Thursday, September 21, 2017

నిమ్మకాయరసంతో రవ్వపులిహోర

నిమ్మకాయ రసము తో  రవ్వ పులిహోర.

కావలసినవి .

బియ్యపు  రవ్వ  --  ఒక  గ్లాసు
నిమ్మకాయలు  --  మూడు
పసుపు  --   అరస్పూను
ఉప్పు  ---  తగినంత
కరివేపాకు  ---  నాలుగు  రెమ్మలు
పచ్చిమిరపకాయలు  --  6
వేరు శనగ  గుళ్ళు  ---  పావు కప్పు
నూనె  ---  100  గ్రాములు 

పోపు  సామగ్రి .

ఎండుమిరపకాయలు   ---  6
పచ్చి శనగపప్పు  ---  మూడు  స్పూన్లు .
చాయమినపప్పు  --  రెండు స్పూన్లు
ఆవాలు  ---  స్పూను
జీలకర్ర   --  పావు  స్పూను
ఇంగువ  --  మరి  కాస్త
జీడిపప్పు  -  15  పలుకులు

తయారీ  విధానము .

ముందుగా   మూడు నిమ్మ కాయలు  కట్  చేసుకుని   చేదు  దిగకుండా  రసం  తీసుకుని   వేరే  కప్పు లో  ఉంచుకోవాలి .

పచ్చిమిరపకాయలు   నిలువుగా   చీలికలు గా  కట్ చేసుకోవాలి .

స్టౌ  వెలిగించి  ఒక  గిన్నెలో  రెండున్నర  గ్లాసులు  నీళ్ళు   పోసుకుని  బాగా తెర్ల  నివ్వాలి .

నీళ్ళు   మరుగు తున్నప్పుడు  ఒక  స్పూను  నూనె  వేసి  కొంచెం   ఉప్పు వేసి  గ్లాసు  బియ్యము  రవ్వ వేసి బాగా  ఉడక నివ్వాలి  .

ఆ విధంగా  ఉడికిన  రవ్వను  ఒక  బేసిన్  లోకి  వంపుకుని  ,  నాలుగు  స్పూన్లు   నూనె  ,  కొంచెం   పసుపు  , కరివేపాకు  వేసి  గరిటతో  ఉండలు  లేకుండా బాగా  కలుపుకోవాలి.

ఇప్పుడు  మళ్ళీ  స్టౌ వెలిగించి   బాండి  పెట్టి  మిగిలిన   నూనె  వేసి  వరుసగా  ఎండుమిరపకాయలు  (  తుంపకుండా  ) ,  పచ్చి శనగపప్పు ,  చాయమినపప్పు ,
వేరుశనగ   గుళ్ళు  ,  ఆవాలు ,పచ్చి మిర్చి ,
కరివేపాకు  ,  జీడిపప్పు  , ఇంగువ  వేసి  పోపు  బాగా  వేగ నివ్వాలి .

పోపు  వేగిన  వెంటనే ,  ముందుగా  సిద్ధం  గా  చేసుకున్న  నిమ్మ రసం , పోపు  కూడా  వేసి  గరిటతో  బాగా  కలుపుకోవాలి .

ఉప్పు  సరిపోయిందో  లేదో  చూసుకుని  అవసరమయితే  కలుపుకోవాలి .

అంతే  ఘుమ  ఘుమ లాడే  నిమ్మ కాయలతో రవ్వ  పులిహోర  సర్వింగ్  కు సిద్ధం .

ఈ  రవ్వ  పులిహోర  రెండు  రోజులు  నిల్వ ఉంటుంది   కాబట్టి దూర  ప్రయాణము లకు  వెళ్ళే వారు  నిక్షేపంగా  తయారు  చేసుకుని   తీసుకు  వెళ్ళవచ్చును.

నిన్న మా  ఇంటికి   వచ్చిన  మా  అక్క  గారు  గ్లాసు బియ్యానికి  రెండున్నర గ్లాసుల  నీళ్ళు పోసుకుని  కుక్కర్ లో పెట్టి  మూడు విజిల్స్ వచ్చాక  స్టౌ  ఆపింది .

మామూలుగా  గిన్నెలో  వండిన  విధంగా   పొడి పొడిగా  ఉడికి  బాగుంది.

కావున  కుక్కర్  లో  కూడా పెట్టుకోవచ్చును

చింతపండు పచ్చడి

చింతపండు  పచ్చడి .

చింతపండు  పచ్చడి . నాకు  తెలిసినంత వరకు  ఈ పచ్చడి ఫక్తు  గుంటూరు  జిల్లా పచ్చడి .

చిన్నప్పుడు  బామ్మ చేసి పెట్టేది .

నాకు అప్పుడు   ఐదారు  ఏళ్ళ వయస్సు ఉండేదేమో .

అందులో  ఏమేమి  వేసి చేసేదో  అర్ధం అయ్యేది  కాదు . ఆ ఆలోచన కూడా ఉండేది కాదు.

కందిపచ్చడి  చేసినప్పుడు , నెయ్యి వేసి కందిపప్పు  వేయించి కుంపటి మీద కంచు గిన్నెలో  ముద్ద పప్పు వండినప్పుడు , శనగపప్పు  ఉడకపెట్టి   పోపు వేసి  అందులో  పచ్చి కొబ్బరి తురుము  వేసి  కూర  చేసినప్పుడు ,  మా బామ్మ తప్పనిసరిగా  పక్కన  చింతపండు  పచ్చడి  చేసేది .

పైన  చెప్పిన  వంటకాలలో  చింతపండు  పచ్చడి ఈ వంటకాల పక్కన  ఆదరువుగా  అద్భుతంగా  ఉండేది .

ఆరోజుల్లో  ఫ్రిజ్ లు ఎక్కడవి ?

మడి  అంటే  ముట్టుకోరని  ఆ పేరు మీద  రాచ్చిప్పల్లో  దాచేవారు .

ఈ చింతపండు  పచ్చడి  చెక్కు  చెదరకుండా  ఐదారు రోజులు  పైనే  నిల్వ ఉండేది .

ఆ తర్వాత పచ్చడి  ఇంకా  మిగిలితే  ఉల్లిపాయలు  చిన్న చిన్న  ముక్కలుగా  తరిగి  నూనెలో  మినపప్పు , ఎండుమిర్చి , ఆవాలు , ఇంగువ  మరియు  కరివేపాకు తో  పోపు  వేసి అందులో  తరిగిన  ఉల్లిపాయల  ముక్కలు  వేసి పోపులో  మగ్గనిచ్చి , తర్వాత పోపును  ఈ చింతపండు  పచ్చడిలో  వేసి  స్పూనుతో  బాగా  కలిపి  స్కూళ్ళకు  హడావుడిగా  పరిగెత్తే  మాకు  అన్నం లోకి  వేసి  పెట్టేది .

తియ్య తియ్యగా  ఉండే  ఆ పచ్చడి వేసుకుని  తిని , కంచాలు  కూడా నాకేసి  స్కూళ్ళకు  బ్యాగ్ లు  భుజాన వేసుకొని  పరిగెత్తే వాళ్ళం.

ఆ నాటి నుండి  ఈ  చింతపండు  పచ్చడి  రుచి  అలా ఉండి పోయింది .

చాలా  సార్లు  మా ఇంట్లో , అప్పుడప్పుడు  ఇతరుల  ఇళ్ళల్లో  తిన్నా , ఆ రుచి  బలంగా బుర్రలో  ఉండి పోవడం వలన బాగుంది కాని  బామ్మ చేసిన పచ్చడి రుచి రాలేదు  అని తిన్న  ప్రతిసారి అనుకునే వాణ్ణి .

ఆ లోటును   మా బామ్మకు  వరుసకు  మనవరాలు నాకు వరుసకు అక్క అయిన ఆమె  ఈ మధ్యనే  తీర్చింది .

ఇటీవల  ఓ పెళ్ళిలో  కలిసినప్పుడు  మా బామ్మ చేసిన చింతపండు  పచ్చడి గురించి  చాలా సేపు వర్ణించి మరీ చెప్పాను .

ఏం మాట్లాడకుండా అన్నీ నవ్వుతూ  వింది.

చివరలో  ఓ ఆదివారం మా ఇంటికి  భోజనానికి  రమ్మంది .

నేను అలాగే అంటూ  రెండుసార్లు  వాయిదా వేసినా , తనే ఫోను చేసి  ఈ  ఆదివారం మా ఇంటికి  భోజనానికి  వస్తున్నావు అంతే . ఇంకేం మాట్లాడకు  అని ఫోను పెట్టేసింది .

మరీ అంతగా మాటిమాటికి బ్రతిమాలించుకోవడం సభ్యత కాదని  భోజనానికి  వెళ్ళాను .

మెనూ అంతా  బామ్మదే .
ముద్ద పప్పు , గుత్తివంకాయ  పొడి కొట్టి కూరిన కూర , ముక్కల పులుసు , చింతపండు  పచ్చడి  మరియు పెరుగు .

పక్కనే  నేతి గిన్నెలో  ఘమ ఘమ లాడుతున్న  వెన్న కాచిన నెయ్యి .

అరటి ఆకులో అచ్చంగా  తెలుగు భోజనము  నోరూరిస్తూ  ఆహ్వానిస్తోంది .

ముందుగా  పచ్చడి  బాగా నెయ్యి వేసి కలుపుకునే అలవాటు ఉన్న నాకు  చింతపండు  పచ్చడి కలుపుకొబేయే ముందు  వేలితో  నాలిక్కి రాసుకుని చూద్దును కదా అద్భుతం .

మళ్ళీ మా బామ్మ చేసిన పచ్చడే గుర్తుకు  వచ్చింది .

పెళ్ళిలో  మా బామ్మ చేసిన చింతపండు  పచ్చడి  గురించి   అక్కతో తెగ మాట్లాడాను కదా .

ఆ విషయం తన  బుర్రలో  రికార్డయి పోయిందేమో .
నవ్వుతూ అడిగింది  ఎలా ఉంది పచ్చడి ?  అమ్మమ్మ చేసిన పచ్చడిలా  ఉందా ? లేదా ?  అని .

ఏమనాలో తెలియక  మా బామ్మని  మరిపించావు ? అన్నాను .

బామ్మ దగ్గర  ఎప్పుడు  నేర్చుకున్నావు  ? అని  అడిగాను .

లేదు  మా అమ్మ నేర్పింది  అంది .

భోజనము  పూర్తయ్యాక ఇంటికి  వెళ్ళబోతుంటే  ఒక్క నిముషం  ఉండు  అని  GDR  ఇంగువ  డబ్బా  పెట్టే  పైన  Container నిండా  చింతపండు  పచ్చడి  పెట్టి , ఇంటికి  తీసుకెళ్ళు అని  నా చేతిలో  పెట్టింది .

అప్పుడు  మనసులో  పర్వాలేదు  ఇంకా  బంధువుల్లో ఆనాటి  రుచులూ , అభిమానాలు కొందరిలో నైనా  మిగిలి  ఉన్నాయి అనుకుంటూ ఇల్లు చేరాను .

Sunday, September 3, 2017

బొంబాయి చట్నీ

బొంబాయి  చట్నీ  .

కావలసినవి .

శనగపిండి  ---  మూడు స్పూన్లు
చింతపండు  --  ఉసిరి కాయంత
నీళ్ళలో  పది నిముషముల  ముందు  నానబెట్టి  పల్చగా   గ్లాసుడు  రసం  తీసుకోవాలి .

పచ్చిమిరపకాయలు  --  5  .

ముక్కలుగా  తరుగు కోవాలి.

ఉప్పు   --  తగినంత

పోపునకు .

నూనె  --   రెండు స్పూన్లు
పచ్చి శనగపప్పు  --  స్పూనున్నర .
మినపప్పు  --  స్పూను
జీలకర్ర   --  పావు స్పూను
ఆవాలు  --  అర  స్పూను
కరివేపాకు  --  రెండు  రెమ్మలు.
పసుపు  --  కొద్దిగా .

తయారీ  విధానము .

ముందుగా  సిద్ధంగా  ఉంచుకున్న  చింతపండు   రసంలో  శనపిండి  , పసుపు,  తగినంత  ఉప్పు వేసుకుని  అవసరమయితే  మరో పావు  గ్లాసు  నీళ్ళు  పోసుకుని సిద్ధంగా  ఉంచుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి   రెండు  స్పూన్లు  నూనె  వేసి  నూనె బాగా కాగగానే   వరుసగా   ఎండు మిరపకాయలు ముక్కలు , పచ్చి శనగపప్పు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు  , పచ్చిమిర్చి  ముక్కలు  మరియు కరివేపాకు  వేసి  పోపు  వేసుకోవాలి .

పోపు  వేగగానే  సిద్ధంగా  ఉంచుకున్న   శనగపిండి నీళ్ళను  పోపులో  పోసుకుని  అట్ల కాడతో బాగా  కలుపు తుండాలి .

అయిదు  నిముషములు  అవ్వగానే  శనగపిండి  నీళ్ళలో  బాగా  ఉడుకుతూ  దగ్గర  పడగానే  దింపుకోవాలి.

ఈ పచ్చడిలో  శనగపిండి ఎక్కువైతే  గట్టిగా  ఉంటుంది  .

అంత  రుచిగా  ఉండదు .

కొంచెం  పల్చగా  ఉంటేనే  బాగుంటుంది.

ఈ పచ్చడి  వేడిగా  తింటేనే  బాగుంటుంది.

నాలుగు  గంటల  కంటే  నిల్వ  ఉండదు.

వేడిగా  ఈ  పచ్చడి  ఇడ్లీ, దోశెలు, వడలు  లోకి  బాగుంటుంది .

Friday, September 1, 2017

మామిడి కాయ ముక్కల పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

మామిడి  కాయ  ముక్కల  పచ్చడి .

పుల్లని  పచ్చి  మామిడి  కాయ  --  ఒకటి .

పై చెక్కు  తీసుకుని   చిన్న ముక్కలుగా  తరుగు  కోవాలి .

కారం  ---  మూడు  స్పూన్లు

ఉప్పు  --  తగినంత

పసుపు   --  కొద్దిగా

మెంతిపిండి  ---  ముప్పావు  స్పూను .

పోపునకు .

నూనె    ---  నాలుగు  స్పూన్లు .
ఎండు మిరపకాయలు --  మూడు
ఆవాలు    ---  స్పూను
ఇంగువ  ---  పావు  స్పూను లో  సగం .

తయారీ  విధానము  .

ఒక గిన్నెలో  తరిగిన  మామిడి  కాయ ముక్కలు , తగినంత    ఉప్పు , కొద్దిగా  పసుపు , మూడు స్పూన్లు  కారం, ముప్పావు స్పూను  మెంతి పిండి  వేసి  స్పూనుతో  బాగా  కలుపు కోవాలి .

తర్వాత  స్టౌ  మీద  పోపు  గరిట  పెట్టి  మొత్తము  నూనె  వేసి  నూనె  బాగా  కాగనివ్వాలి .

తర్వాత  అందులో  ఎండు మిరపకాయలు ముక్కలు , ఆవాలు  మరియు  ఇంగువ  వేసి  వేడి  వేడి  పోపు  పచ్చడి లో  వేసి  స్పూనుతో   బాగా  కలుపుకోవాలి.

తీపి  ఇష్టమైన వారు  చిన్న  బెల్లం  ముక్క పొడి  చేసి  పచ్చడిలో  కలుపుకోవచ్చును .

అంతే  పుల్ల  పుల్ల గా  ఇంగువ  సువాసనతో  మామిడి  కాయ  ముక్కల  పచ్చడి  భోజనము లోకి  మరియు  దోశెల లోకి  సర్వింగ్  కు  సిద్దం.

గోంగూర పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

గోంగూరతో  పచ్చడి .

కావలసినవి .

గోంగూర  ---  కట్టలు  -- 2

కట్టలు  విడదీసి  నీళ్ళలో   ముంచి ఇసుక  లేకుండా  బాగా   కడిగి  ఒక్కొక్క  ఆకు  వలుచుకుని  నీడలో  ఆర బెట్టు కోవాలి .

పచ్చి మిరపకాయలు  --  పది

ఉప్పు  --  తగినంత

పసుపు  --  కొద్దిగా.

నూనె  ---  రెండు  స్పూన్లు

పోపుకు  .

నూనె  --  మూడు  స్పూన్లు

మినపప్పు  --  స్పూనున్నర

ఆవాలు  --  స్పూను.

ఇంగువ  ---  కొద్దిగా

తయారీ  విధానము .

ముందుగా  స్టౌ  వెలిగించి  బాండీ  పెట్టి  రెండు  స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా కాగగానే  వలుచుకుని  సిద్ధముగా  ఉంచుకున్న   గోంగూర , పచ్చి మిరపకాయలు  , పసుపు  మరియు  సరిపడా  ఉప్పు వేసి  మూత పెట్టి  బాగా ఆకును    మగ్గ నివ్వాలి .

చల్లారిన  తర్వాత  ఈ  మొత్తము  మిశ్రమము  మిక్సీ లో  మెత్తగా  వేసుకోవాలి .

తర్వాత  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .

మళ్ళీ   స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు   నూనె వేసి  నూనెను  బాగా  కాగనిచ్చి వరుసగా  ఎండు మిరపకాయలు ముక్కలు , ఆవాలు  మరియు  ఇంగువ  వేసి  వేడి  వేడి  పోపు  పచ్చడిలో  వేసుకుని  స్పూనుతో  బాగా  కలుపుకోవాలి .

అంతే  ఇంగువ  సువాసనతో  పుల్ల పుల్లని  రుచితో  గోంగూర  రోటి పచ్చడి  భోజనము  లోకి  సర్వింగ్  కు సిద్ధం.

వేరుశనగ చక్కిలాలు

వేయించిన  శనగపప్పు తో చక్కిలాలు.

కావలసినవి .

బియ్యపు  పిండి --  రెండు కప్పులు.
వేయించిన శనగపప్పు పిండి --
ఒక కప్పు

ఈ పిండి  మిక్సీలో  వేసుకోవచ్చు .

మిక్సీ లో  వేసుకునేటప్పుడు  పప్పు లోనే  సరిపడా ఉప్పు , అర స్పూను  వాము , పావు స్పూను  జీలకర్ర   వేసి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

వెన్న  --  రెండు  స్పూన్లు 

వెన్న  దొరకని  యెడల  నాలుగు  స్పూన్లు  కాచిన  నెయ్యి   వేసుకోవాలి .

కారం  ---  స్పూను

ఇంగువ  ---  పావు స్పూను లో సగం .

నూనె  ---  అరకిలో .

తయారీ  విధానము .

ఒక  బెసిన్లో వేయించిన  శనగపప్పు  పొడి  (  జీలకర్ర , వాము తో  వేసినది ) ,  బియ్యపు  పిండి , కారం, ఇంగువ , వేసుకుని  చేతితో  బాగా  కలుపు కోవాలి . అందులో  వెన్న  కానీ  కాగే  నెయ్యి కాని  పోసి బాగా  కలుపు కోవాలి .

ఇప్పుడు  తగినన్ని  నీళ్ళు పోసుకుంటూ  చక్కిలాలు  వేయటానికి  వీలుగా  కలుపుకోవాలి .

తర్వాత  బాగా పిండిని  మెదాయించుకోవాలి.

ఇప్పుడు   స్టౌ  వెలిగించి   బాండి పెట్టుకుని  మొత్తము  అర కిలో నూనె  పోసి  నూనెను  పొగలు  వచ్చే విధముగా  బాగా  కాగనివ్వాలి.

తర్వాత  పిండిని  చక్కిలాలు  వేసే  గిద్దలో  పెట్టుకుని  స్టౌ  మీడియం  సెగలో  పెట్టి  రెండు  రెండు  చొప్పున  చక్రాలు వేసుకుని బంగారు  రంగులో  వేయించుకుని  తీసేసుకోవాలి .

అంతే  వేయించిన  శనగపప్పు తో  చక్కిలాలు  సర్వింగ్ కు సిద్ధం.

ఈ  చక్కిలాలు  పది రోజులు  నిల్వ ఉంటాయి .

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి