Wednesday, May 31, 2017

నోరూరించే గుంటూరు గోంగూర.

నోరూరించే గుంటూరు గోంగూర.
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

గోంగూర లో రెండు రకములు ఉంటాయి .
ఒకటి మంచి గోంగూర
రెండు కొండ గోంగూర
మంచి గోంగూర పులుపు ఉండదు .
కొండ గోంగూర చాలా పుల్లగా ఉంటుంది.
ఇది ఏడాది నిల్వ పచ్చడి కాదు .
ఆకులు వలచి చేసుకునే పచ్చడి .
ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఒక పది రోజులు నిల్వ ఉంటుంది.
పచ్చడికి అది సగం ఇది సగం వాడుకుంటే పులుపు సమంగా సరిపోతుంది .
రెండూ కలిపి చేస్తే చింతపండు వేయనక్కరలేదు.
పులుపు లేని ఆకు చేసుకుంటే కొద్దిగా చింతపండు వేసుకుంటే బాగుంటుంది.
గుంటూరు జిల్లాలో కొంత మంది గోంగూర పచ్చడి నూరాక సన్నగా తరిగిన ఉల్లిపాయల ముక్కలు పచ్చడిలో కలుపుకోవడం , లేదా పచ్చిమిర్చి మరియు ఈ ఉల్లిపాయల ముక్కలు పచ్చడితో తింటారు. .
తిన్నాక నోరు వాసన వస్తుందని మేము ఎప్పుడైనా అలా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఉల్లిపాయలు ముక్కలుగా తరిగి నూనెలో మగ్గబెట్టి పచ్చడిలో కలుపుకొని తింటాము.
అలా కూడా పచ్చడి చాలా రుచిగా ఉండేది.
గోంగూర పచ్చడి తయారీ విధానము .
*********************************
కావలసినవి .
రెండురకాల కట్టలు -- 4
నూనె -- రెండు గరిటలు
ఎండుమిరపకాయలు --- కారాన్ని బట్టి షుమారు 20 కాయలు .
మెంతులు -- రెండు స్పూన్లు
ఆవాలు -- స్పూను
ఉప్పు -- తగినంత
పసుపు -- కొద్దిగా
ఇంగువ -- తగినంత
ముందుగా గోంగూర కట్టల నుండి ఆకు వలుచుకొని, ఆకును శుభ్రంగా కడిగి ఒక పొడి బట్టపై ఆకులోని తడి పోయే విధంగా నీడను గాలికి ఆరబెట్టుకోండి.
తర్వాత స్టౌ మీద బాండి పెట్టి ఒక గరిటెడు నూనె వేసి నూనె కాగగానే ఆకును మెత్తగా మగ్గ బెట్టి కొద్దిగా పసుపు కూడా వేసి ఒక ప్లేటులో విడిగా తీసుకోండి.
తర్వాత మళ్ళీ స్టౌ మీద బాండీ పెట్టి మిగిలిన గరిటెడు నూనె వేసి నూనె కాగగానే ఎండుమిర్చి, మెంతులు , ఆవాలు , ఇంగువ వేసి కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకోండి.
పోపు చల్లారగానే ఎండు మిర్చి మరియు మిగిలిన పోపును మిక్సీలో వేసి , తగినంత ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చెసుకోండి.
తర్వాత మగ్గిన ఆకును కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని వేరే గిన్నెలోకి తీసుకోండి.
పైన మినపప్పు , శనగపప్పు పోపు వేయించి పచ్చడిలో కలుపుకోండి. లేదా ముందే పోపులో వేసి పచ్చడితో పాటుగా గ్రైండ్ చేసుకోవచ్చు . అది మీ ఇష్టం .
ఇప్పుడు పండు మిరపకాయలు వస్తున్నాయి కాబట్టి ఎండు మిర్చి బదులు పండు మిరపకాయలు కూడా నూనెలో మగ్గబెట్టి గోంగూర పచ్చడి చేసుకోవచ్చు .
విధానము అంతా పైన చెప్పినదే .
అప్పుడు ఓ పది పండు మిరప కాయలు వేసుకుంటే సరిపోతుంది.

అటుకుల తో దద్ధ్యోజనం .

అటుకుల తో దద్ధ్యోజనం .
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

తయారీ విధానము .
ఒక నూట యాభై గ్రాముల అటుకులు ఒక గిన్నెలోకి తీసుకోండి .
అందులో ఒక అర లీటరు పెరుగు కలపండి .
అందులో రెండు పచ్చి మిర్చి , చిన్న అల్లంముక్క, కొత్తిమీర దంచి కలుపుకోండి .
తగినంత ఉప్పు , అందులో వేసి కలపండి .
స్టౌ మిద పోపు గరిట పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి రెండు ఎండుమిర్చి , స్పూను పచ్చిశనగపప్పు , స్పూను మినపప్పు , పావు స్పూను జీలకర్ర , అర స్పూను ఆవాలు , తగినంత ఇంగువ , రెండు రెబ్బల కరివేపాకు వేసి పోపు పెట్టుకోండి
అంతే అటుకులతో దద్ధ్యోజనం సర్వింగ్ కు సిద్ధం.
మేము దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఒక లీటరు పాలు మంచి నీళ్ళ సీసాలో ముందుగానే తోడు పెట్టు కుంటాం .
ఒక పావు కిలో అటుకులలో తగినంత ఉప్పువేసి పైన నేను చెప్పిన విధంగా పోపు వేసి అందులో అల్లం , పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగి బాగా కలిపి బాక్స్ లో వేసి తీసుకొని వెడతాం.
తిన బోయే పదిహేను నిముషముల ముందు సీసాలో తోడు పెట్టిన పెరుగు అందులో వేసుకుని బాగా స్పూను తో కలిపి తింటాం.
Panty Car రైల్లో ఉన్నా లేకపోయినా భోజనాలు చేయకుండా ఈ అటుకుల దద్ధ్యోజనం తినేస్తాము .
ఇందులో నంజుకోవడానికి నిమ్మకాయ ఊరగాయ కాని , మాగాయ పచ్చడి కాని బాగుంటుంది .

చుక్క కూర పచ్చడి .

చుక్క కూర పచ్చడి .
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

కావలసినవి .
చుక్కకూర ---- నాలుగు కట్టలు
పచ్చి మిరపకాయలు --- ఎనిమిది
కొత్తిమీర --- ఒక కట్ట
ఉప్పు --- తగినంత 
పసుపు -- చిటికెడు

చుక్క కూర శుభ్రం చేసుకుని సన్నగా తరుగు కోవాలి.
స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి 
నూనె బాగా కాగాక చుక్క కూర , పచ్చిమిర్చి , తగినంత ఉప్పు , చిటికెడు పసుపు వేసి మూత పెట్టి చుక్క కూర బాగా మగ్గ నిచ్చి దింపి వేరే తీసుకోవాలి .

తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె కాగగానే నాలుగు ఎండుమిరపకాయలు , స్పూనున్నర మినపప్పు , పావు స్పూను జీలకర్ర ,
అర స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ కాస్త కరివేపాకు వేసి పోపు వేయించుకోవాలి .

తర్వాత మిక్సీలో ముందు ఎండుమిరపకాయలు వేసి మెత్తగా వేసుకోవాలి .
తర్వాత మగ్గిన చుక్క కూర పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .
చివరగా మిగిలిన పోపు వేసి తరిగిన కొత్తిమీర వేసి ఒక సారి మళ్ళీ మిక్సీ వేసుకుని వేరే Bowl లోకి తీసుకోవాలి .
ఈ పచ్చడి లో చుక్కకూర లో పులుపు ఉంటుంది కనుక చింతపండు వేయనవసరంలేదు.
అన్నం లోకి మరియు దోశెలలోకి ఈ చట్నీ బాగుంటుంది

దోసకాయ బజ్జీ ( కాల్చి చేసుకునే పచ్చడి )

దోసకాయ బజ్జీ ( కాల్చి చేసుకునే పచ్చడి )
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

రోటి సౌకర్యము లేని వారు మిక్సీలో చేసుకోవచ్చు .
రాధా సుసర్ల గారు తయారీ విధానము తెలుపలేదు .
తయారీ విధానము నేను తెలియ చేస్తున్నాను.
ముందుగా పచ్చని గట్టి దోసకాయను తీసుకొని కాయ అంతా నూనె రాసి స్టౌ సిమ్ లో పెట్టుకొని నాలుగు వైపులా కాల్చుకుని తడి చేయి చేసుకుని కాలిన పై చెక్కు అంతా తీసుకొని , కాయను చిదిపి పైన కొద్దిగా 
పసుపు వేసి పక్కన ఉంచుకోవాలి.

చింతపండు ఉసిరికాయంత పరిమాణంలో తీసుకొని తడిపి ఉంచుకోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నాలుగు ఎండుమిరపకాయలు , స్పూనున్నర మినపప్పు , కొద్దిగా మెంతులు , కొద్దిగా జీలకర్ర , అర స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ మరియు రెండు రెమ్మలు కరివేపాకు వేసి పోపు వేయించు కోవాలి.
ఇప్పుడు మిక్సీలో ముందు ఎండుమిరపకాయలు ఉప్పు , కొద్దిగా తడిపి ఉంచుకున్న చింతపండు వేసి మెత్తగా వేసుకోవాలి .
తర్వాత నాలుగు పచ్చి మిరపకాయలు కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి .
తదుపరి కాల్చి చిదిపి పక్కన పెట్టుకున్న దోసకాయ వేసి మరీ మెత్తగా కాకుండా ఫోటోలో చూపిన విధంగా ముక్కలు తగిలే విధంగా మిక్సీ వేసుకుని , మిగిలిన పోపు , సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకుని వేరే గిన్నెలో కి తీసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే దోసకాయ కాల్చిన పచ్చడి సర్వింగ్ కు సిద్ధం .

చామదుంపలు ఉప్మా పోపు కూర.

చామదుంపలు ఉప్మా పోపు కూర.
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

కావలసినవి .
చామదుంపలు --- అర కిలో
గుండ్రంగా చిన్న దుంపలు అయి ఉండాలి .
పచ్చి మిరపకాయలు --- 8 
 చింతపండు --- 30 గ్రాములు 
కరివేపాకు --- మూడు రెమ్మలు
ఎండు కారం --- స్పూను 
ఉప్పు --- తగినంత 
పసుపు --- కొద్దిగా .

పోపుకు .
నూనె --- 50 గ్రాములు.
ఎండుమిర్చి -- 4
మినపప్పు --- స్పూనున్నర 
శనగపప్పు --- రెండు స్పూన్లు 
జీలకర్ర -- పావు స్పూను 
ఆవాలు -- అర స్పూను 
ఇంగువ --- తగినంత

తయారీ విధానము .
ముందుగా చింతపండు విడదీసి పదిహేను నిముషముల ముందు నీళ్ళల్లో నాన బెట్టి , చిక్కగా రసం తీసుకొని విడిగా ఉంచుకోవాలి .
చామదుంపలు ఇసుక లేకుండా శుభ్రంగా కడిగి , కుక్కర్ లో వేసి , తగినన్ని నీళ్ళు పోసి మూడు విజిల్స్ రానిచ్చి స్టౌ ఆపుకోవాలి .
తర్వాత చామ దుంపల పై తొక్కు వలుచుకోవాలి . దుంపలు మరీ పెద్దవిగా ఉంటే కాస్త పెద్ద ముక్కలుగా చాకుతో కట్ చేసుకుని ఒక పళ్ళెంలో విడిగా పెట్టుకుని దుంపల పైన కొద్దిగా పసుపు వేసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి నూనె మొత్తం వేసి , నూనె కాగగానే వరుసగా ఎండుమిర్చి ముక్కలు , పచ్చి శనగపప్పు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ , పచ్చిమిర్చి ముక్కలు , కరివేపాకు వేసి పోపు వేగగానే ఉడికిన చామదుంపలు పోపులో వేసి వెంటనే విడిగా తీసి ఉంచుకున్న చింతపండు రసం , సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి పులుపు , ఉప్పు మరియు కారం 
 దుంపలకు పట్టే విధంగా మగ్గ నివ్వాలి .

మధ్య మధ్య లో కూరను కదుపు తుండాలి .
దింపబోయే మూడు నిముషాల ముందు కూరలో పచ్చి మిర్చి కారం సరిపోని యెడల ఒక స్పూను ఎండు కారం వేసుకోవాలి .
తర్వాత కూర విడిగా ప్లేటు లోకి తీసుకోవాలి .
అంతే ఘమ ఘమ లాడే చామ దుంపల ఉప్మా పోపు కూర సర్వింగ్ కు సిద్ధం.
ఇదే కూరలో చింతపండు రసానికి బదులుగా ఒక కాయ నిమ్మరసం స్టౌ ఆపాక పిండు కోవచ్చు .
స్టౌ వెలుగుతున్నప్పుడు పిండితే కూర చేదు వస్తుంది .
ఫోటో ఉమా హోమ్ టిప్స్ గూగుల్ సౌజన్యంతో

మసాల వడ.

మసాల వడ.
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

తయారీ విధానము .
మూడు గంటల ముందు ఒక గ్లాసు పచ్చిశనగపప్పు , అర గ్లాసు పెసర పప్పు తగినన్ని నీరు పోసి విడిగా నానబెట్టుకుని , తర్వాత నీరు వడ కట్టు కోవాలి .
తర్వాత మిక్సీలో ఈ నాన బెట్టిన పప్పులు , ఎనిమిది పచ్చి మిరపకాయలు , చిన్న అల్లంముక్క, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు , పావు స్పూను జీలకర్ర , పావు కప్పు పొదీనా ఆకు , రెండు రెమ్మలు కరివేపాకు , కొద్దిగా కొత్తిమీర , అర స్పూను కారం , ( పచ్చి మిర్చి కారం సరిపోని యెడల ) తగినంత ఉప్పు, వేసి తగినన్ని నీళ్ళు పోసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ వేసుకోవాలి .
ఆ తర్వాత ఈ మిశ్రమంలో ఒక స్పూను బియ్యపు పిండి కలుపు కోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి పావు కేజి నూనె పోసి నూనె బాగా కాగగానే ఆకు మీద వడల్లా తట్టి నూనె లో వేసుకొని బంగారు రంగు వచ్చే విధంగా వేయించు కోవాలి .
అంతే వేడి వేడి మసాల వడ రెడి .
ఈ మసాలా వడ టిఫిన్ గాను మరియు వేడి వేడి అన్నంలో ఆదరువు గాను పనికొస్తుంది.

కరివేపాకు కారప్పొడి

కరివేపాకు కారప్పొడి
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

ప్రియమైన మిత్రులారా !
ఈ రోజు మీ అందరికీ ప్రాచీన వంటకం మన తాతమ్మల తరం నుంచి వచ్చిన కరివేపాకు కారప్పొడి గురించి వివరిస్తాను .
ఈ కరివేపాకు కారప్పొడి బాలింతలకు పథ్యంగా పెడతారు.
జ్వరపడి పథ్యం పెట్టే వారికి కూడా పెట్టవచ్చు .
నోరు అరుచిగా ఉన్నప్పుడు , బాగా జలుబు చేసినప్పుడు , కడుపులో ఇబ్బందిగా ఉన్నప్పుడు మేము తరచుగా ఈ కారప్పొడి కొట్టుకుంటాము .
ఈ కరివేపాకు కారప్పొడి కొట్టగానే వాసన పోకుండా ఒక సీసాలో పోసుకుంటే ఘమ ఘమ లాడే సువాసనతో నెల రోజుల పైనే నిల్వ ఉంటుంది .
ఈ కారప్పొడి తయారు చేయడంలో మీ టాలెంట్ అంతా వేయించడం లోనే ఉంటుంది.
వేపు అటూ ఇటు అయితే మనం అనుకున్న రుచి రాదు .
ఈ కరివేపాకు కారప్పొడి లో వెల్లుల్లి పాయలు తప్పని సరిగా వేయాలి .
వెల్లుల్లి పాయలు వేస్తేనే ఆరోగ్య పరంగా ప్రయోజనం ఉంటుంది .
ఇక వెల్లుల్లి మాట మా ఇంట్లో వినపడకూడదు అనుకునే వాళ్ళు లేకుండా చేసుకోండి .

అసలు రుచి కూడా వెల్లుల్లి పాయలు వేసుకుంటేనే వస్తుంది.
కరివేపాకు కారప్పొడికి కావలసిన పదార్థములు .
కరివేపాకు ఒక 15 రెమ్మల ఆకు దూసుకోవాలి .
ఎండు మిరపకాయలు -- 15 నుండి 18 వరకు .
చాయ మినపప్పు --- 4 టీ స్పూన్లు .
ధనియాలు --- 50 గ్రాములు
జీలకర్ర --- పావు స్పూన్
ఆవాలు -- పావు స్పూన్
వెల్లుల్లి రెబ్బలు -- పై పొట్టు తీయకుండా ఒక 15.
పొట్టు తీసి వేస్తే కారప్పొడి పేస్టు అవుతుంది .ఘాటు వాసన వస్తుంది కారప్పొడి .
ఉప్పు --- తగినంత
చింతపండు -- ఒక నిమ్మ కాయ సైజు .
నూనె -- 5 లేక 6 స్పూన్లు .
అంతే .
ఇంక కరివేపాకు కారప్పొడి తయారు చేయు విధానము .
ముందుగా కరివేపాకు కడిగి ఆరబోసుకోండి .
తడి ఉండకూడదు . పొడిగా ఉండాలి .
స్టౌ వెలిగించి బాండి పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి , నూనె బాగా కాగాక కరివేపాకు మెత్తదనం పోయేదాకా వేయించి పక్కన వేరే ప్లేటులో పెట్టుకోండి .
తర్వాత స్టౌ మీద మళ్ళీ బాండీ పెట్టి నాలుగు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగాక ఎండు మిరపకాయలు , ధనియాలు వేసి కమ్మని వేపు వాసన వచ్చే దాకా వేయించండి . ఇప్పుడు జీలకర్ర , ఆవాలు వేసి అట్లకాడతో కలుపుతుండండి . ఆవాలు చిటపటలాడాక దింపి ఒక అయిదు నిముషాలు చల్లార నివ్వండి.
చింతపండు ఈనెలు , గింజలు లేకుండా శుభ్రం చేసుకోండి .
చాయమినపప్పు ఒక స్పూన్ నూనె వేసి విడిగా వేయించి ప్రక్కన పెట్టుకోండి .
మిక్సీలో వేయించిన ఎండుమిరపకాయలు , ధనియాలు , ఆవాలు , జీలకర్ర , తగినంత ఉప్పు వేసి రెండుసార్లు తిప్పండి.
ఇప్పుడు చింతపండు , వేయించిన కరివేపాకు వేసి మరో రెండుసార్లు తిప్పండి
ఆ తర్వాత వెల్లుల్లి పాయలు వేసి ఒకసారి తిప్పండి .
ఇప్పటికే మీ వంట గదంతా చక్కని కరివేపాకు , వెల్లుల్లి వాసనల సువాసనలతో ఘుమ ఘమ లాడి పోతుంది .
ఇప్పుడు ఈ మిశ్రమమంతా ఒక పళ్ళెంలోకి తీసుకొని, వేయించి పక్కన పెట్టుకున్న చాయమినపప్పు అందులో వేసి చేత్తో బాగా కలుపుకొని నలగని చింతపండు చేతికి తగిలితే తీసేయండి .
ఉప్పు సరిపోయిందో లేదో నోట్లో వేసుకుని చూసుకొని , చాలక పోతే తగినంత కలుపుకోండి .
వాసన పోకుండా శుభ్రంగా తుడిచిన గాజు సీసాలో పెట్టుకుంటే నెల రోజుల పైన నిల్వ ఉంటుంది .
వేడి వేడి అన్నంలో మూడు స్పూన్లు నెయ్యి వేసుకుని , అందులో ఈ కరివేపాకు కారప్పొడి వేసుకొని ముందుగా తినండి .
ఆ రుచి అహా అద్భుతః .
ఇందులో పచ్చి శనగపప్పు , మెంతులు , పసుపు, ఎక్కువ జీలకర్ర , ఎక్కువ ఆవాలు , ఇంగువ వాడకూడదు .
ఆరోగ్య ఫలితాలు పొందాలంటే నేను చెప్పిన విధంగానే తయారు చేసుకోవాలి.

బీరకాయ ఉల్లికారము కూర .

బీరకాయ ఉల్లికారము కూర .
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

కావల్సిన వస్తువులు.
ఎండు మిరపకాయలు --- 6
పచ్చి శనగపప్పు --- పావు కప్పు
చాయ మినపప్పు --- పావు కప్పు
ఆవాలు ---- అర స్పూను
పెద్ద ఉల్లిపాయలు --- 4
ఉప్పు --- తగినంత 
బీరకాయలు ---- 4
నూనె -- తగినంత

ఈ బీరకాయ ఉల్లికారం కూరకు
కాయలు ఎంత లేతగా ఉంటే కూర అంత రుచిగా ఉంటుంది.

ఫోటోలో చూపిన విధంగా సన్నగా ఓ మాదిరి పొడవైన కాయలు తీసుకోండి .
పైన చెక్కుని తీసి కాయ లోపల చేదు ఉందేమో చూసుకోండి .
చేదు కాయ చెక్కు రెండూ పారేయండి .
అలా చెక్కు తీసిన బీరకాయను 
మధ్యలో రెండు లేక మూడు ముక్కలుగా చేసుకొని గుత్తి వంకాయ కూర చేసుకునే విధంగా కాయను నాలుగు పక్షాలుగా చేయండి. కాయను ముక్కలుగా కోయవద్దు . మిగిలిన అన్ని కాయలను అదే విధంగానే కోసుకోండి .

తీసిన బీర చెక్కును పార వెయ్యవద్దు. పక్కన పెట్టుకోండి. 
లేత బీర చెక్కు అయితే నిక్షేపంగా పచ్చడి చేసుకో వచ్చు .

ఇప్పుడు ఉల్లిపాయలు పై పొట్టు తీసి పులుసు ముక్కల్లాగా పెద్ద ముక్కలు తరుగు కోండి.
ఆ తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి నాలుగు చెంచాలు నూనె వేసి నూనె బాగా కాగాక పచ్చి శనగపప్పు , చాయ మినపప్పు ,
ఎండు మిరపకాయలు , ఆవాలు వేసి పోపు కమ్మని వాసన వచ్చే దాక వేయించి అందులోనే తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మూత పెట్టి సన్నని సెగన ఒక అయిదు నిముషముల పాటు మగ్గనివ్వండి.
ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేదాక ఒక మాదిరిగా మగ్గితే చాలు. పూర్తిగా వేగ నివ్వద్దు .

ఇప్పుడు స్టౌ ఆపి పోపు చల్లారాక వేయిచుకున్న పోపు , తగినంత ఉప్పు వేసి రెండు మూడు సార్లు తిప్పి ముద్ద పూర్తిగా పేస్ట్ అయిపోకుండా తీసి ఒక ప్లేటులో పక్కన పెట్టుకోండి .
ఉల్లిపాయలలో తడి ఉంటుంది కనుక నీళ్ళు అసలు పోయవద్దు.

ఇప్పుడు నాలుగు పక్షాలుగా చేసుకున్న బీరకాయలలో ఆ ముద్దను కూరి కొంత ముద్దను విడిగా ఉంచుకోండి.
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి అయిదు ఆరు చెంచాలు నూనె వేసి నూనె బాగా కాగాక ఈ ఉల్లికారం కూరిన కాయలను నూనెలో వేసి మధ్య మధ్యలో అడుగంట కుండా అట్లకాడతో కలుపుతూ ఒక పది నిముషాలు మూత పెట్టి మగ్గ నివ్వండి . బీరకాయల్లో స్వతహాగా నీరు ఉంటుంది కనుక వేరుగా నీరు పోయనవసరం లేదు . కాయల్లోనుండి నీరు బయటకు వచ్చి ముక్కలు మగ్గుతాయి.
ఇలా ముక్కలు మగ్గాక మిగిలిన ముద్దను ఇప్పుడు వేసి మూతపెట్టకుండా మగ్గనివ్వండి.
ఒక అయిదు నుండి ఎనిమిది నిముషాల్లో నీరు ఇగిరిపోయి నూనె బయటకు వచ్చి కమ్మని వేగిన వాసన వస్తుంది .
తర్వాత వేసిన ముద్ద కూడా కాయలకు పడుతుంది .
ముద్ద మాడకుండా వేగిందో లేదో చూసుకుని ఇప్పుడు స్టౌ ఆపి మూత పెట్టి అయిదు నిముషాలు అయ్యాక కూరను వేరే Bowl లోకి తీసుకోండి .
అంతే ఘమ ఘమ వేగిన ఉల్లికారం సువాసనలతో బీరకాయ ఉల్లికారం కూర భోజనం లోకి సిద్ధం.
ఇప్పుడు చెప్పిన కూర గ్రేవి ఉంటుంది కాబట్టి బాగా ఆటు వస్తుంది.
కనీసం ఆరు మందికి సరిపోతుంది .
అదే బీరకాయలు కిలో కాయలు ముక్కలు తరిగి పోపులు వేసుకుంటే ముగ్గురుకు కూడా సరిపోదు.
ఇది కేవలం ఉల్లికారం కూర కాబట్టి పోపులో ధనియాలు , జీలకర్ర మెంతులు కరివేపాకు కొత్తిమీర వంటివి వాడలేదు .
మసాలా కూరగా చేసుకునే వారు అవి వారికి ఇష్టమైతే పై చెప్పినవి పోపులో వేసుకోవచ్చు .

మజ్జిగ పులుసు.

మజ్జిగ పులుసు.
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

తయారు చేయు విధానము .
ముందుగా పెరుగు చక్కగా కవ్వంతో గిలకొట్టి గడ్డలు లేకుండా చూసుకుని తగినన్ని నీళ్ళు పోసుకుని వెడల్పాటి గిన్నెలో ప్రక్కన పెట్టి ఉంచుకోవాలి,
పుల్లగా ఇష్టమైన వాళ్ళు పుల్లని పెరుగు వాడుకోవచ్చు.
అందులో పావు టీ స్పూన్ పసుపు కలిపి గరిటతో బాగా కలపండి.
అప్పుడే stove మీద పెట్టవద్దు.
ఒక చిన్న గిన్నెలో మూడు స్పూన్లు పచ్చి శనగపప్పు . పావు స్పూను ఆవాలు. పావుస్పూను జీలకఱ్ర, చిన్న అల్లంముక్క, చిన్న పచ్చి కొబ్బరిముక్క, వేసి ఒక అరగంట కాసిని నీళ్ళు పోసి నానబెట్టి , ఆ తర్వాత ఆ నీళ్ళతో సహా మెత్తగా మిక్సీ వేసుకున్నాక ఆ ముద్దని మజ్జిగ లో కలపండి.
మూడు పచ్చిమిరపకాయలు తీసుకుని నిలువుగా చీలికలు గా తరిగి మజ్జిగ ముద్దలో వేయండి.
కరివేపాకు రెండు రెమ్మలు తీసుకుని ఆకులు దూసుకుని కడిగి మజ్జిగ లో వేయండి.
తగినంత ఉప్పు వేసి అన్నీ బాగా కలపండి.
ఇప్పుడు రెండు ఎండు మిరపకాయలు . కొద్దిగా మెంతులు. కొద్దిగా జీలకఱ్ర . ఆవాలు కొద్దిగా వేసి కొంచెం కరివేపాకు వేసి కొంచెం నూనె వేసి పోపు పెట్టి మజ్జిగ లో కలపండి.
అన్నీ చేసారుకదా !
ఆనపకాయ ముక్కలు చిన్నవిగా తరిగి ఉంచుకొని విడిగా కుక్కర్ లో మెత్తగా ఉడికించి బాగా చల్లారాక మజ్జిగ లో కలపండి.
మీకు ఇష్టమైతే రెండు టమోటాలు కూడా తరిగి వేసుకోండి.
ఇప్పుడు ఈ మజ్జిగ పులుసును
stove మీద పెట్టి పొంగకుండా గరిటతో బాగా కలుపుతూ బాగా మరగ నివ్వండి.

క్రింద పొంగితే పై నురుగు లోని tase పోతుంది .
బాగా తెర్లాక క్రిందకు దింపి కొత్తిమీర కడిగి సన్నగా తుంపి కడిగి మజ్జిగ దింపిన పులుసు లో వేసి మూత పెట్టి ఉంచాలి .
వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచి అద్భుతం .
ఒక్క విషయం అన్నీ వేసాక stove మీద ఎందుకు పెట్టమన్నానంటే ముందుగానే పెడితే మజ్జిగ పులుసు విరిగిపోతుంది.
ఇలా చేసి చూడండి .

పాలకూర పెసర పప్పు .

పాలకూర పెసర పప్పు .
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

కావలసిన పదార్ధములు ----
చాయ పెసర పప్పు -- 100 గ్రాములు.
పాలకూర --- పెద్ద కట్ట ఒకటి
పచ్చి మిరపకాయలు --- 6
పసుపు --- కొద్దిగా
కరివేపాకు --- తగినంత
ఇంగువ --- తగినంత .
పోపుకు కావలసినవి ----
ఎండు మిరపకాయలు -- రెండు
ఆవాలు -- తగినన్ని
జీలకర్ర ---- కొద్దిగా
తయారు చేయు విధానము .
ముందు పాలకూర శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఉంచుకోండి.
స్టౌ వెలిగించి చాయ పెసర పప్పు 
శుభ్రంగా నీళ్ళు పోసి కడుక్కుని తగినంత నీరు పోసి మధ్యస్ధమైన
మంట మీద పప్పు పొంగ కుండా చూసుకుంటూ మూడు వంతులు ఉడికాక అందులో తరిగిన పాలకూర , తరిగిన పచ్చి మిరపకాయలు , కరివేపాకు , కొద్దిగా పసుపు, ముఖ్యంగా పచ్చి
ఇంగువ వేసి మెత్తగా ఉడికాక
గరిటతో కలిపి పైన చెప్పిన వాటితో తగినంత నూనె వేసి పోపు పెట్టుకొనండి .

పోపులో ఇష్టమైన వారు చాయ మినపప్పు వేసుకోండి.
పైన కొత్తిమీర ఇష్టమైన వారు వేసుకోండి.
మెంతులు పోపులో వేయనవసరము లేదు.
అంతే కమ్మని ఇంగువ వాసనతో
సాంప్రదాయిక మైన పాలకూర పెసర పప్పు అన్నంలోకి మరియు
రోటీల లోకి సిద్ధం.

పచ్ఛి కొబ్భరి శనగపప్పు కూర

పచ్ఛి కొబ్భరి శనగపప్పు కూర 
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

ఇంటిలో కూరలు వండడానికి ఏమీ లేనప్పుడు ఏమి వండాలో తెలియని సమయంలో ఇలా చెయ్యవచ్చు.
ఒక కప్పు శనగపప్పు బాగా కడిగి తగినన్ని నీరు పోసి స్టౌ మీద బద్ద చేతితో నలిపితే మెత్త బడేవరకు ఉడికించండి.
మెత్తగా ఉడికాక పప్పులో నీరు వార్చండి.
పచ్చి కొబ్బరి అర చిప్ప కోరుకోండి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి 
తగినంత నూనె వేసి మూడు ఎండు మిరపకాయలు తుంచి ,
ఒక స్పూన్ మినపప్పు , అర స్పూన్ జీలకర్ర , స్పూన్ ఆవాలు , కరివేపాకు , కొద్దిగా ఇంగువ వేసి ఉడికిన శనగపప్పు వేసి మగ్గాక తురుమి ఉంచుకున్న
పచ్ఛి కొబ్భరి , తగినంత ఉప్పు.,
ఎండు కారం వేసి మరో అయిదు నిముషాలు అయ్యాక దింపు కోండి .

అంతే పచ్చి శనగపప్పు , కొబ్బరి వేసిన కూర రెడీ .
ఈ కూరతో కాంబినేషన్ గా అల్లం పచ్చడి బాగుంటుంది .
**********************************************
అల్లం పచ్చడి .

తయారీ విధానము .
నిమ్మకాయంత చింతపండు అయిదు నిముషముల పాటు కొద్దిగా నీరు పోసి నానబెట్టండి.
బాండీ లో నూనె వేసి ఆరు ఎండు మిరపకాయలు ,
స్పూన్ మినపప్పు , అర స్పూన్ మెంతులు , స్పూన్ ఆవాలు , తగినంత ఇంగువ , కొద్దిగా పసుపు వేసి వేయించుకొనండి.

పోపు చల్లారాక మిక్సీలో వేయించిన ఎండు మిరపకాయలు, నాన బెట్టిన చింతపండు , బెల్లం కొద్దిగా , తగినంత ఉప్పు , అల్లం ముక్క చిన్నది పై చెక్కు తీసి వేసి మెత్తగా అయ్యాక మిగిలిన పోపు వేసి మిక్సీ వేసుకోవాలి .
అంతే నోరూరించే అల్లం పచ్చడి ఇడ్లీ , దోశె మరియు అన్నం లోకి సిద్ధం.

అరటిదూట పెసరపప్పు కూర!

అరటిదూట పెసరపప్పు కూర!

కావలసినవి
అరటిదూట (చిన్నది) .. ఒకటి
పెసరపప్పు .. చిన్న అర గ్లాస్ 
శనగపప్పు .. ఒక చెంచా
మినపప్పు .. ఒక చెంచా
ఆవాలు .. అర చెంచా 
ఎండుమిర్చి .. రెండు 
జీలకర్ర .. కొంచం 
కరివేపాకు .. కొంచం 
నూనె .. పోపుకుసరిపడ
ఉప్పు .. రుచికి సరిపడా

తయారు చేయు విధానము
ముందుగా అరటిదూటను పై పెచ్చు తీసి చిన్న చిన్న చక్రాలలా తరిగి పీచు లేకుండా చేసి వాటిని చిన్న ముక్కలుగా తరిగి అందులో పెసరపప్పు, పసుపు వేసి ఉడికించి దానిని చిల్లులపల్లెంలో నీరు వార్చాలి.
పాన్ లో ఆయిల్ వేసి కాగాక అందులో ఎండుమిర్చి, పోపుగింజలు వేసి వేగాక కరివేపాకు, ఉడికిన దూట, పెసరపప్పు, మిశ్రమము, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి . ఉడికిన తరువాత ఒక బౌల్ లో కి తీసుకోవాలి .
ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది.

సింపుల్ గా బీన్స్ కొబ్బరి కూర

సింపుల్ గా బీన్స్ కొబ్బరి కూర
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 


తయారీ విధానము .
ఓ పావు కిలో బీన్స్ శుభ్రంగా కడిగి , అటు చివర ఇటు చివర తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
కుక్కర్ లో తగినన్ని నీళ్ళు పోసి తరిగిన బీన్స్ ముక్కలు కొద్దిగా ఉప్పు వేసి స్టౌ మీద పెట్టి రెండు విజిల్స్ వచ్చాక దింపి , తర్వాత ప్లేటులో వార్చుకుని , దానిపై కొద్దిగా పసుపు వేసుకోండి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి నాలుగు స్పూన్లు నూనె వేసి , నూనె బాగా కాగగానే మూడు ఎండుమిర్చి తుంపిన ముక్కలు , స్పూను మినపప్పు , పావు స్పూను జీలకర్ర , అర స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ, రెండు రెమ్మలు కరివేపాకు పోపు వేసుకోండి .
పోపు వేగగానే ఉడికించిన బీన్స్ ముక్కలు వేసి మూత పెట్టి ఆ రేడు నిముషాలు మగ్గ నివ్వండి .
తర్వాత సరిపడా ఉప్పు , స్పూను కారం , ఒక చిప్ప 
పచ్చి కొబ్బరి తురుము వేసి మరో మూడు నిముషాలు అయ్యాక దింపి వేరే గిన్నె లోకి తీసుకోండి.

అంతే . బీన్స్ కొబ్బరి కూర భోజనము లోనికి మరియు రోటీల లోకి సర్వింగ్ కు సిద్ధం.

క్యాబేజి పచ్చడి .

క్యాబేజి పచ్చడి .
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

తయారీ విధానము .
క్యాబేజి సగం ముక్క షుమారు 200 గ్రా . తీసుకొని సన్నగా తరుగు కోవాలి .
ఆరు పచ్చిమిర్చి , తరిగిన క్యాబేజి మూడు స్పూన్లు నూనె బాండిలో వేసి తరిగిన క్యాబేజి పచ్చి మిర్చి వేసి బాగా మగ్గ నివ్వాలి . అందులో కొద్దిగా పసుపు వేసి వేరే పళ్ళెం లోకి తీసుకోవాలి .
ఉసిరి కాయంత చింతపండు విడదీసి నీళ్ళతో తడిపి ఉంచుకోవాలి .
తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా మూడు ఎండుమిర్చి , స్పూను మినపప్పు , పావు స్పూను జీలకర్ర , అర స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు వేయించు కోవాలి .
ఇప్పుడు మిక్సీలో ఎండుమిర్చి , చింతపండు , తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ వేసుకోవాలి .
తర్వాత వేగిన క్యాబేజి పచ్చి మిర్చి వేసి తిరిగి మిక్సీ వేసుకోవాలి .
చివరగా తరిగిన కొత్తిమీర మరియు పోపు కూడా వేసుకొని మరోసారి మిక్సీ వేసుకుని వేరే Dish లోకి తీసుకోవాలి .
అంతే క్యాబేజి పచ్చడి అన్నం లోకి రెడీ ,

చింత చిగురుతో పులిహోర.

చింత చిగురుతో పులిహోర.
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

కావలసినవి .
చింత చిగురు -- పావు కిలో
నువ్వు పప్పు -- 50 గ్రాములు
పచ్చిమిర్చి -- పది నిలువుగా గాటు పెట్టు కోవాలి .
కరివేపాకు -- ఎనిమిది రెమ్మలు
ఎండుమిరపకాయలు -- ఎనిమిది .
పచ్చి శనగపప్పు --- పావు కప్పులో సగం. 
మినపప్పు -- పావు కప్పు లో సగం .
బియ్యము -- ఒక గ్లాసుడు .
నూనె --- 50 గ్రాములు .

పోపుకు .
ఎండుమిరపకాయలు -- 8
పచ్చి శనగపప్పు -- మూడు స్పూన్లు 
మినపప్పు -- రెండు స్పూన్లు 
ఆవాలు -- స్పూను 
పల్లీలు --- పులుసు గరిటెడు
ఇంగువ -- పావు స్పూను .
నూనె --- 50 గ్రాములు.

తయారీ విధానము .
ముందుగా గిన్నెలో గ్లాసుడు బియ్యము సరిపడా నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టుకోవాలి .
అన్నం ఉడికే లోపున
చింత చిగురు ఈనెలు పుల్లలు లేకుండా బాగు చేసుకోవాలి .
తడి లేకుండా ఆర బెట్టు కోవాలి .
స్టౌ మీద బాండి పెట్టి ఓ 50 గ్రాముల నూనె వేసి , నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చి శనగపప్పు , మినపప్పు , నువ్వుపప్పు వేసి బాగా వేయించుకోవాలి .
వేగుతున్నప్పుడే తగినంత ఉప్పు , చింత చిగురు , కరివేపాకు వేసి బాగా పొడిగా వేయించుకోవాలి .
చల్లారగానే ఈ మిశ్రమము మొత్తము మెత్తగా పౌడరు లా మిక్సీ వేసుకుని వేరే ప్లేటులో ఉంచుకోవాలి .
తర్వాత బేసిన్ లో ఉడికిన అన్నం , స్పూను పసుపు , కరివేపాకు , అర గరిటెడు నూనె , కొద్దిగా ఉప్పు మరియు ముందుగా సిద్ధం చేసుకున్న చింత చిగురు , నువ్వుల పొడి వేసి గరిటతో అన్నం అంతా పొడి పొడిగా కలుపు కోవాలి .
ఆ తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి మిగిలిన నూనె అంతా పోసి వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చి మిర్చి , పల్లీలు , శనగపప్పు , మినపప్పు , ఆవాలు , కరివేపాకు , ఇంగువ వేసి పోపు వేయించుకుని బేసిన్ లో వేసి బాగా కలుపు కోవాలి .
అంతే చింతపండు లేకుండా ఘమ ఘమ లాడే నువ్వుల పొడి , ఇంగువ సువాసనలతో నోరూరించే చింత చిగురు పులిహోర మీకు సర్వింగ్ కు సిద్ధం .

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి