Thursday, June 1, 2017

పండిపోయిన దొండకాయలతో పచ్చడి

పండిపోయిన దొండకాయలతో పచ్చడి

కూరల ధరలు మండిపోతున్నాయి. ఏదీ పారేసుకునేటట్లు లేదు. ఒక్కోసారి ఎంతగా ఎంచి తీసుకువచ్చినా, దొండకాయలు పండిపోతాయి, వాటితో కూర బాగోదు. అప్పుడు ఇలా పచ్చడి చేసి చూడండి, చాలా బాగుంటుంది.

కావలసిన పదార్ధాలు:
--------------------------
పండిన దొండకాయ ముక్కలు - పావు కిలో
పచ్చిమిర్చి (3), కాస్త కొత్తిమీర
పసుపు- చిటికెడు
నానబెట్టిన చింతపండు- తగినంత(దొండపండులో పులుపు ఉంటుంది కనుక అంతగాపట్టదు)
మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి (4)
పంచదార - అర చెంచా
ఉప్పు- తగినంత

తయారీ విధానం
------------------
ముందుగా పోపు వేసుకుని, వేగాకా దొండకాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, వేసి, మూతపెట్టి మగ్గనివ్వాలి.ఇష్టమైన వాళ్ళు ఇందులో కాసిన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. ఇది మగ్గాకాచింతపండు కూడా వేసి, మిక్సీ తిప్పేస్తే, రుచికరమైన దొండకాయ పచ్చడి రెడీ. పైన మళ్ళీ పోపు వేయించి వేసుకుంటే బాగుంటుంది. ప్రయత్నించి చూడండి మరి.

ఇడ్లి, దోశకి పుదీనా/కర్వేపాకు కారప్పొడి

ఇడ్లి, దోశకి పుదీనా/కర్వేపాకు కారప్పొడి:
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

(కొద్ది మార్పులతో మరొక 2 రకాలు)
ఎండుమిర్చి: 19 (కారం ఎక్కువ కావాలంటే 25 వరకూ వేసుకోవచ్చు)
మినప్పప్పు: 2 టీ స్పూన్లు
సెనగపప్పు: 2 టీ స్పూన్లు
ధనియాలు: 1/2 కప్పు
జీలకఱ్ర: 1/2 టీ స్పూన్
మెంతులు: 2 చిటికెళ్ళు
కర్వేపాకు: 5 రెబ్బలు
లేదా
పుదీన: 10 రెమ్మలు
(మొత్తంగా దూసాక ఒక గుప్పెడు రావాలి పచ్చి ఆకు)
ఉప్పు: తలకొట్టి 1 టెబుల్ స్పూన్ (సరి చూసుకుకోవాలి)
చింతపండు: పెద్ద నిమ్మకాయంత (అవును! పుల్లటి కాయే కొలత)
ఇంగువ: చిటికెడు(కావాలంటేనే)
పసుపు: చిటికెడు (ఎండుమిర్చి వేపాక, పక్కకి తీసి పైన చల్లాలి)
నూనె: 2-4 టీ స్పూన్లు

తయారు చేెసే విధానం:
ముందుగా మందపాటి మూకుడు (ఇనుపది అయితే మరీ మంచిది) వేడి చేసి, ఎండుమిర్చి 2 స్పూన్ల నూనెలో వేపుకుని గిన్నెలోకి తీసుకోవాలి (పసుపు కావాలంటే ఇప్పుడే జల్లాలి), పప్పులు 3-5 నిమిషాలు దోరగా వేపాలి. అట్లకాడతో కదుపుతూ మాడకుండా చూసుకోవాలి. గిన్నెలోకి మార్చి, దినుసులు రెండూ 2-3 నిమిషాలు వేపాలి..కాస్త వేగిన వాసన వచ్చేదాక ఆగి గిన్నెలోకి మార్చాలి, ఇప్పుడు మిగతా నూనె వేసి ఆకు వేపాలి, మంట ఆర్పాక అందులో వెల్లుల్లి, కడిగిన చింతపండు ఆ వేడి మూకుట్లో వెయ్యాలి. అన్నీ ఆరాక మిక్సీలో పొళ్ళు కొట్టే జార్ లో ముందుగా పప్పులు పొడి చేసి, దినుసులు వేసి పొడి చేసాక, ఆకు వెయ్యాలి, చివరగా చింతపండు, వెల్లుల్లి వేసి ఎక్కువ తిప్పకుండా ఆపేయాలి.
ఇలా తయారైన పొడి ఇడ్లి కారం అంటారు. దోశ కి బాగుంటుంది. కాకపోతే, పొదీన తో చేస్తే అన్నంలోకే బాగుంటుంది.
(పొదీనా ఆకు కాస్త నాలుగురోజులు ఎండపొడ తగలని నీడలో ఉంచితే shade dried విధానంలో వాడి వాటి ఔషధ గుణాలు నిలుపుకుంటాయి..కర్వేపాకు కి ఒకరాత్రి కడిగి ఆరబెడితే చాలు. ముఖ్యంగా ఈ పొడులు గాలి చొరబడని స్టీల్ డబ్బా లేదా గాజుసీసాలో పెట్టి వెలుగు తగలని అల్మైరా లో ఉంచితే తాజా ఘుమఘుమగా 3 నెలల వరకు నిలువ ఉంటాయి. ఫ్రిజ్ లోనూ పెట్టుకోవచ్చు. పొడి ని మాత్రం నెయ్యితోనే తినాలి..పూర్తి శాస్త విజ్ఞానం లేని అపోహతో నెయ్యి మానవద్దు. నేను ఇన్నేళ్ళుగా మానలేదు, నాకే సమస్యా లేదు- కేవలం అదుపు కావాలి+వ్యాయామం చేయాలి)
-2-
ధనియాల కారం: పైన పాళ్ళలోని పప్పులు వేయకుండా చేస్తే కాస్త ముద్దగా, ముదురురంగులో ఉంటుంది. ఇది అన్నానికి సరి జోడు. ముందు ముద్ద వేడి అన్నం+నెయ్యి+ ఈ పొడితో వతనుగా తింటుంటే జీర్ణశక్తి, ఆకలి పెరుగుతాయి.

*****

ఉల్లి పల్లీల చట్నీ

ఉల్లి పల్లీల చట్నీ
 ఆలూరి కృష్ణ ప్రసాద్  

ఇడ్లీ దోశెల లోకి ఉల్లి పల్లీల చట్నీ తయారీ విధానము
మేము అయితే అచ్చగా పచ్చి శనగపప్పు పల్లీలు పచ్చి మిరపకాయలు ఆరు నూనె వేసి మగ్గబెట్టి రెండు ఎండుమిరపకాయలు చాయమినపప్పు ఆవాలు కరివేపాకు కాస్త ఇంగువ నేతితో వేయించుకుని పచ్చడి లో కొద్దిగా చింతపండు తగినంత ఉప్పు వేసి మిక్సీ వేసుకొని చివరగా పోపు కలుపుకుంటాము.
మా పచ్చడి ఇడ్లీ , దోశె , చపాతి మరియు పూరీలలోకి కూడా చాలా బాగుంటుంది.
ఫోటోలో చూపిన విధంగానే గట్టిగానే ఉంటుంది .
ఇక్కడ additions
పెద్ద ఉల్లిపాయలు 
వెల్లుల్లి 
మరియు 
 నువ్వుపప్పు

మీకు ఏ విధానము నచ్చితే ఆ విధముగా చేసుకోండి.

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి