Monday, February 5, 2018

బెండకాయలతో రుచికరమైన మజ్జిగ పులుసు .

ఆలూరుకృష్ణప్రసాదు .

బెండకాయలతో  రుచికరమైన మజ్జిగ  పులుసు .

కావలసినవి .

పెరుగు  --  అర లీటరు
బెండకాయలు  --  లేతవి  పావు కిలో .
పచ్చిమిరపకాయలు  --   ఆరు నిలువుగా  చీలికలు  చేసుకోవాలి .
కరివేపాకు  --  మూడు  రెమ్మలు
కొత్తిమీర  --  ఒక కట్ట
ఉప్పు   --  తగినంత

ముందుగా   స్పూనున్నర  పచ్చిశనగపప్పు , చిన్న అల్లం  ముక్క , పావు  స్పూను  ఆవాలు  ఒక  గిన్నెలో  వేసుకుని  మునిగే  వరకు  నీరు పోసి  ఒక గంట  సేపు  నానబెట్టుకోవాలి .

తర్వాత   నీరు  వేరుగా  వడకట్టుకుని   మిక్సీ లో  నానబెట్టిన  పచ్చిశనగపప్పు , ఆవాలు ,   అల్లం  ముక్క , చిన్న  పచ్చి కొబ్బరి ముక్క  ముక్కలుగా  చేసుకుని వేసుకోవాలి.

రెండు పచ్చిమిర్చి ,   వేసి కొద్దిగా  విడిగా  తీసి  ఉంచిన  నీరు  పోసుకుంటూ   మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఒక గిన్నెలో   మొత్తము  పెరుగు  వేసుకుని  తగినన్ని  నీరుపోసుకుని  కవ్వముతో  మజ్జిగ  చేసుకోవాలి .

నీరు  మరో  రెండు గ్లాసుల  నీళ్ళు పోసుకోవాలి .

అందులో  తరిగిన  పచ్చిమిరపకాయలు , కరివేపాకు , తగినంత  ఉప్పు , రుబ్బిన  ముద్ద అందులో  వేసుకుని  గరిటతో  బాగా  కలుపుకోవాలి .

లేత  బెండ కాయలు  ముక్కలుగా  తరుగు కోవాలి .

స్టౌ  మీద  బాండీ  పెట్టి   రెండు  స్పూన్లు  నూనె వేసి  బెండకాయ ముక్కలను  వేసి  ముక్కలను  బాగా  మగ్గనివ్వాలి .

చల్లారగానే  ముక్కలను   మజ్జిగలో  కలుపుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి  నూనె  బాగా కాగగానే  మూడు ఎండుమిరపకాయలు  ముక్కలుగా చేసి , కొద్దిగా  మెంతులు , పావు స్పూను  జీలకర్ర , పావు స్పూను  ఆవాలు  కొద్దిగా  ఇంగువ మరియు కరివేపాకు  వేసుకుని  పోపు  వేగగానే  మజ్జిగ లో  వేసుకుని  గరిటెతో బాగా కలుపుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  ఈ మజ్జిగ  పులుసును  పెట్టి  పొంగకుండా , విరగకుండా  గరిటెతో  బాగా కలుపుతూ  పదిహేను నిముషాల పాటు  తెర్లనిచ్చి  , కొత్తిమీర  కూడా వేసుకుని దింపుకోవాలి.

ముందుగా  మరగనిచ్చి  తర్వాత పోపు పెడితే  పులుసు విరిగే  ప్రమాదం ఉంది .

అంతే  వేడి వేడి  మజ్జిగ  పులుసు సర్వింగ్  కు సిద్ధం.

గోంగూర పండుమిరప పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

కొంచెము  వెరైటీ గా 

గోంగూర  ఆకుతో  పండు మిరపకాయలు  పచ్చడి.

కావలసినవి .

గోంగూర  --  మూడు  కట్టలు
పండుమిరపకాయలు --  150  గ్రాములు .
చింతపండు  --  50  గ్రాములు .
మెంతిపిండి --  రెండు స్పూన్లు .
ఉప్పు  --  తగినంత
పసుపు  --  స్పూను
ఉల్లిపాయలు  --  మూడు .

పోపునకు .

ఎండుమిరపకాయలు  --  4  ముక్కలుగా చేసుకోవాలి .
నూనె -- 150  గ్రాములు .
చాయమినపప్పు  --  స్పూనున్నర .
ఆవాలు  --  స్పూను .
ఇంగువ  --  తగినంత

తయారీ  విధానము .

ముందుగా  పండు మిరపకాయలు  ఒకసారి  కడుగుకుని  , తొడిమలు  తీసుకుని  పొడి గుడ్డతో  తుడుచుకుని  నీడలో  ఒక అరగంట సేపు  ఎండబెట్టుకోవాలి .

తర్వాత  మిక్సీ లో  పండుమిరపకాయలు , చింతపండు , పసుపు , కొద్దిగా  ఇంగువ మరియు  సరిపడా  ఉప్పు వేసుకుని మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఉల్లిపాయలు  సన్నగా  ముక్కలుగా  తరుగు కోవాలి .

గోంగూర  కట్టలు  ఇసుక లేకుండా  శుభ్రంగా  కడిగి , ఆకులు  వలుచుకుని  పూర్తిగా  తడి పోయేవరకు  నీడలో  ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి . 

ఆ తర్వాత  బాండీలో  నూనె  వేయకుండా  వేయించుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండి  పెట్టి   మొత్తము  నూనె పోసి  నూనె  బాగా కాగగానే  ఎండుమిరపకాయల ముక్కలు , చాయమినపప్పు , ఆవాలు, ఇంగువ వేసి  పోపు  వేగగానే  సన్నగా  తరిగిన  ఉల్లిపాయ ముక్కలు  వేసి  ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చే వరకు  వేయించుకోవాలి .

ఒక అయిదు  నిముషములు  పోపు  చల్లారనివ్వాలి .

ఇప్పుడు   మిక్సీలో  వేయించి సిద్ధంగా  ఉంచుకున్న   గోంగూర ,  మిక్సీ  వేసుకున్న  పండుమిరపకాయల  ముద్ద , మెంతి పొడి మరియు సరిపడా  ఉప్పు  వేసుకుని  ఈ రెండు  బాగా  కలిసే వరకు  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఆ తర్వాత  ఈ  మిశ్రమాన్ని  వేయించి  సిద్ధంగా  ఉంచుకున్న  ఉల్లిపాయల లో వేసుకుని   గరిటెతో  బాగా  కలుపుకోవాలి .

తర్వాత  వేరే జాడీలోకి తీసుకుని భద్రపరుచుకోవాలి .

ఈ పచ్చడి  ఒక పది రోజుల  వరకు  నిల్వ ఉంటుంది .

గోంగూర ఆకు మరియు పండు మిరపకాయలతో  చేసిన  ఈ పచ్చడి  వేడి వేడి అన్నంలో  మరి కాస్త నెయ్యి వేసుకుని  తింటే  అద్భుతమైన  రుచిగా  ఉంటుంది .

మంచి గోంగూర  (  అంటే  పులుపు  లేనిది )  మరియు  కొండ గోంగూర  ( అంటే  పుల్లని  గోంగూర  )  రెండు  రకములు  మార్కెట్  లో అమ్ముతారు .

ఈ పచ్చడి తయారీకి   పుల్లని  గోంగూర  చాలా రుచిగా  ఉంటుంది .

ఒకవేళ పుల్లని  గోంగూర  దొరకని  పక్షంలో  మంచి గోంగూరతో  కూడా  చేసుకోవచ్చును .

అప్పుడు  మరో  25  గ్రాములు  చింతపండు  వేసుకోవాలి .

ఫోటో  ;  ---

ఈ రోజు  మా ఇంట్లో  చేసుకున్న 
గోంగూర  ఆకుతో  పండుమిరపకాయల  పచ్చడి .

కొబ్బరి పొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

కొబ్బరి  కారం  /  కొబ్బరి  పొడి .

కావలసినవి .

ఎండు కొబ్బరి చిప్పలు  ---  2
ఎండుమిరపకాయలు  --  15
జీలకర్ర  --  స్పూనున్నర
వెల్లుల్లి  పాయ రెబ్బలు  --  15 
ఉప్పు  --  తగినంత .

తయారీ  విధానము .

ముందుగా   స్టౌ  వెలిగించి   సెగ  సిమ్  లో  పెట్టుకోవాలి .

ఎండు  కొబ్బరి  చిప్పలు  స్టౌ  మీద పెట్టి  వెనుక  వైపు  కొబ్బరి  చిప్పలను  మధ్య మధ్య  తిప్పుతూ  కమ్మని  వాసన  వచ్చేదాకా   కాల్చుకోవాలి .

ఎక్కువ  సెగన  కాల్చుకుంటే  చిప్పలు  మాడి పోవచ్చును  లేదా  చిప్పలు  అంటుకునే  ప్రమాదం  ఉంది .

కొబ్బరి  చిప్పలు  చల్లారగానే  ఎండు కొబ్బరి  తురుముతో  తురుము  కోవాలి .

లేదా  చాకుతో  చిన్న చిన్న ముక్కలుగా  చేసుకోవాలి .

ఎండుమిరపకాయలు  తొడిమలు  తీసుకోవాలి .

ఇప్పుడు   స్టౌ  మీద  బాండీ  పెట్టి  నూనె  వేయకుండా  ఎండుమిరపకాయలు , జీలకర్ర  వేసి  మిరపకాయలు  వేగిన  వాసన వచ్చేదాకా  వేయించుకోవాలి .

వెల్లుల్లి పాయలు  పై పొట్టు  తీయకుండా  రెబ్బలుగా  వలుచుకోవాలి .

ఇప్పుడు   మిక్సీలో  వేగిన ఎండుమిరపకాయలు  , జీలకర్ర , తగినంత  ఉప్పు వేసి  మెత్తగా  వేసుకోవాలి .

తర్వాత  ఎండు కొబ్బరి  ముక్కలు  /  లేక  తురిమిన  ఎండు  కొబ్బరి  మిక్సీ లో  వేసుకుని  మరీ  మెత్తగా  కాకుండా  వేసుకోవాలి .

చివరగా  వెల్లుల్లి  రెబ్బలు  కూడా  వేసుకుని  ఒకసారి  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత  ఒక సీసాలో  భద్రపర్చుకోవాలి .

వెల్లుల్లి  ఇష్టం  లేని వారు  మరో అర స్పూను  జీలకర్ర  వేసుకుని  చేసుకోవచ్చు .

ఈ కొబ్బరి పొడి  షుమారు  20  రోజులు  నిల్వ  ఉంటుంది .

ఈ  కొబ్బరి  కారం  లేదా  కొబ్బరి పొడి  వేడి వేడి  అన్నంలో  మరి కాస్త నెయ్యి వేసుకుని  కలుపుకుని  తింటే  అద్భుతమైన  రుచిగా  ఉంటుంది .

ఉలవచారు

ఆలూరుకృష్ణప్రసాదు .

ఉలవచారు.

చాలా  మంది  ఉలవచారు  ఎలా  తయారు  చేయాలి  ?
తయారీ  విధానము  తెలియ చేయండి అని అడుగుతున్నారు .

ఈ  ఉలవచారు  ఇష్టమైన  వారికి   ఉపయోగిస్తుందనే  ఉద్దేశ్యంతో  అందరికీ  తెలియచేస్తున్నాను.

ఉలవచారు.

తయారీ  విధానము .

ముందుగా ఉలవలని బాగా కడిగి సరిపడా నీరు పోసి  4 గంటలు నానబెట్టుకోవాలి .

తరువాత నానబెట్టిన ఉలవలను  కుక్కర్ లో వేసి తగినంత  నీరు పోసి  5 or 6 visitles వచ్ఛేవరకు ఉడకనివ్వాలి.

తర్వాత నీటిని వడబోసుకుని నీటి కట్టును విడిగా ఉంచుకోవాలి.
ఇపుడు ఒక పాన్ లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి  నూనె వేడెక్కాక కాస్త పోపు దినుసులు...శనగ పప్పు..కొద్దిగా జీలకర్ర.వేసి వేగనివ్వాలి..

తర్వాత కాస్త పసుపు..కరివేపాకు రెమ్మలు వేసి ఇంతకు ముందు పక్కకు తీసి ఉంచిన ఉలవ కట్టు అందులో పోసి  కాసేపు మరిగించాక చింతపండు రసం కానీ...టమాటో గ్రైండ్ చేసుకున్న ప్యూరి కానీ వేసి..కాస్త ఇష్టమున్న వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చును.

ఇప్పుడు కొంచెం దనియా పొడి వేసుకుని కొంచెం మరిగాక కొత్తిమీర పైన వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోవాలి.

వేడి వేడి ఉలవ చారు రెడి..

తీసిపెట్టుకున్న ఉలవలు గుగ్గిళ్ళు గా పోపు  వేసుకుని   మగ్గపెట్టి  ఉప్పు  కారం వేసుకుని  తినవచ్చును.

పంచదార పాకం గారెలు

పంచదార పాకం గారెలు.

తయారీ విధానము .

మినపగుళ్ళు  --  150 గ్రాములు.
పంచదార  --  100 గ్రాములు
ఏలకులపొడి  --  స్పూను
నూనె  --  350  గ్రాములు.

తయారీ విధానము .

మినపగుళ్ళు  ఒక గిన్నెలో  పోసుకుని  ఒకసారి  కడిగి  సరిపడా నీళ్ళు పోసుకుని  ఆరు గంటలు  సేపు నానబెట్టుకోవాలి .

తర్వాత  నీళ్ళు వడగట్టి  గ్రైండర్  లో  వేసుకుని  కొద్దిగా  నీళ్ళు పోసుకుని  గారెల పిండిలా  గట్టిగా   రుబ్బుకోవాలి .

ఆ తర్వాత  వేరే గిన్నెలోకి  తీసుకుని  చిటికెడు   ఉప్పు  వేసుకుని  గరిటెతో  బాగా  కలుపుకోవాలి .

మరల స్టౌ  మీద  గిన్నె పెట్టి  పంచదార  వేసి , పంచదార  మునిగే  వరకు  నీళ్ళు పోసి , మరీ  గట్టి పాకం కాకుండా  చేతి వేళ్ళకు  అంటుకునేలా  పాకం రానిచ్చి , యాలకుల పొడి  వేసి   దింపుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తము  నూనె  పోసి నూనె  పొగలు  వచ్చే విధముగా  బాగా  కాగనివ్వాలి .

రుబ్బి సిద్ధంగా  ఉంచుకున్న  పిండిని  అరిటాకు  మీద  తడి చేతితో  గారెలు  మాదిరిగా వేసుకుని, రెండు వైపులా  బంగారు  రంగు  వచ్చేలా  వేయించుకోవాలి .

అలా  వేగిన  గారెలు  వెంటనే  పంచదార  పాకంలో  వేసి  మూడు నాలుగు గారెలు  పాకం  పీల్చుకోగానే  విడిగా  తీసుకోవాలి .

అంతే  జాంగ్రీల మాదిరిగా  పాకం పీల్చుకున్న  పంచదార  పాకం గారెలు  సర్వింగ్  కు సిద్ధం .

గోదావరి  జిల్లాలలో  పంచదార  బదులు  బెల్లం వాడి పైన చెప్పిన విధముగా  పాకం పట్టి  బెల్లంతో  పాకం గారెలు  చేస్తారు .

ఆ విధముగా  కూడా  చేసుకోవచ్చును .

బెండకాయ వేపుడు

ఆలూరుకృష్ణప్రసాదు .

బెండకాయ వేపుడు .  (  fry  ) 

ముందుగా  స్టౌ మీద  బాండీ పెట్టి రెండు స్పూన్లు  నూనె వేసి  నూనె బాగాకాగగానే ఆరు ఎండుమిరపకాయలు , స్పూను  పచ్చిశనగపప్పు , స్పూను  మినపప్పు , అర స్పూను  జీలకర్ర , మూడు  స్పూన్లు  ఎండుకొబ్బరి  ముక్కలు , రెండు  స్పూన్లు  పల్లీలు , మరియు  రెండు స్పూన్లు  నువ్వుపప్పు  వేసి  బాగా  వేయించుకోవాలి .

చల్లారగానే  మిక్సీ లో  తగినంత  ఉప్పు వేసుకుని  మెత్తగా  పొడి  చేసుకోవాలి .

ఆ పొడి  వేరుగా  ఉంచుకోవాలి .

తర్వాత పావుకిలో  బెండకాయలు  ముక్కలు గా తరిగి , స్టౌ వెలిగించి బాండీ పెట్టి నాలుగు
స్పూన్లు   నూనెవేసి  నూనె బాగా కాగగానే  బెండకాయ ముక్కలు వేసి బాగా  వేయించుకోవాలి .

తర్వాత  ముందుగా  సిద్ధం చేసుకున్న  పొడి  కూరలో  వేసి మరో   అయిదు నిముషాలు  ఉంచి  కమ్మని వాసన రాగానే  దింపి  వేరే  Dish లోకి  తీసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  బెండకాయ  వేపుడు  భోజనము లోకి  సర్వింగ్  కు సిద్ధం.

ఆరోగ్యానికి మెంతికూర

ఆలూరుకృష్ణప్రసాదు .

మెంతికూర .

ఆరోగ్యానికి   మెంతికూర.

మధు మేహా  వ్యాధి  నియంత్రణకు , శ్వాస కోశ  ,  మరియు  కిడ్నీ  సంబంధిత  వ్యాధులకు  మెంతికూర  ఆహారంలో  తీసుకోవడం చాలా  ఉపయోగకరం.

మాములుగా  ఆకులుగా పెద్ద కట్టాలుగా  దొరికే  మెంతికూర,  బాపట్ల  మరియు  కొన్ని  ప్రాంతాలలో   దొరికే   చిన్న  చిన్న  కట్టలుగా  దొరికే   మెంతికూర . 

రోజూ  బాపట్ల  నుండి    తెనాలి కి  ప్రతిరోజూ  మధ్యాహ్నము  రైలులో   ఈ  చిన్న కట్టల  మెంతికూర   తెచ్చి  అమ్ముతారు .

సంవత్సరంలో  బాగా  ఎండలున్న  మూడు  నెలలు  తప్ప  ఈ  చిన్న కట్టల  మెంతికూర  మాకు  మిగిలిన  తొమ్మిది  నెలలు  దొరుకుతుంది .

ఆహార  పోషక  విలువల లో  రెండు  ఒకటే  అయినా  మేము  చిన్న చిన్న  కట్టల  మెంతికూరనే  వాడతాము .

చాలా  చాలా  రుచిగా  ఉంటుంది .

మెంతికూరతో  ఏమి  చెయ్యవచ్చు ?

1.  మెంతి కూర  పప్పు  కందిపప్పుతో.

2.  మెంతికూర  పప్పు కూర  పచ్చిశనగపప్పు  తో.

3.  మెంతికూర  పొడి కూర  కందిపప్పు  తో.

ఇవి  కాక  మేతి  చపాతీలు ,  మేతి  పరోటాలు  చాలా  రకాలు  చేస్తారు .

కొందరు మెంతికూరతో  పచ్చడి కూడా  చేసుకుంటారు.

ఇప్పుడు  నేను  చెప్తున్నది
మెంతికూర  కందిపప్పు  తో  పొడికూర .

మెంతికూర  కందిపప్పు  తో  పొడికూర  తయారు  చేయు  విధానము.

ముందుగా  ఒక  గ్లాసు కందిపప్పు
ఒక  గిన్నెలో  పోసుకుని  ఒకసారి కడిగి , ఒకటిన్నర  గ్లాసు నీళ్ళు  పోసి స్టౌ  వెలిగించి  మరీ  మెత్తగా  కాకుండా  బద్దలుగా  (  చేతితో  నొక్కి  చూస్తే బద్ద  మెత్త పడితే  చాలు )  ఉడికించండి .

ఉడికిన  నీళ్ళు  మిగిలితే  ఒక గిన్నెలో  వార్చుకోండి .పార  బోయవద్దు .

బద్దలుగా  ఉడికిన  పప్పు  ఒక  పళ్ళెంలో  పక్కన   పెట్టుకోండి .

మెంతి  కూర  చిన్న కట్టలయితే  వేళ్ళు  చాకుతో  కట్  చేసి  కాడలు కూడా  లేతగా  ఉంటే  ఉంచండి .

ఆకు మరియు కాడలు  చిన్న చిన్నగా  కట్  చేసిన తర్వాత  రెండు  సార్లు  శుభ్రంగా  కడగండి .

మా  బాపట్ల  ఇసుక నేల  కాబట్టి  ఏ  ఆకు కూర లో  నైనా  ఇసుక  తగులుతుంది .

బాగా  కడగపోతే  కూరలో  ఇసుక  తగిలి  గర గర మంటుంది. రుచి పాడవుతుంది.

అదే  పెద్ద మొక్కల  మెంతికూర  అయితే  ఆకులు  వలుచుకుని  కట్ చేసుకుని  ముదురు కాడలు  పారేసి  ఆకును  శుభ్రంగా  కడుక్కోండి.

ఇప్పుడు  స్టౌ  వెలిగించి   బాండీ  పెట్టి  నాలుగు  టీ  స్పూన్ల   నూనె  వేయండి .

నూనె బాగా  కాగాక  నాలుగు  ఎండుమిరపకాయలు   ముక్కలు చేసినవి , రెండుస్పూన్ల  చాయమినపప్పు , అర స్పూన్  జీలకర్ర  , అర స్పూన్  ఆవాలు , తగినంత  ఇంగువ ,  రెండు  రెమ్మల కరివేపాకు   వేసి  పోపు  బాగా  వేగాక ,  తరిగి  ఉంచుకున్న  మెంతికూర   ఆ పోపులో  వేయండి .

అందులో  పావు  స్పూన్  పసుపు  కూడ  వెయ్యండి.

మెంతికూర  తొందరగానే  మగ్గుతుంది.

మెంతికూర  మగ్గిన  తర్వాత   ఇప్పుడు  బద్దలుగా  ఉడికించిన  కందిపప్పు  కూడా  అందులో  వేసి  ఇప్పుడు  తగినంత   ఉప్పు కారం  వేసుకుని   మూడు నిముషాల పాటు  మగ్గనిచ్చి  దింపేసి  వేరే  Bowl  లోకి  తీసుకోండి .

అంతే  ఆరోగ్య కరమైన  మరియు  రుచికర మైన  మెంతికూర  పొడికూర  భోజనం  లోకి   సిద్ధం.

ఇదే  పద్దతి లో  కందిపప్పు   బదులు  శనగపప్పు   వేసి కూడా   మెంతికూరతో పొడికూర  చేసుకోవచ్చు .

కొంతమంది   పోపులో  మెంతికూర  వేయిస్తే  విటమిన్  లు  పోతాయని  ఉడుకుతున్న  కందిపప్పు   లోనే  తరిగి  ఉంచుకున్న  మెంతికూర  వేసి  రెండూ  ఉడికాక ,  పైన  నే  చెప్పిన  పద్ధతిలో  పోపు , ఉప్పు , కారం  వేసుకుంటారు .

మెంతికూర  పప్పు .
--------------------
గ్లాసు కందిపప్పు  తగినంత  నీళ్ళుపోసి  స్టౌ మీద పెట్టాలి .

పప్పు మెత్తగా  ఉడకగానే పప్పులో  మెంతికూర , తరిగి ఉంచుకున్న  అయిదు పచ్చి మిరపకాయలు  ముక్కలుగా చేసుకుని ,   కొంచెం పసుపు, రెండు రెమ్మలు కరివేపాకు   వేసి  మెంతికూర ఆకు     ఉడికాక  చిన్న నిమ్మకాయంత  చింతపండు  చిక్కగా రసం తీసుకుని పప్పు లో వేయాలి .

తర్వాత తగినంత ఉప్పు , స్పూనున్నర కారం వేసి  పైన  చెప్పిన విధంగానే   పోపు  పెట్టుకోవచ్చు.

ఇంక  ఇందాక  పప్పు  నీళ్ళు మిగిలితే  ఏం చెయ్యాలి  ?

పప్పు  కట్టు  చేసుకోవచ్చు.

ఆ  నీళ్ళలో   అర గరిటెడు  ఉడికిన  పప్పు కలిపి  కొద్దిగా  ఉప్పు కలిపి ,
కొద్దిగా  పసుపు వేసి  ఎండు  మిరపకాయలు , ఆవాలు , జీలకర్ర ,
ఇంగువ  , కరివేపాకు   వేసి  పోపు  పెట్టుకుంటే  బలవర్ధక మైన  పప్పు కట్టు  రెడీ.

మీకు  పప్పు కట్టు  చప్పగా  అన్పిస్తే
కొద్దిగా   నిమ్మరసం  పిండుకోండి .

ఫోటోలు .

కందిపప్పు తో మెంతికూర  పొడికూర మరియు మెంతికూర పప్పు .

బాపట్ల మెంతికూర .

పచ్చిశనగపప్పు తో మెంతికూర పొడి కూర .

వంకాయ కాల్చిన బజ్జీ పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

వంకాయ  కాల్చిన  పచ్చడి . (  వంకాయ బజ్జీ  పచ్చడి )

కావలసినవి .

గుండ్రని వంకాయలు  --  మూడు.
పచ్చిమిర్చి  --  8
కొత్తిమీర  --  ఒక  కట్ట
చింతపండు  --  నిమ్మకాయంత
పసుపు  --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత .

పోపునకు .

నూనె  --  మూడు  స్పూన్లు
ఎండుమిరపకాయలు  --- 6
మినపప్పు  --  స్పూను
ఆవాలు  --   అర స్పూను
జీలకర్ర  --  పావు స్పూను
ఇంగువ  --  కొద్దిగా

తయారీ విధానము .

ముందుగా  వంకాయలు పైన  నూనె రాసి  స్టౌ  సిమ్ లో  పెట్టి  అన్ని  వైపులా  కాల్చుకుని  చల్లారగానే  తడి చేతితో  పై తొక్క మరియు  తొడిమ  తీసుకుని  వేరే  ప్లేటులో పెట్టు కోవాలి .

వీటి పైన  కొద్దిగా  పసుపు వేసుకోవాలి .

చింతపండు  విడదీసి  నీళ్ళలో తడుపు కోవాలి .

ఇప్పుడు   స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తం నూనె  వేసి , నూనె బాగా  కాగగానే   వరుసగా ఎండుమిర్చి   ముక్కలు , మినపప్పు  , ఆవాలు , జీలకర్ర ,  ఇంగువ  వేసి  పోపు  వేయించుకోవాలి .

పోపు  చల్లారగానే  ముందుగా  మిక్సీ లో  ఎండుమిరపకాయలు , చింతపండు , ఉప్పు వేసి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత పచ్చిమిరపకాయలు  మరియు  వేసి  మెత్తగా  వేసుకోవాలి .

తర్వాత  కాలిన  వంకాయలు , మిగిలిన  పోపు  మరియు కొత్తిమీర కూడా వేసి  ఒకసారి  మిక్సీ  వేసుకోవాలి .

అంతే  దోశెలు , చపాతీలు  మరియు  భోజనము  లోకి  వంకాయ  కాల్చిన    పచ్చడి  సిద్ధం.

ఆకాకర కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

ఆకాకరకాయలు .

నిన్న అనుకోకుండా  మార్కెట్ లో  ఆకాకరకాయలు   కనపడ్డాయి .

వెంటనే  కొన్నాను.

ఆకాకరకాయ  కూర  రుచే  భిన్నంగా  ఉంటుంది .

ఆ  గింజలు  వేగి  కూరకు  మరింత రుచి వస్తుంది .

మరి  ఆకాకరకాయ  వేపుడు  తయారీ  విధానము.

కావలసినవి .

ఆకాకరకాయలు  --  పావుకిలో
ఎండుమిరపకాయలు  -- 3
చాయమినపప్పు  -- స్పూను
ఆవాలు  --  అర స్పూను .
నూనె  --  నాలుగు స్పూన్లు
కరివేపాకు  --  మూడు రెమ్మలు.

తయారీ విధానము .

ముందుగా  ఆకాకరకాయలను  చిన్న ముక్కలుగా , గింజలతో సహా తరుగు కోవాలి .

తర్వాత  రెండు స్పూన్లు  ఎండుకారంలో  స్పూను  జీలకర్ర  మరియు  సరిపడా  ఉప్పు వేసి  మిక్సీ లో  మెత్తని  పొడిగా  చేసుకుని  విడిగా  ఉంచుకోండి .

తర్వాత  స్టౌ మీద బాండీ పెట్టి  మొత్తం  నూనె  పోసి ఎండుమిరపకాయల  ముక్కలు , చాయమినపప్పు , ఆవాలు మరియు  కరివేపాకు  వేసి పోపు పెట్టుకుని  తర్వాత  ఆకాకరకాయ  ముక్కలను కూడా వేసి  మీడియం సెగన  వేయించుకుని  చివరగా  సిద్ధం చేసుకున్న జీలకర్ర  కారం  వేసుకుని  మరో  మూడు నిముషాలు  ఉంచి  దింపుకోవాలి .

మెత్తగా  ఇష్టమైన వారు మూతపెట్టి  ముక్కలను  మగ్గ పెట్టు కోవచ్చును.

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  ఆకాకరకాయ  వేపుడు  సర్వింగ్  కు సిద్ధం.

సాంబారు పొడి

ఆలూరు కృష్ణ ప్రసాదు .

సాంబారు  పొడి .

సాంబారు  రుచికరంగా  తయారవ్వాలంటే  సాంబారు  పొడి  కాని  లేక సాంబారు  ముద్ద  కాని  వేసుకోవాలి .

దక్షిణాదిన  తమిళనాడు వారే  రక రకాల  సాంబారులు  ప్రతి రోజు  పెట్టుకుంటారు .

ప్రతిరోజు  భోజనములో వారు సాంబారుతో పాటుగా  రసము కూడా  పెట్టుకుంటారు .

దక్షిణాది వారు  సాంబారులో  అన్ని రకములైన కాయగూరలు మరియు ఎక్కువ  మోతాదులో  పప్పు వేసి  బాగా  చిక్కగా  సాంబారు  పెట్టుకుంటారు.

ఉదయం ఇడ్లీ , వడలు  మొదలైన  టిఫిన్ల లో  సాంబారు  ఒక రకంగా , మధ్యాహ్నము  భోజనము  లోకి  సాంబారు  మరో రకంగా  పెట్టుకుంటారు .

మన ఆంధ్రాలో  దొరికే  సాంబారు  పొడులు  అంత రుచిగా  ఉండవు .

తమిళనాడులో  అంబిక , శక్తి  ఇంకా  ఇతర కంపెనీ వారి సాంబారు పొడులు  ప్రతి షాపులోను  విరివిగా  దొరుకుతాయి .

వాటిలో  With మసాలా , Without  మసాలా అని  కూడా  ఉంటాయి .

మసాలా  అంటే  దాల్చిన  చెక్క మరియు లవంగాలు వాసన వేస్తూ  పొడి చాలా ఘూటుగా  ఉంటుంది .

మసాలా వేయనిది  అంటే  పై వస్తువులు  వేయకుండా  చేసినది కూడా దొరుకుతుంది .

మామూలుగా  సాంబారు లోకి  మసాలా  వేయనిదే  రుచిగా  ఉంటుంది .

ఈ సాంబారు పొడి  నెలకు సరిపడా  ఇంట్లోనే  తయారు చేసుకోవచ్చు .

సాంబారు పొడి .

తయారీ  విధానము .

కావలసినవి.

ఎండుమిరపకాయలు  -- 15
చాయమినపప్పు  -- 75 గ్రాములు
పచ్చి శనగపప్పు  -- 50 గ్రాములు.
కందిపప్పు  --  25 గ్రాములు
బియ్యము  --  రెండు స్పూన్లు 
మెంతులు  --  స్పూను
జీలకర్ర  --  స్పూను
ఆవాలు --  అర స్పూను.
ధనియాలు  --  100 గ్రాములు.
మిరియాలు  --  షుమారు  25
ఇంగువ  --  పొడి  కాకుండా  పలుకులు 5 ముక్కలు
కరివేపాకు  --  తడి లేకుండా  పొడిది  ఒకటిన్నర  కప్పు.
పసుపు  --  ఒక స్పూను.

తయారీ  విధానము .

ముందుగా  చాయ మినపప్పు , పచ్చి శనగపప్పు , కందిపప్పు , బియ్యము , ధనియాలు  నూనె  అసలు  వేయకుండా  ఒక బాండిలో  కమ్మని  వాసన వచ్చేదాకా  వేయించుకుని  విడిగా  వేరే పళ్ళెంలోకి  తీసుకోండి .

దానిపైన  స్పూను  పసుపు  వేసుకోండి .

ఆ తర్వాత స్టౌ మీద  బాండీ  పెట్టి  కరివేపాకు  నూనె  వేయకుండా  ఎర్రగా వేయించుకుని  వేరేగా ఉంచుకోండి .

ఆ తర్వాత  తిరిగి  బాండిలో  నూనె లేకుండా  ఎండుమిరపకాయలు ,  మెంతులు , జీలకర్ర , ఆవాలు , మిరియాలు , ఇంగువ పలుకులు కూడా  వేసి  వేయించుకోండి .

ముందుగా  మిక్సీ లో  మొదట వేయించుకున్న ధనియాలు , శనగపప్పు , కందిపప్పు , మినపప్పు  తదితర మిశ్రమాన్ని  వేసి  మెత్తగా  పొడి వేసుకుని  ఒక బేసిన్  లో  తీసుకోండి .

తర్వాత  రెండవసారి  వేసుకున్న  ఎండుమిరపకాయలు , జీలకర్ర , మెంతులు , ఇంగువ మిశ్రమాన్ని ,  వేయించిన  కరివేపాకు  కూడా  వేసి   మిక్సీ లో మెత్తగా  వేసుకుని  ముందు తీసుకున్న  బేసిన్  లో  వేసుకుని  రెండూ చేతితో బాగా  కలుపుకుని  ఒక  సీసాలో  పోసుకుని  ఫ్రిజ్ లో పెట్టుకుని  అవసరమైనప్పుడు మూడు  స్పూన్లు  చొప్పున  సాంబారు లో  వేసుకుని , తిరిగి  సీసాను  ఫ్రిజ్ లో పెట్టుకుంటే  నాలుగు  నెలలు పైన  ఈ సాంబారు  పొడి  ఘమ ఘమ లాడుతూ  సాంబారుకు  మంచి రుచి  వస్తుంది.

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి