.

ఉదయం ఎంత తొందరగా పని పూర్తి చేసుకుంటే ఒక గంటలో వడియాలు పెట్టుకునే పని పూర్తవుతుంది.

కాకపోతే  ఇక్కడ  తడి బియ్యాన్ని మరలో పిండి  పట్టించుకోవడం త్వరగా చేసుకుంటే వడియాల పెట్టే పని ఎండలో అలసి పోకుండా  త్వరగా అవుతుంది.

ముందు రోజు మధ్యాహ్నమే  బియ్యము నాన పోసుకుని సాయంత్రానికి  పిండి పట్టించుకుని , ఒక గిన్నెలో ఆ పిండి  నొక్కి  పెట్టి ఉంచి  ఉదయాన్నే  పిండితో  వడియాలు  పెట్టుకుంటే  పని  త్వరగా  పూర్తవుతుంది,

సాయంత్రానికి  పట్టాను మడత పెట్టి మరుసటి రోజు ఉదయాన మళ్ళీ ఎండబెట్టు కోవాలి.

మరుసటి రోజు మధ్యాహ్నానికల్లా వడియాలు పట్టా నుండి వాటంతట అవే ఊడివస్తాయి.

మూడో రోజు కూడా వడియాలను ఎండబెట్టుకుని ఒక టిఫిన్లో పోసుకుని మూత పెట్టుకోవాలి.

ఈ  బియ్యపు పిండి  వడియాలు  నిక్షేపంగా  పూర్తిగా  ఏడాది పాటు  నిల్వ ఉంటాయి.

అవసరమైనప్పుడు  కాసిని కాసిని వడియాలు తీసుకుని  వేయించుకోవచ్చును.

సగ్గు బియ్యము వడియాలు లాగా  ఈ బియ్యపు పిండి  వడియాలు కూడా చాలా రుచిగా  ఉంటాయి.

అంతే . ఎంతో రుచిగా  ఉండే  బియ్యపు పిండి వడియాలు భోజనములోకి పక్కన ఆదరువుగా మరియు మధ్యాహ్నము  అల్పాహారమునకు  సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ మేము తయారుచేయు  విధానము  మరియు ఫోటో తయారుచేయు  సమయమున తీసినది.

Wednesday, July 4, 2018

మినప వడియాలు(చిన్నవి)

ఆలూరుకృష్ణప్రసాదు .

మినప్పిండి తో  చిన్న   వడియాలు .

ఇప్పుడు   ఎండలు మండి  పోతున్నాయి  .

ఈ  సమయంలో  సగ్గు బియ్యం  వడియాలు , బూడిద  గుమ్మడి  వడియాలు , ఊర  మిరపకాయలు
పెట్టుకుంటే గల  గలా  ఎండుతాయి .

చాలా  మంది  బూడిద  గుమ్మడికాయ   వడియాలతో  పాటే  ఈ  చిన్న వడియాలు   పెట్టుకుంటారు .

ఈ వడియాలు  తోటకూర   కూరలో , వంకాయ  అల్లం  మిర్చి  కూరలో , పనస  పొట్టు కూరలో  ఇలా  చాలా  కూరల్లో  ,  విడిగా   వేయించి  కలుపుతారు .

దీనివల్ల  ఆ కూరలకు  అదనపు  రుచి  వస్తుంది.

మరి కొంత  మంది  కూరల్లో  కలిపితే  వడియాలు  మెత్త  పడతాయని  , విడిగా   వేయించుకుని  కూర తో  పాటుగా  కలిపి , ముద్దలో  పెట్టుకుని  తింటారు .

మేము  ఏడాదికి  సరిపడా  ఒక  K . G .  మినపగుళ్ళు  నానబోసి  ఒకే సారి  పెట్టుకుంటాము .

అయితే  వీటికి  వాతావరణ మార్పుల  బట్టి  తొందరగా పురుగు  పట్టే  లక్షణం  ఉంది  కనుక   మూడు నెలల కొకసారి  ఏ రోజున  ఎండ  బాగా  ఉంటుందో  ఆ రోజున  ఈ  చిన్న వడియాలన్నీ  చాటలో  పోసి  డాబా  పైన  ఎండ బెట్టు కుంటాము .

మళ్ళీ  సాయంత్రం   డబ్బా లో  పోసుకుంటాము .

కొంతమంది    Zip  Lock  Covers  లో  పోసి  ఫ్రిజ్  లో  పెట్టుకుంటారు .

కావలసినన్ని  అవసరమయినపుడు వేయించుకోవటానికి  తీసుకొని  మళ్ళీ  కవర్  ఫ్రిజ్ లో  పెట్టేసుకుంటారు .

అప్పుడు   కూడా  పురుగు  పట్టవు .

ఇదివరకు   పాత రోజుల్లో   గుడ్డల  మీద  పెట్టుకునేవారు .

చాలా  కష్ట పడే వారు .

ఇప్పుడు   ప్లాస్టిక్   Sheets  వచ్చేసాయి .

అందరూ  ఈ  ప్లాస్టిక్   కవర్ల  మీదే  పెట్టుకుంటున్నారు .

ఆ  విధంగా  ప్లాస్టిక్   కవర్ల  మీద  పెట్టుకుంటే  సులువుగా   ఊడి వస్తాయి .

మేము  పెట్టుకున్న వడియాలు  అయిపోయినప్పుడు  బజార్లో  చాలా  సార్లు  కొన్నాము .

రుచి  పచి  లేకపోగా  గట్టిగా  వేయించాక  గులక రాళ్ళు  ఉన్నట్లు  ఉన్నాయి .

అందువల్ల  మీరు  కూడా  తప్పని సరై  బజార్లో  కొనవలసివస్తే  ముందు  ఓ  50  గ్రాముల  వడియాలు   కొనుక్కుని  , వేయించి  చూసుకుని  నచ్చితే  ఎక్కువ   మోతాదులో  కొనుక్కోండి .

మినపగుళ్ళతో  చిన్న వడియాలు  పెట్టుకునే విధానము .

****************************

ఒక  అర కిలో  మినపగుళ్ళు  ముందు రోజు  రాత్రి  తగినన్ని   నీళ్ళు  పోసి  నానబెట్టుకోండి .

మరుసటి  రోజు   ఉదయం   మీరు  Wet  Grinder  లో  మీరు  బూడిద  గుమ్మడికాయ    వడియాలకు  పిండి  ఎలా  వేసుకుంటారో  అలా  మెత్తగా   వేసుకొని   ఒక  గిన్నె లోకి  తీసుకోండి .

ఒక   150  గ్రాముల పచ్చి  మిరపకాయలు   తొడిమలు  తీసి  మిక్సీ  లో  మెత్తగా   వేసుకోవాలి .

తగినంత   ఉప్పు  , పావు  స్పూను  పచ్చి  ఇంగువ  మరియు  పచ్చిమిర్చి   మిశ్రమము  పిండిలో  వేసి  చేత్తో  బాగా  కలిపి  ప్లాస్టిక్   కవర్ల  మీద  చిన్న  చిన్న  సైజులో  వడియాలు   పెట్టుకోవాలి .

ఇప్పుడున్న   ఎండల  కయితే  ఒక్క రోజులోనే  ఎండి పోతాయి .

అవసరమయితే  రెండో  రోజున    కూడా  ఎండ  బెట్టకుని  ఒక  Container  లో  పోసుకోండి .

మీకు  మినపగుళ్ళతో  చిన్న వడియాలు  సిద్ధం.

మేము  ఈ  వడియాలు  ,  ఊరు  మిరపకాయలు  , గుమ్మడి  వడియాలు  వేయించుకుని  వేడి  వేడి  అన్నంలో  నెయ్యి  వేసుకొని   ఈ వడియాలు  కలుపుకు  తినేస్తాము .

చాలా  రుచిగా   ఉంటాయి .

ఫోటో   ---  ఈ  సంవత్సరం   మేము  పెట్టుకున్న  వడియాలు .

సంబంధించిన  రెసిపీ మరియు ఫొటోలు నా స్వంతం .

Thursday, March 1, 2018

ఊర మిరపకాయలు

ఆలూరుకృష్ణప్రసాదు .

ఊర మిరపకాయలు  /  చల్ల మిరపకాయలు .

ఒక లీటరున్నర  పుల్లని  గట్టి పెరుగు   తగినన్ని  నీళ్ళు పోసి మజ్జిగ  చెసుకొవాలి .

ఒక  కె. జి. మరీ కారం లేని బోలు  పచ్చిమిరపకాయలు  తీసుకుని  కత్తి పీటతో  మధ్యకు  నిలువుగా  గాటు  పెట్టుకోవాలి .

తొడిమలు  తీయరాదు .

సన్నని  మిరపకాయలు  కూడా  వాడవచ్చును .

ఊరాక  సన్న పచ్చి మిరపకాయలు  కూడా  రుచిగా  ఉంటాయి.

ఇపుడు  ఒక  పెద్ద  స్టీల్  టిఫిన్ లో  మజ్జిగను  పోసుకుని  అందులో  స్పూను  పసుపు మరియు  తగినంత  ఉప్పు వేసుకుని  చేతితో  బాగా కలుపుకోవాలి .

అందులో  గాటు  పెట్టిన  పచ్చిమిరపకాయలు  వేసుకుని  బాగా  కలిపి  మూత పెట్టుకుని మూడు రోజులు  కదపకుండా  ఉంచాలి .

నాల్గవ రోజు  ఉదయం  చేతితో  మిరపకాయలు  తీసి  మజ్జిగ  టిఫిన్ లోనే  కారనిచ్చి  మిరపకాయలను  ఒక వెడల్పాటి  పళ్ళెంలో  పోసుకుని  ఆరు  బయట ఎర్రని  ఎండలో  ఎండబెట్టుకోవాలి .

సాయంత్రం   మళ్ళీ  మిరపకాయలు  మళ్ళీ  మజ్జిగలో  పోయాలి .

అలా  మజ్జిగ  పూర్తి అయ్యే వరకు షుమారు  నాలుగు రోజులు  ప్రతి  రోజూ  ఉదయం  ఎండబెట్టి  సాయంత్రం  మరల  పోస్తుండాలి .

మజ్జిగ  పూర్తయ్యాక  ఊర మిరపకాయలు  బాగా  తడి లేకుండా  గల గల లాడే వరకు  మరో  నాలుగైదు  రోజులు  ఎండబెట్టుకోవాలి .

తర్వాత టిఫిన్ లో  భద్ర పరచుకోవాలి .

కొంతమంది  పచ్చిమిరపకాయలు   ఊర  వేయకముందే  మజ్జిగ లో  నాలుగు కాయలు  నిమ్మరసం  పిండుకుంటారు .

దీని వలన  ఊరిన కాయలు రంగు మారకుండా  తెల్లగా ఉంటాయని , రుచి కూడా మరింత పెరుగుతుందని  అంటారు.

మీరు కూడా అలా చేసుకోవచ్చును.

మనకు  అవసరమైనప్పుడు   అవసరమైనవి  తీసుకుని  పప్పు , పప్పు కూరలు , కలగలపు పప్పు ఇలా  వండుకున్నప్పుడు    పక్కన ఆదరువుగా నూనెలో  వేయించుకోవచ్చును .

ఈ ఊర  మిరపకాయలు  ఏడాది అంతా  నిల్వ ఉంటాయి .

వానాకాలంలో  , వాతావరణం  చాలా  మబ్బులుగా  చలిగా  ఉన్నప్పుడు ,  బాగా  ఎండ వచ్చిన సమయంలో  రెండు నెలలకు  ఒకసారి  ఎండలో  పోసుకుని సాయంత్రం  టిఫిన్ లో  పోసుకుంటే  మెత్తపడకుండా  ఏడాది  అంతా  నిల్వ ఉంటాయి .

Tuesday, May 30, 2017

మినప్పిండి తో చిన్న వడియాలు .

మినప్పిండి తో చిన్న వడియాలు .
ఆలూరి కృష్ణ ప్రసాద్

ఇప్పుడు ఎండలు మండి పోతున్నాయి .
ఈ సమయంలో సగ్గు బియ్యం వడియాలు , బూడిద గుమ్మడి వడియాలు , ఊర మిరపకాయలు 
పెట్టుకుంటే గల గలా ఎండుతాయి .

చాలా మంది బూడిద గుమ్మడికాయ వడియాలతో పాటే ఈ చిన్న వడియాలు పెట్టుకుంటారు .
ఈ వడియాలు తోటకూర కూరలో , వంకాయ అల్లం మిర్చి కూరలో , పనస పొట్టు కూరలో ఇలా చాలా కూరల్లో , విడిగా వేయించి కలుపుతారు .
దీనివల్ల ఆ కూరలకు అదనపు రుచి వస్తుంది.
మరి కొంత మంది కూరల్లో కలిపితే వడియాలు మెత్త పడతాయని , విడిగా వేయించుకుని కూర తో పాటుగా కలిపి , ముద్దలో పెట్టుకుని తింటారు .
మేము ఏడాదికి సరిపడా ఒక K . G . మినపగుళ్ళు నానబోసి ఒకే సారి పెట్టుకుంటాము .
అయితే వీటికి వాతావరణ మార్పుల బట్టి తొందరగా పురుగు పట్టే లక్షణం ఉంది కనుక మూడు నెలల కొకసారి ఏ రోజున ఎండ బాగా ఉంటుందో ఆ రోజున ఈ చిన్న వడియాలన్నీ చాటలో పోసి డాబా పైన ఎండ బెట్టు కుంటాము .
మళ్ళీ సాయంత్రం డబ్బా లో పోసుకుంటాము .
కొంతమంది Zip Lock Covers లో పోసి ఫ్రిజ్ లో పెట్టుకుంటారు .
కావలసినన్ని అవసరమయినపుడు వేయించుకోవటానికి తీసుకొని మళ్ళీ కవర్ ఫ్రిజ్ లో పెట్టేసుకుంటారు .
అప్పుడు కూడా పురుగు పట్టవు .
ఇదివరకు పాత రోజుల్లో గుడ్డల మీద పెట్టుకునేవారు .
చాలా కష్ట పడే వారు .
ఇప్పుడు ప్లాస్టిక్ Sheets వచ్చేసాయి .
అందరూ ఈ ప్లాస్టిక్ కవర్ల మీదే పెట్టుకుంటున్నారు .
ఆ విధంగా ప్లాస్టిక్ కవర్ల మీద పెట్టుకుంటే సులువుగా ఊడి వస్తాయి .
మేము పెట్టుకున్న వడియాలు అయిపోయినప్పుడు బజార్లో చాలా సార్లు కొన్నాము .
రుచి పచి లేకపోగా గట్టిగా వేయించాక గులక రాళ్ళు ఉన్నట్లు ఉన్నాయి .
అందువల్ల మీరు కూడా తప్పని సరై బజార్లో కొనవలసివస్తే ముందు ఓ 50 గ్రాముల వడియాలు కొనుక్కుని , వేయించి చూసుకుని నచ్చితే ఎక్కువ మోతాదులో కొనుక్కోండి .
మినపగుళ్ళతో చిన్న వడియాలు పెట్టుకునే విధానము .
****************************
ఒక అర కిలో మినపగుళ్ళు ముందు రోజు రాత్రి తగినన్ని నీళ్ళు పోసి నానబెట్టుకోండి .
మరుసటి రోజు ఉదయం మీరు Wet Grinder లో మీరు బూడిద గుమ్మడికాయ వడియాలకు పిండి ఎలా వేసుకుంటారో అలా మెత్తగా వేసుకొని ఒక గిన్నె లోకి తీసుకోండి .
ఒక 100 గ్రాముల పచ్చి మిరపకాయలు తొడిమలు తీసి మిక్సీ లో మెత్తగా వేసుకోవాలి .
తగినంత ఉప్పు , పావు స్పూను పచ్చి ఇంగువ మరియు పచ్చిమిర్చి మిశ్రమము పిండిలో వేసి చేత్తో బాగా కలిపి ప్లాస్టిక్ కవర్ల మీద చిన్న చిన్న సైజులో వడియాలు పెట్టుకోవాలి .
ఇప్పుడున్న ఎండల కయితే ఒక్క రోజులోనే ఎండి పోతాయి .
అవసరమయితే రెండో రోజున కూడా ఎండ బెట్టకుని ఒక Container లో పోసుకోండి .
మీకు మినపగుళ్ళతో చిన్న వడియాలు సిద్ధం.
మేము ఈ వడియాలు , ఊరు మిరపకాయలు , గుమ్మడి వడియాలు వేయించుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ వడియాలు కలుపుకు తినేస్తాము .
చాలా రుచిగా ఉంటాయి .
ఫోటో --- ఈ సంవత్సరం మేము పెట్టుకున్న వడియాలు .

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి