Sunday, July 23, 2017

కుడుములు

ఆలూరుకృష్ణప్రసాదు .

జిల్లేడుకాయలు  లేదా  తీపి కుడుములు.

ఈ  స్వీట్  మేము  ప్రతి  వినాయక చవితి  పండుగకు  తప్పనిసరిగా  చేసుకుంటాము .

గణపతి కి  ఉండ్రాళ్ళు  మరియు  తీపి   జిల్లేడుకాయలు   మాత్రమే ప్రసాదంగా  చేస్తాము .

ఆ రోజు  వేడి  వేడి  నూనెతో  గారెలు , సజ్జ పూరీలు , పునుగులు   వంటి వండిన పిండి వంటలు   చేయము ,

కారణం  నాకు  పూర్తిగా  తెలియదు  కాని  మా  ఇంట్లో  మాత్రం  మా  బామ్మ గారి  తరం  నుండి  ఇదే  పద్ధతి .

గోదావరి  జిల్లాలో  మా  అమ్మమ్మ గారి  ఇంట్లో  కూడా  ఇదే  ఆనవాయితి .

ఇంక  ఈ  తీపి   కుడుములు  మళ్ళీ  దేవీ నవరాత్రులలో  చేసుకుంటాము .

విడి  రోజుల్లో   చేసుకోవడం  చాలా  తక్కువ .

జిల్లేడుకాయలు   మాదిరిగా   చేసుకుంటే  జిల్లేడుకాయలు  అని అంటాము .

గుండ్రంగా  చేసుకుంటే  తీపి కుడుములని  అంటాము .

తయారీ విధానము  .

ఇంక  జిల్లేడుకాయలు లేదా  తీపి  కుడుములు  తయారీ విధానము .

ముందుగా  స్టౌ మీద  గిన్నె పెట్టి  అందులో  గ్లాసున్నర  నీళ్ళు పోసి  అందులో  చిటికెడు   ఉప్పు  వేసి  నీళ్ళను  బాగా  తెర్ల నివ్వాలి .

బియ్యము  మర పట్టించి  ఒక  గ్లాసు  బియ్యపు  పిండి  తీసుకోవాలి .

తరువాత  తెర్లుతున్న  నీళ్ళలో    సిద్ధంగా  ఉంచుకున్న   బియ్యపు  పిండిని  కొద్ది కొద్దిగా   వేస్తూ  బియ్యపు  పిండి  ఉండలు  కట్టకుండా గరిటతో  బాగా  కలుపుకుని ,  రెండు స్పూన్లు   నెయ్యి  వేసి బాగా కలిపి   పైన  మూత  పెట్టి   స్టౌ  ఆపేయాలి .

తర్వాత  చేతికి  నెయ్యి రాసుకుని  పిండిని చెత్తో మెదుపుతూ  చిన్న  చిన్న  ఉండలుగా  చేసుకోవాలి .

అంతకు  ముందు  కొబ్బరి కాయ కొట్టుకొని  పచ్చి  కొబ్బరి  తురుముతో  రెండు  చిప్పలు  కోరుకొని  పచ్చి కొబ్బరి తురుము  సిద్ధం  చేసుకోవాలి .

పచ్చి కొబ్బరి తురుము  రెండు  కప్పులు  ఉంటే , ఒక  కప్పు  బెల్లం  బండతో  పొడిగా   చేసుకొని  ,  తురిమిన  కొబ్బరి  లో  వేసి  బాగా కలుపు కోవాలి .

ఆ తర్వాత  స్టౌ   మీద  బాండీ  పెట్టి  కలిపిన  మిశ్రమము  వేసి  రెండు  చేతి  వేళ్ళతో  పట్టుకుంటే  చేతులకు  బెల్లం పాకం  అంటుకునే  విధంగా  పాకం పట్టుకుని   రెండు స్పూన్లు  నెయ్యి  వేసి  దింపాలి .

కొబ్బరి లౌజు  కొద్దిగా  చేయి పట్టే  వేడి  మీద  ఉండగానే    చిన్న  చిన్న  ఉండలుగా  చేసుకున్న  బియ్యపు పిండి  అర చేతికి  నెయ్యి  రాసుకుని  ఒక్కొక్క   ఉండను  అర  చేతులోకి  తీసుకొని   చెయ్యి  అంతా  ఒత్తుకుని , అందులో  స్పూను  కొబ్బరి  మిశ్రమం  పెట్టి  పిండి  మీద  పరచి  అంచులు  తడి చేత్తో   మూసేసుకోవాలి .

ఇలా  అన్నీ  తయారు  చేసుకుని  ఇడ్లీ  స్టాండు ప్లేటులకు  నెయ్యి రాసి  , అందులో ఈ  తయారు  చేసుకున్న  కుడుములు  పెట్టి  , కుక్కర్  లో  సరిపడా  నీళ్ళు పోసి  ఒక  పది నిముషాల  పాటు  ఇడ్లీల  మాదిరిగా   ఆవిరి  పట్టాలి  .

అంతే  ఎంతో  రుచిగా   ఉండే  జిల్లేడుకాయలు  లేదా  తీపి  కుడుములు  స్వామి వారికి   లేదా  అమ్మ వారి  నైవేద్యానికి  అనంతరం  మనం  దైవ  ప్రసాదంగా  స్వీకరించడానికి   సిద్ధం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి