Showing posts with label చట్నీలు. Show all posts
Showing posts with label చట్నీలు. Show all posts

Tuesday, May 12, 2020

వేరు శనగపప్పు పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

వేరు శనగ పప్పు పచ్చడి.

(  పల్లీ  పచ్చడి.  )

తయారీ విధానము .

ఒక  50 గ్రాములు  వేరు శనగపప్పు  బాండీలో  నూనె లేకుండా  వేయించుకుని    చల్లారగానే  పై పొట్టు  తీసేసుకోవాలి.

తిరిగి  స్టౌ  మీద  బాండీ  పెట్టుకుని  మూడు  స్పూన్లు  నూనె వేసుకుని  నూనె కాగగానే  నాలుగు ఎండుమిరపకాయలు , మూడు స్పూన్లు  పచ్చిశనగపప్పు  వేసుకుని  పోపు  దోరగా వేయించుకోవాలి.

ఆ పోపులోనే  వేయించిన వేరు శనగ గుళ్ళు , ఆరు  పచ్చి మిరపకాయలు , మరియు  కొద్దిగా  పసుపును  వేసుకుని ఒక  అయిదు  నిముషాలు  పాటు  వేయించు కోవాలి .

చిన్న నిమ్మకాయంత  చింతపండు   కొద్దిగా  నీటిలో  తడుపుకుని  ఉంచుకోవాలి.

ఇప్పుడు మిక్సీ లో  వేయించిన  పోపు  మొత్తము , తడిపిన  చింతపండు మరియు  తగినంత  ఉప్పును  వేసుకుని  కొద్దిగా  నీళ్ళు  పోసుకుని పచ్చడి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

ఆ తర్వాత  పచ్చడిని  వేరే గిన్నెలోకి  తీసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  పోపు గరిటె  పెట్టుకుని  రెండు  స్పూన్లు  నెయ్యి  వేసుకుని , నెయ్యి  బాగా కాగగానే  రెండు  ఎండుమిరపకాయలు  ముక్కలుగా తుంచి , ముప్పావు  స్పూను  చాయమినపప్పు , అర స్పూను ఆవాలు , కొద్దిగా  ఇంగువ  మరియు రెండు రెమ్మలు  కరివేపాకును  వేసి  పోపు  వేయించుకుని ,  ఆ పోపును  పల్లీ  పచ్చడిలో  కలుపుకోవాలి.

ఇడ్లీ , దోశెలు , గారెలు  లోకి  చేసుకునే  కొబ్బరి పచ్చడి , వేరుశనగ గుళ్ళు  పచ్చళ్ళల్లో  నూనె తో పోపు  వేసే కన్నా  నేతితో  పోపు  వేస్తేనే  పచ్చడి  చాలా  రుచిగా  ఉంటుంది.

అంతే .  ఎంతో  రుచిగా ఉండే పల్లీ  పచ్చడి ఇడ్లీ, దోశెలు  మరియు  భోజనము  లోకి  సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము  తయారు చేయు విధానము  మరియు  ఫోటో  తయారు  చేయు  సమయమున  తీసినది .

Sunday, April 19, 2020

కందిపప్పు కొబ్బరిముక్కల పచ్చడి .

కందిపప్పు కొబ్బరిముక్కల  పచ్చడి .
ఆలూరుకృష్ణప్రసాదు .

కావలసినవి .

కందిపప్పు  --  ఒక కప్పు
పచ్చికొబ్బరి  ముక్కలు --  ఒక కప్పు.
ఎండుమిరపకాయలు  --  పది 
జీలకర్ర  --  స్పూను 
చింతపండు  --  చిన్న ఉసిరి కాయంత.
ఉప్పు  --  తగినంత 
ఇంగువ -- కొద్దిగా 

పోపునకు .

ఎండుమిర్చి  --  మూడు.  చిన్న  ముక్కలుగా  చేసుకోవాలి 
చాయమినపప్పు  --  స్పూను 
ఆవాలు  --  అర  స్పూను 
కరివేపాకు  --  రెండు  రెమ్మలు
నెయ్యి  --  నాలుగు  స్పూన్లు 

తయారీ విధానము .

ముందుగా  స్టౌ  మీద బాండీ   పెట్టి  రెండు స్పూన్లు  నెయ్యి వేసి  నెయ్యి  బాగా  కాగగానే  కందిపప్పు , ఎండుమిర్చి , జీలకర్ర మరియు ఇంగువ వేసి  కందిపప్పు  కమ్మని  వేగిన వాసన వచ్చే వరకు  వేయించుకోండి. 

తర్వాత  అందులోనే  చిన్న ముక్కలుగా  తరిగిన  కొబ్బరి ముక్కలు  వేసి  పచ్చి వాసన పోయేవరకు  ఉంచి  దింపి  వేరేగా  పళ్ళెంలో  తీసుకోండి .

పోపు  చల్లారగానే   ముందుగా  మిక్సీ లో వేయించిన  ఎండుమిరపకాయలు , వేయించిన  కందిపప్పు  , తడిపిన చింతపండు మరియు తగినంత ఉప్పు వేసి  మెత్తగా  మిక్సీ  వేసుకోండి.

తర్వాత  వేగిన  కొబ్బరి  ముక్కలు కూడా వేసి ,  కొద్దిగా  నీళ్ళు పోసుకుని   మెత్తగా  మిక్సీ  వేసుకోండి .

తర్వాత వేరే గిన్నెలో కి తీసుకోండి.

ఇప్పుడు  స్టౌ మీద బాండీ పెట్టి  మిగిలిన రెండు స్పూన్లు  నెయ్యి వేసి  నెయ్యి బాగా కాగగానే  ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు , ఆవాలు మరియు కరివేపాకు  వేసి  పైన పోపు  పెట్టుకోండి .

అంతే   ఇడ్లీ , దోశెలు , గారెలు , చపాతీలు  మరియు భోజనము  లోకి  ఎంతో రుచిగా  ఉండే  కందిపప్పు  కొబ్బరి ముక్కల పచ్చడి సర్వింగ్  కు సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ మేము తయారుచేయు  విధానము  మరియు ఫోటో  తయారుచేయు  సమయమున  తీసినది.

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి