Friday, January 12, 2018

కొత్త  పండు మిరపకాయల పచ్చడి.

కొత్త  పండు మిరపకాయల పచ్చడి.

సాంపిల్ గా  ఒక  అర కిలో పెట్టుకున్నాం.

ఒక అర కిలో పండు మిరపకాయలలో స్పూనున్నర  పసుపు,  ఒక 75 గ్రాములు మెత్తని ఉప్పు వేసి  రోటిలో  తొక్కుకోవాలి .

ఒక జాడిలో  100 గ్రాముల కొత్త చింతపండు  విడదీసి  మధ్యలో  పెట్టుకోవాలి .

ఇంగువ  పలుకులు కూడా  మధ్యలో పెట్టుకుని  మూడో  రోజు  మెత్తగా  రుబ్బుకోవాలి .

ఒక  జాడీలో  భద్ర పరుచుకోవాలి .

కావలసినప్పుడు   కొంత పచ్చడి తీసుకుని  అందులో స్పూను మెంతిపిండి  వేసుకుని , బాండిలో  నాలుగు స్పూన్లు  నూనె వేసుకుని  ఆవాలు, ఎండుమిర్చి  ముక్కలు మరియు ఇంగువ వేసి పోపు  పెట్టుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే పండుమిరపకాయల పచ్చడి  దోశెలు , చపాతీలు మరియు భోజనము  లోకి  సర్వింగ్ కు సిద్ధం.

పెసరపప్పు లడ్డూలు

ఆలూరుకృష్ణప్రసాదు .

సంక్రాంతి  స్పెషల్ .

మినప సున్నుండలు  ఏ విధంగా  చేసుకుంటామో  చాయపెసరపప్పు ను  మిగిలిన పప్పులతో  కలిపి  కూడా  లడ్డూలు  చేసుకోవచ్చును .

పెసర పప్పు పల్లీ పప్పుతో లడ్డూలు .

కావలసినవి .

చాయపెసర పప్పు --  ఒక  కప్పు
నెయ్యి --  ఒక  కప్పు.
కాచి  ఉంచుకోవాలి .
పంచదార  -- రెండు  కప్పులు .
వేరు శనగపప్పు  -- ఒక కప్పు.
జీడిపప్పు  మరియు 
బాదం పప్పు  --  అర కప్పు .
కాచి  చల్లారిన పాలు   --  పావు కప్పు.
యాలకుల పొడి  --  ఒకటిన్నర  స్పూను .

తయారీ  విధానము .

ముందుగా  బాండీలో  నాలుగు  స్పూన్లు  నెయ్యి  వేసి  నెయ్యి   బాగా  కాగగానే   చాయపెసరపప్పు  ను వేసి  కమ్మని వాసన వచ్చేదాకా  వేయించుకోవాలి .

చల్లారగానే  పెసర పప్పు ను  మిక్సీ లో  మెత్తగా  పొడి  చేసుకొని  విడిగా  ఉంచుకోవాలి. .

తర్వాత  పంచదార ను  కూడా  మెత్తగా  మిక్సీ  వేసుకుని  విడిగా  ఉంచుకోవాలి .

తర్వాత   బాండీలో  నెయ్యి  వేయకుండా  పల్లీలను  వేయించుకుని , చల్లారగానే  పై పొట్టు  తీసుకుని తర్వాత  మిక్సీ లో  మెత్తగా  పొడి చేసుకుని  విడిగా  ఉంచుకోవాలి .

జీడిపప్పు  మరియు  బాదం  బాండిలో  రెండు స్పూన్లు  నెయ్యి  వేసి  వేయించుకుని   మిక్సీలో  పొడి  చేసుకోవాలి .

ఇప్పుడు  ఒక బేసిన్ లో  పెసరపప్పు పొడి , పల్లీల పొడి , జీడిపప్పు  బాదంపొడి , పంచదార పొడి ,  యాలకుల పొడి  మరియు  కాచిన నెయ్యి వేసుకుని   చేతితో బాగా కలుపు కోవాలి . ఆ తర్వాత  ఉండ  కట్టుకోవటానికి   అవసరమైన  కొద్దిగా  పాలు పోసుకొని   ఉండలు కట్టుకోవాలి .

ఈ ఉండల్లో  పల్లీలు , జీడిపప్పు , బాదం  అన్నీ  కలుస్తాయి  కనుక  మంచి పోషక విలువలు కలిగి  ఎదుగుతున్న పిల్లలకు  మంచి బలవర్ధకమైనవి .

అంతే  సంక్రాంతి  స్పెషల్  పెసరపప్పు మరియు పల్లీ పప్పుతో  లడ్డూలు  సిద్ధం .

Saturday, January 6, 2018

అప్పాలు

ఆలూరుకృష్ణప్రసాదు .

ఈ రోజు  శనివారము .

శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైన రోజు .

ఆంజనేయ  స్వామి  వారి  ప్రసాదము  అప్పాలు  తయారు  చేయు  విధానము .

కావలసినవి .

షుమారుగా  ఒక  కప్పు  కొలతగా  పెట్టుకోండి .

గోధుమ పిండి   ---   అరకప్పు

బియ్యపు  పిండి  ---  అర కప్పు

బెల్లం  తరిగిన   పొడి  --  ఒక  కప్పు

పచ్చి కొబ్బరి  తురుము ---  పావు  కప్పు    

యాలకుల పొడి  ---  అర  స్పూను 

నెయ్యి  ---  రెండు  స్పూన్లు

నూనె  ---  200  గ్రాములు

తయారీ  విధానము  .

ముందుగా   స్టౌ  మీద  బాండీ  పెట్టి తరిగిన   బెల్లం  పొడి  వేసి  బెల్లం పొడి  మునిగే  వరకు  నీళ్ళు  పోసి  బెల్లం   కరిగాక   నీళ్ళు  బాగా  తెర్లనివ్వాలి .

పాకం  రావక్కరలేదు.

గోధుమ  పిండి  మరియు  బియ్యపు  పిండి రెండూ  జల్లెడ  పోసుకుని  లేదా  రెండూ బాగా కలుపుకొని , తెర్లుతున్న  నీళ్ళలో  ముందు యాలకుల  పొడి వేసి , తర్వాత  ఈ  పిండి , కొబ్బరి తురుము  మరియు  రెండు స్పూన్లు   నెయ్యి  వేసి  బాగా  గరిటెతో  కలిపి   స్టౌ  వెంటనే   ఆపేయాలి.

కొద్ది  సేపు   తర్వాత  చేతికి  నెయ్యి  రాసుకొని  ఎడం  అర చేతిలోకి  కొద్దిగా   ఈ  మిశ్రమాన్ని  తీసుకొని   కుడి  చేతి  వేళ్ళతో  పాలకోవా  బిళ్ళలు  లాగా  చిన్న  చిన్న  అప్పాలు  మాదిరిగా   పిండి  అంతా  వత్తుకొని  వేరే  ప్లేటులో  పెట్టుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  వేరే  బాండి  పెట్టి  నూనె  అంతా  పోసి  నూనె  బాగా   కాగనివ్వాలి .

తర్వాత  షుమారు ఎనిమిది  పది  అప్పాలు  వేసి  ఎక్కువ   సేపు  ఉండనివ్వకుండా  వెంటనే  తీసెయ్యాలి .

ఎక్కువ   సేపు  ఉంటే  అప్పాలు  మాడి  పోతాయి.

ఇవి  కొబ్బరి  బూరెల్లా  కొంచెం   మెత్తగా   ఉంటాయి .

అప్పాలు  గట్టిగా   కావాలనుకునే  వాళ్ళు  ముప్పావు  కప్పు  బియ్యపు  పిండి  , పావు కప్పు  గోధుమ పిండి  వేసుకుని   చేసుకోవాలి .

అంతే  స్వామి  వారి  ప్రసాదానికి  అప్పాలు  సిద్ధం.

కొంచెం   పెద్దవి  చేసుకుంటే  బూరెల్లా  టిఫిన్  గా  కూడా  బాగుంటాయి .

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి