Wednesday, May 27, 2020

టమోటా పులుసు పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

కొత్త వెరైటీగా.

టమోటో  పులుసు పచ్చడి.
కావలసినవి .

పండి  గట్టిగా  ఉన్న టమోటోలు  -   3
ఉల్లిపాయలు -  3
పచ్చిమిర్చి  -   6
కొత్తిమీర   -  ఒక చిన్న కట్ట 
పసుపు  --  కొద్దిగా .

చింతపండు  -  నిమ్మకాయంత
ఉప్పు  -  తగినంత .

పోపుకు .

నూనె  -  నాలుగు  స్పూన్లు .
ఎండుమిర్చి  -   3 .  ముక్కలుగా  చేసుకోవాలి.
చాయమినపప్పు  - స్పూను .
జీలకర్ర  -  పావు స్పూను.
ఆవాలు -  అర  స్పూను 
ఇంగువ  -  కొద్దిగా 
కరివేపాకు  -  రెండు రెమ్మలు. 

తయారీ విధానము .

ముందుగా  చింతపండు  విడదీసి  శుభ్రం చేసుకుని  పావు గ్లాసు వేడి  నీళ్ళల్లో   పావు గంట సేపు  నాన బెట్టుకుని  చిక్కగా  రసం తీసుకోవాలి .

కొత్తిమీర   విడదీసి  శుభ్రం  చేసుకోవాలి.

ఉల్లిపాయలు  సన్నని  ముక్కలుగా  తరుగుకుని  విడిగా  వేరే ప్లేటులో  ఉంచుకోవాలి.

టమోటోలు  ముక్కలుగా  తరుగుకోవాలి. 

ఇప్పుడు  మిక్సీ లో  టమోటో  ముక్కలు , కొత్తిమీర , పచ్చిమిర్చి  , చింతపండు  రసము  మరియు కొద్దిగా  ఉప్పు వేసి  మెత్తగా  గ్రేవి  మాదిరిగా  వేసుకోవాలి .

విడిగా  ఒక  గిన్నెలోకి  తీసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  బాండీ పెట్టి  మొత్తము  నూనె   వేసి  నూనె  బాగా  కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు , చాయమినపప్పు , జీలకర్ర ,  ఆవాలు , ఇంగువ మరియు  కరివేపాకు ను  వేసి  పోపును  బాగా  వేగనివ్వాలి .

అందులోనే  తరిగిన  ఉల్లిపాయ  ముక్కలు , కొద్దిగా  పసుపు  మరియు  సరిపడా  ఉప్పు వేసి  మూత పెట్టి  పది నిముషాలు  ఉల్లిపాయలను  మగ్గనివ్వాలి. 

ఉల్లిపాయలు  మగ్గగానే  ముందుగా  సిద్ధం  చేసుకున్న  గ్రేవి  మిశ్రమమును కూడా  వేసి  గరిటెతో  బాగా  కలిపి  మూత  పెట్టి  మరో  పది నిముషాలు  ఉల్లిపాయ  ముక్కలతో  టమోటో  గ్రేవిని  ఉడకనివ్వాలి .

తరువాత  వేరే డిష్  లోకి  తీసుకుని పైన కొత్తిమీర  వేసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  టమోటో  పులుసు పచ్చడి  భోజనము లోకి, చపాతీలు  రోటీల లోకి  సర్వింగ్  కు సిద్ధం .

ఈ పులుసు పచ్చడిలో  విడిగా  ఎండుకారం వేయనవసరం లేదు.

పచ్చిమిర్చి  టమోటో  కొత్తిమీర లతో  మిక్సీ  వేసుకున్నాము  కనుక  ఆ కారం సరిపోతుంది.

బెల్లం  కూడా  వేయనవసరం లేదు.

ఈ టమోటో  పులుసు పచ్చడి   మూడు రోజులు  నిల్వ ఉంటుంది.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారు చేయు విధానము  మరియు ఫోటో తయారు చేయు సమయమున తీసినది .

అతిథులొచ్చినప్పుడు

అతిథులను  భోజనానికి  మన ఇంటికి ఆహ్వానించినప్పుడు .

ఆలూరుకృష్ణప్రసాదు .

మనందరి  ఇళ్ళల్లో  తరచుగా అతిథులను మన ఇంటికి భోజనానికి  ఆహ్వానించడమనేది  మనందరికీ తరచుగా జరుగుతూనే ఉంటుంది .

Weekends లో సరదాగా  వారింటికి  వీరు  లేదా  వీరింటికి  వారు  families తో  విందు భోజనాలకి  వెళ్ళడమనేది  మామూలే.

ఆ సమయంలో  ఇంటి  ఇల్లాళ్ళకు ప్రధానమైన సమస్య ఏ ఏ పదార్ధాలు తయారు చెయ్యాలి ? 

మనం చేసిన పదార్ధాలు  వారికి  నచ్చుతాయో లేదో ? 

వారు  తింటారో  లేదో ?  అని.

ఇంకా  కొంచెం  మొహమాటం లేకుండా  చెప్పాలంటే   వచ్చే వారి  కులమును బట్టి కూడా పదార్ధాలు  మరియు  వాటిని  తయారు చేయు విధానము కూడా  మారుతుంటాయి.

అయితే  మనవి ప్రధానంగా శాఖాహార భోజన సంఘ సభ్యుల గ్రూపులు కనుక , మనమంతా  శాఖాహారుల  పదార్థములు  గురించి మాత్రమే  ఇక్కడ  ప్రస్తావించడం జరుగుతుంది .

ప్రధానంగా ఈ విందు భోజనాలు  రెండు రకాలు.

మధ్యాహ్నం  విందు  LUNCH.

రాత్రి  విందు  DINNER.

షుమారు  15  మంది లోపు Guest ల కైతే , ఆ ఇంటి ఇల్లాలు  ఆరేడు  ఐటమ్స్  అవలీలగా  వండేస్తారు.

ఏదైనా  ప్రధానంగా  functions  సమయంలో , వచ్చే అతిథులు 25 సంఖ్య దాటినా , వంట మనిషిని పెట్టుకుని చేయించుకోవడం కానీ  లేదా క్యాటరింగ్  ఇవ్వడం  కాని  తప్పని సరి.

మధ్యాహ్నం  భోజనం Lunch కు , రాత్రి  భోజనం  Dinner కు  ఐటమ్స్   మారుతుంటాయి.

లోగడ నన్ను ఐదారుగురు , " రేపు  మా అబ్బాయి పుట్టినరోజు  లేదా మా అమ్మాయి  function ,  ఒక పాతిక మందికి ఏ ఏ ఐటమ్స్ వండితే బాగుంటుందో చెప్పండి  " అని  అడిగారు.

అప్పుడు నాకున్న అవగాహన మేరకు వారికి   ఐటమ్స్  చెప్పాను.

అయితే అచ్చంగా  మన తెలుగింటి  భోజనము  వండి  తృప్తిగా  వచ్చిన అతిధులకు పెట్టాలనుకునే వారికి  మాత్రమే,   నేను ఈ దిగువున  అతిథులను మన ఇంటికి ఆహ్వానించి నప్పుడు ఏ ఏ పదార్ధములు తయారు చేస్తే బాగుంటుందో తెలియచేస్తున్నాను .

మీకు సంతృప్తిగా  నచ్చితేనే  ఇందులో కొన్ని  ఐటమ్స్  అయినా  చేసి పెట్టండి.

ఆ ఇందంతా trash , ఈ రోజుల్లో  ఇవి ఎవడు తింటాడు ? పళ్ళాలు విసిరేస్తారు.
విస్తళ్ళముందు నించి  లేచి పోతారు . మా పిల్లలకు పిలిచే అతిధులకు Northern Dishes కావాలి అనే వాళ్ళు , కామెంట్  చేసే వాళ్ళకు  ఒకటే నా సవినయ విజ్ఞప్తి .

" అయ్యా / అమ్మా .

ఈ పోస్టింగు  మీ కొరకు  కాదు.
మాలాంటి ఛాందస భావాలు కలిగిన పాత తరం వారికి .  మీ వంటి ఆధునిక భావాలు కలవారు దయచేసి ఈ పోస్టింగు  చదవవద్దు. ఒకవేళ చదివినా  మీరు పట్టించుకోవద్దు. దయచేసి ఏ విధమైన  negative Comment చేయవద్దు. మీకు తోచిన పద్ధతిలోనే మీరు సాగిపోండి . "

ఇంక అసలు విషయానికి  వద్దాము.

అతిథులను భోజనానికి  పిలిచినప్పుడు మీ ఇంట్లో ఐటమ్స్  లో వెల్లుల్లి  వాడే అలవాటు ఉన్నా మీరు ఆ రోజు వంటల్లో వెల్లుల్లి  వేయకండి. ఎందుకంటే  వెల్లుల్లి  అసలు తినని వారు చాలా మంది ఉంటున్నారు. అటువంటి వారు ఆ ఐటమ్ వేసుకోరు. తెలియక మనం చేసి వారికి  వడ్డించినా  వారు తినకుండా పారేస్తారు. పదార్ధం వృధా అవడమే గాక వారికి మనకి అసంతృప్తి .

సాధ్యమయినంత వరకు  పెద్ద ఉల్లి పాయను కూడా పదార్ధాలలో ఆ రోజు వాడకుండా ఉంటే మంచిది . చాలా మంది గురువారము , శనివారము పెద్ద ఉల్లిపాయ తినరు. ఈ మధ్య కొంతమంది   " మేము  అసలు  ఉల్లిపాయ  తినము , ఉల్లిపాయలు  వేయని  ఐటమ్స్  చెప్పండి ". అని  అంటున్నారు .

వెజిటబుల్  బిర్యానీ వంటి మసాలా పదార్ధాన్ని చేసే కన్నా , చింతపండు  పులిహోర కానీ  నిమ్మకాయ పులిహోర కానీ లేదా మామిడి  కాయ తురుముతో పులిహోర కానీ  చక్కగా  జీడిపప్పులు  మరియు వేరుశనగ  గుళ్ళు  వేసుకుని , ఒక ఐటమ్ గా చేసుకుంటే బాగుంటుంది.
మరో ఐటమ్ గా గారెలు వంటి Heavy ఐటమ్ కంటే  అరటికాయతో బజ్జీలు వేసుకుంటే బాగుంటుంది.

స్వీట్  చేయాలనుకుంటే  సేమియా , సగ్గు బియ్యం  కలిపి పాయసం చేసుకుంటే బాగుంటుంది.

పిండి వంటలు ఇంతవరకు  చాలు.

గారెలు , పూర్ణం బూరెలు , సజ్జప్పాలు  ఇటువంటివి ఏవైనా ప్రత్యేక సందర్భాలలో  మాత్రమే వడ్డనకు బాగుంటాయి. 

విడి రోజుల్లో  ఇంతకన్నా అవసరం లేదు.

ఇంక అతిధులు Lunch కు వచ్చే పక్షంలో
మధ్యాహ్నము  భోజనానికి .

1. దోసకాయ పప్పు లేదా టమోటో  పప్పు లేదా మామిడి  కాయ పప్పు ( ఈ మూడింటిలో  పెద్ద ఉల్లిపాయ వేయకుండా )  ఒక ఐటమ్  వండు కోవచ్చును.

సాధారణంగా  functions  లో  ముద్దపప్పు వండరు. కలగలపు పప్పు మాత్రమే వండుతారు.

ఈ  మూడు పప్పులలో ఎది  వండినా  ఊర మిరపకాయలు  మరియు గుమ్మడి వడియాలు వేయించుకుంటే చాలా బాగుంటుంది.

2. ఇంక కూర విషయానికి వస్తే నూటికి  80 శాతం మంది  ఏ functions  లో అయినా  మొట్టమొదటగా ఇష్టపడేది  వంకాయ కూర. తర్వాత దొండకాయ కూర. మూడో పక్షం బెండకాయ కూర.

వంకాయలు పుచ్చులు లేకుండా కాయలు లేతగా ఉంటే , ఎండుమిరపకాయలు , మినపప్పు , పచ్చిశనగపప్పు , జీలకర్ర మరియు ఇంగువ వేసుకుని  నూనెలో వేయించి  తగినంత  ఉప్పువేసుకుని పొడి కొట్టుకుని కాయలలో కూరుకుని నూనెలో మగ్గపెట్టుకుని కూర చేసుకుంటే , ఈ వంకాయ కాయల పళంగా కూర అందరూ ఇష్ట పడతారు. ఇది అందరూ మెచ్చుకునే కూర.

కాని పక్షంలో  దొండకాయ చీలికలుగా తరిగి ఎండుమిరపకాయలు , మినపప్పు , పచ్చిశనగపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకును నూనెలో వేసుకుని  ముక్కలను మగ్గపెట్టి చివరలో తగినంత ఉప్పు కారం వేసుకుని  పోపు కూర చేసుకోవచ్చును. ఈ కూర కూడా  చాలా మంది ఇష్ట పడతారు.

చివరగా బెండకాయ జిగురు అని చాలా మంది పోపు కూర ఇష్టపడరు. పై రెండు వీలుకాని పక్షంలో బెండకాయ ముక్కలు తరిగి  నూనెలో  fry చేసి పావు చిప్ప ఎండుకొబ్బరి కోరాముతో కోరి  అందులో వేసి , ఒక పదిహేను జీడిపప్పు  పలుకులు వేసి , ఉప్పు కారం చల్లుకుంటే  కూర కలర్ ఫుల్ గా కనపడటమే కాకుండా  రుచిగా  కూడా ఉంటుంది .

ఇంక అతిధులను భోజనానికి  పిలిచినప్పుడు సాధారణంగా  ఆకు కూరలతో పప్పు , మరియు కాకరకాయ , క్యాబేజీ , క్యాలీఫ్లవర్ వంటివి  వండరు. ఆ కూరలు వారికి ఇష్టమో కాదో తెలియనప్పుడు అవి  చేయకపోవడమే మంచిది.

3. పచ్చడులు.

దోసకాయ ముక్కలుగా తరిగి కొత్తిమీర  వేసుకుని ముక్కల పచ్చడి చేసుకుంటే బాగుంటుంది.
 
లేదా

మామిడి కాయ  ముక్కలతో మెంతి బద్దలు వేసుకుని  మామిడి  కాయ ముక్కల పచ్చడి బాగుంటుంది.

లేదా 

కొబ్బరి పచ్చడి కాని  కొబ్బరి మామిడి కాయ పచ్చడి కాని  చేసుకున్నా బాగుంటుంది .

లేదా

గోంగూర  అకు -  ఎండుమిరపకాయలు , మెంతులు , ఆవాలు , ఇంగువ నూనెలో వేసి గోంగూర ఆకు మరియు కొద్దిగా  పసుపు వేసి మగ్గబెట్టి , తగినంత ఉప్పు వేసి పచ్చడి చేసుకొనవచ్చును .

ఈ పచ్చడి కూడా  పుల్ల పుల్లగా ఉంటుంది కనుక అతిధులకు  నచ్చుతుంది.

ఇంక ఈ వేసవికాలం ఆవకాయల సీజన్ లో  కొత్తావకాయ  మరియు  నోరూరించే  మాగాయ వంటివి  విడిగా  bowl లో తీసి పెడితే  ఇంక చెప్పే దేముంది ?

4.  లిక్విడ్ ఐటమ్ .

అతిధులు  వచ్చినప్పుడు చారు కన్నా ముక్కల పులుసు వండితేనే  బాగుంటుంది. చింతపండు  రసములో అన్ని ముక్కలు వేసి తగినంత ఉప్పు పసుపు వేసి ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , ధనియాలు , కొంచెం  మెంతులు , కొంచెం  జీలకర్ర  , ఎండు కొబ్బరి , ఇంగువ వేసుకుని నూనెలో వేయించి  పొడి కొట్టుకుని ఆ పొడి మరుగుతున్న పులుసులో వేసుకుని  పులుసు పెట్టుకుంటే ఆ పులుసు రుచే వేరు.

5. అతిథులు వచ్చినప్పుడు  మజ్జిగ  కన్నా పెరుగు బాగుంటుంది. ఈ వేసవికాలం పెరుగు  అన్నంలో తయారైన బంగినపల్లి మామిడి పండు ముక్కలు కోసి అతిధులకు వడ్డిస్తే విందుకు శోభ వస్తుంది.

6. తాంబూలము లేదా కిళ్ళీలు గా చుట్టి ఇస్తే అతిధులు సంతోషిస్తారు.

7.  నేను చెప్పినది  మధ్యాహ్నం  భోజనం  Lunch  లో items ఏం చేస్తే బాగుంటుందో సూచనా ప్రాయంగా నా సలహా మాత్రమే. 

8. రాత్రి  Dinner కు అతిథులను ఆహ్వానిస్తే menu కొద్దిగా  మారుతుంది . ఈ పోస్టింగు  మీకు నచ్చితే  త్వరలో Dinner items ఏమి చేయాలో కూడా తెలియచేస్తాను.

9.  కమ్మని  నెయ్యి తో  పైన  తెలిపిన  పదార్ధాలను  వడ్డించారా !!  ఇక  అతిధులు  తృప్తిగా  భోజనము  చేసి  " అన్నదాతా  సుఖీభవ !!  " అని  అనకుండా  ఉంటారా చెప్పండి.

10.  చివరగా  " తాళము వేసితిని  గొళ్ళెము మరచితిని " అనే సామెత చెప్పినట్లు  మల్లెపూవు లాంటి  వేడి వేడి అన్నం వండటం మాత్రం  మరచి పోకండి.

చివరగా  అతిథులను  భోజనానికి  ఆహ్వానించే వారికి  నా  విజ్ఞప్తి. " గంగి గోవు పాలు  గరిటెడైనను  చాలు  కడివెడైన  నేమి  ఖరము  పాలు  "  అన్నట్లుగా   మీరు వడ్డించే  పదార్ధాలు  తక్కువ  ఐటమ్స్  ఐనా  మీరు  ఆప్యాయంగా  నవ్వుతూ  వడ్డిస్తే  భుజించే  వారు  బ్రహ్మానందపడిపోతారు.

మహిళలందరికీ  కృతజ్ఞతాపూర్వకధన్యవాదములు.
ఆలూరుకృష్ణప్రసాదు .
కారణం వండే శ్రమంతా  మీదే కనుక.

తిరుమల స్వామి వారి వడలు



మిత్రులందరికీ   ఓ  ప్రత్యేకమైన  ప్రసాదము.

తిరుమల  స్వామి  వారి వడలు.
ఆలూరుకృష్ణప్రసాదు .

తిరుమల  స్వామి  దర్శనానికి  వెడుతున్నామనగానే , మిత్రులందరూ  " చాలా  సంతోషమండీ . మీరు  తిరిగి  వచ్చేటప్పుడు  మాకు  రెండు  లడ్డూలు  తెచ్చి పెట్టండి . మీరు  రాగానే  మీకు  నేను  డబ్బులు  ఇస్తాను " . అంటారు.

అక్కడ  మనకే  మనం చేయించుకునే  సేవలు  లేక  దర్శనం  టిక్కెట్  ధరలను  బట్టి  మనకు  ఒకటి  లేదా  రెండు  లడ్డూలు  ఇస్తారు. అవి  మనకు  మన బంధువులకు  ప్రసాదం పంచడానికే  సరిపోతాయి. అదీ  దర్శనం చేసుకున్నాక  గంట సేపు లడ్డూల ప్రత్యేక  క్యూలో నిలబడితే  ఆ రెండూ లడ్డూలయినా  మనకు  దక్కుతాయి.

ఇక మోహమాటస్తులకు  ఎక్కడినుండి  తెస్తాము ?

విచిత్రం  ఏమిటంటే  అన్య మతస్ధుడైన  నా స్నేహితునితో  " రేపు  మా దంపతులిరువురమూ  తిరుపతి  స్వామి వారి దర్శనానికి  వెడుతున్నామని " చెబితే  తన పర్సులో నుండి  రూ. 200 /   తీసి "  బాసూ !  మా పిల్లలిద్దరికీ  మీ  తిరుపతి  లడ్డూలంటే  చాలా  ఇష్టం . నాకో నాలుగు  లడ్డూలు  తెచ్చి పెట్టవా ?  "  అంటూ నోటు ఇవ్వబోయాడు.

 తిరుమలేమైనా  స్వీట్స్  షాపా  ?ప్రసాదంగా కాకుండా  ఫలహారంగా  తినడానికి  అని  మనసులోనే  నేను అనుకుని  " డబ్బులు  తీసుకు వచ్చాక తీసుకుంటాను. ఇప్పుడు  వద్దులే " అని  తిరస్కరించాను.  అతను అలా అడగడం  నాకు  మనస్కరించక అతనికి  లడ్డూలు తేలేదు. తిరిగి వచ్చాక ఏదో  సర్ధి  చెప్పాను.

మనం  తేకపోతే  తెమ్మన్న వారు  మొహం మాడ్చుకుంటారు. పాపం  వారికే  తెచ్చుకోవడం  కష్టం కదా అని కూడా  ఆలోచించరు.  మీకు తెచ్చి పెట్టడం మాకు  కష్టమని  వారి మొహాన  మనం చెప్పలేము.

అందుకని  పాపమో  పుణ్యమో  ఎవ్వరికీ  చెప్పకుండా  గుట్టు చప్పుడు కాకుండా  తిరుమల వెళ్ళి  తలనీలాలు  ఇచ్చి ( తిరుమల  వెళ్ళిన  ప్రతి సారీ  తల నీలాలు  సమర్పించే ఆ జన్మ మొక్కు నాకు  ఉంది  ) స్వామి దర్శనం చేసుకుని , మా టిక్కెట్  కు వచ్చిన  లడ్డూ  ప్రసాదాలు  తీసుకుని  , తిరిగి వచ్చాక  మా  అపార్ట్ మెంట్ లో  వారికి , లోకల్ గా ఉన్న బంధుమిత్రులకు  స్వామి  ప్రసాదం  పంచడం  అలవాటు  చేసుకున్నాం. 

ఇంక  వెనుకటి  రోజుల్లో   లడ్డూలతో  పాటుగా  స్వామి  వారి  వడల  ప్రసాదం కూడా  విక్రయించేవారు. 

స్వామి  వారి  లడ్డూల కెంత  డిమాండ్  ఉండేదో , స్వామి  వారి  వడలకు  కూడా ఆ రోజుల్లో   అంతే  డిమాండ్  ఉండేది. ఆ మాటకొస్తే  వడలు  ఇష్ట పడే వారు  ఇప్పటికీ  వేల సంఖ్యలో ఉన్నారు . లడ్డూలతో  పాటు  వడలు కూడా  స్వచ్ఛమైన  ఆవు  నెయ్యితో చేస్తారు కనుక అదియును గాక స్వామి  వారి  ప్రసాదమే  మధురాతి  మధురం కనుక  ఈ వడలు కూడా  అద్భుతమైన  రుచిగా  ఉండేవి.

కాలక్రమేణా  తిరుమలలో  వడలు  విక్రయం  తీసేసారు. స్వామి వారికి   కళ్యాణోత్సవము  మరియు  ఇతర సేవలు  చేయించుకునే  వారికి  ఒకటి  లేదా  రెండు  వడలు  ఇస్తున్నారు. 

అయితే  స్వామి  వారి  వడలు మనం స్వయముగా  మన ఇంట్లోనే   తయారు చేసుకొనవచ్చును .

ఆ వేంకటేశ్వర స్వామి వారికి  నివేదించిన  తర్వాత  వడలను  మనము  ప్రసాదముగా  స్వీకరించవచ్చును.

తిరుమల  వడల  తయారీ  విధానము.
***************************

ఓ  పావు కిలో  మినుములు  తగినన్ని  నీళ్ళు  పోసుకుని  ముందు రోజు  రాత్రి  బాగా  నాన బెట్టుకోవాలి.

మరుసటి  రోజు  నీళ్ళు  వడకట్టుకుని  గ్రైండర్ లో  నానబెట్టిన  మినుములు పొట్టుతోనే   వేసుకుని  నీళ్ళు  పొయ్యకుండా చేతితో కొద్దిగా  చిలకరించుకుని   పిండిని  మరీ  మెత్తగా  కాకుండా  గ్రైండ్  చేసుకోవాలి.

గ్రైండ్  చేసిన  పిండిని  ఓ గిన్నెలోకి  తీసుకోవాలి.

ఇప్పుడు  మిక్సీలో  స్పూనున్నర  మిరియాలు , స్పూను  జీలకర్ర , చిన్న అల్లం  ముక్క , పావు స్పూనులో సగం  ఇంగువను మరియు తగినంత  ఉప్పును వేసుకుని పొడిని మరీ  మెత్తగా  కాకుండా  కొంచెం  కచ్చాపచ్చాగా  మిక్సీ వేసుకోవాలి.

ఈ  పొడిని  గిన్నెలో  సిద్ధంగా  ఉంచుకున్న  పిండిలో  వేసుకుని చేతితో  బాగా  కలుపుకోవాలి.

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టుకుని  పావు కిలో  నూనె  లేదా  నెయ్యి పోసుకుని  బాగా  కాగనివ్వాలి.

ఈ లోపుగా  ఓ మైనపు  షీట్ ను  తీసుకుని ,  గట్టుపైన పరచుకుని పిండిని చేతితో  పెద్ద ఉండలుగా  చేసుకుని  షీట్  పైన  పెట్టి  బొబ్బట్లు  మాదిరిగా  పెద్ద సైజులో చేతితో  పల్చగా  వత్తుకోవాలి. ఇలా  నూనెలో  వేసేటప్పుడు  మిగిలినవి  కూడా  ఒక్కొక్కటి వత్తుకోవాలి.

బాగా కాగిన  నూనె  లేదా నెయ్యిలో  ఒక్కొక్క వడను  వేసుకుని  రెండు వైపులా  ఎర్రగా  వేయించుకోవాలి. ఇదే పద్ధతిలో  మిగిలిన  వడలు  కూడా  వేయించుకోవాలి.

స్వామి  వారికి  నివేదించిన తర్వాత  వడల ప్రసాదము  స్వీకరించవచ్చును.

మినుములు  నానబోసి పొట్టుతోనే  తయారు  చేస్తాము కనుక  పోషక  విలువలు  కలిగిన , మంచి  బలవర్ధకమైన  వంటకము  ఈ వడలు.

ఎప్పుడైనా  అల్పాహారముగా అప్పటికప్పుడు  వేడి  వేడిగా  వేసుకుని  తింటే  చాలా  రుచిగా  ఉంటాయి.

మరుసటి  రోజుకు  శ్రీ వారి  వడల లానే  కొద్దిగా  పళ్ళకు పని చెబుతాయి.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము  తయారు  చేసిన విధానము   మరియు  ఫోటో  మేము  వడలు  తయారు చేసిన సమయమున  తీసినది.

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి