Wednesday, July 4, 2018

మినప వడియాలు(చిన్నవి)

ఆలూరుకృష్ణప్రసాదు .

మినప్పిండి తో  చిన్న   వడియాలు .

ఇప్పుడు   ఎండలు మండి  పోతున్నాయి  .

ఈ  సమయంలో  సగ్గు బియ్యం  వడియాలు , బూడిద  గుమ్మడి  వడియాలు , ఊర  మిరపకాయలు
పెట్టుకుంటే గల  గలా  ఎండుతాయి .

చాలా  మంది  బూడిద  గుమ్మడికాయ   వడియాలతో  పాటే  ఈ  చిన్న వడియాలు   పెట్టుకుంటారు .

ఈ వడియాలు  తోటకూర   కూరలో , వంకాయ  అల్లం  మిర్చి  కూరలో , పనస  పొట్టు కూరలో  ఇలా  చాలా  కూరల్లో  ,  విడిగా   వేయించి  కలుపుతారు .

దీనివల్ల  ఆ కూరలకు  అదనపు  రుచి  వస్తుంది.

మరి కొంత  మంది  కూరల్లో  కలిపితే  వడియాలు  మెత్త  పడతాయని  , విడిగా   వేయించుకుని  కూర తో  పాటుగా  కలిపి , ముద్దలో  పెట్టుకుని  తింటారు .

మేము  ఏడాదికి  సరిపడా  ఒక  K . G .  మినపగుళ్ళు  నానబోసి  ఒకే సారి  పెట్టుకుంటాము .

అయితే  వీటికి  వాతావరణ మార్పుల  బట్టి  తొందరగా పురుగు  పట్టే  లక్షణం  ఉంది  కనుక   మూడు నెలల కొకసారి  ఏ రోజున  ఎండ  బాగా  ఉంటుందో  ఆ రోజున  ఈ  చిన్న వడియాలన్నీ  చాటలో  పోసి  డాబా  పైన  ఎండ బెట్టు కుంటాము .

మళ్ళీ  సాయంత్రం   డబ్బా లో  పోసుకుంటాము .

కొంతమంది    Zip  Lock  Covers  లో  పోసి  ఫ్రిజ్  లో  పెట్టుకుంటారు .

కావలసినన్ని  అవసరమయినపుడు వేయించుకోవటానికి  తీసుకొని  మళ్ళీ  కవర్  ఫ్రిజ్ లో  పెట్టేసుకుంటారు .

అప్పుడు   కూడా  పురుగు  పట్టవు .

ఇదివరకు   పాత రోజుల్లో   గుడ్డల  మీద  పెట్టుకునేవారు .

చాలా  కష్ట పడే వారు .

ఇప్పుడు   ప్లాస్టిక్   Sheets  వచ్చేసాయి .

అందరూ  ఈ  ప్లాస్టిక్   కవర్ల  మీదే  పెట్టుకుంటున్నారు .

ఆ  విధంగా  ప్లాస్టిక్   కవర్ల  మీద  పెట్టుకుంటే  సులువుగా   ఊడి వస్తాయి .

మేము  పెట్టుకున్న వడియాలు  అయిపోయినప్పుడు  బజార్లో  చాలా  సార్లు  కొన్నాము .

రుచి  పచి  లేకపోగా  గట్టిగా  వేయించాక  గులక రాళ్ళు  ఉన్నట్లు  ఉన్నాయి .

అందువల్ల  మీరు  కూడా  తప్పని సరై  బజార్లో  కొనవలసివస్తే  ముందు  ఓ  50  గ్రాముల  వడియాలు   కొనుక్కుని  , వేయించి  చూసుకుని  నచ్చితే  ఎక్కువ   మోతాదులో  కొనుక్కోండి .

మినపగుళ్ళతో  చిన్న వడియాలు  పెట్టుకునే విధానము .

****************************

ఒక  అర కిలో  మినపగుళ్ళు  ముందు రోజు  రాత్రి  తగినన్ని   నీళ్ళు  పోసి  నానబెట్టుకోండి .

మరుసటి  రోజు   ఉదయం   మీరు  Wet  Grinder  లో  మీరు  బూడిద  గుమ్మడికాయ    వడియాలకు  పిండి  ఎలా  వేసుకుంటారో  అలా  మెత్తగా   వేసుకొని   ఒక  గిన్నె లోకి  తీసుకోండి .

ఒక   150  గ్రాముల పచ్చి  మిరపకాయలు   తొడిమలు  తీసి  మిక్సీ  లో  మెత్తగా   వేసుకోవాలి .

తగినంత   ఉప్పు  , పావు  స్పూను  పచ్చి  ఇంగువ  మరియు  పచ్చిమిర్చి   మిశ్రమము  పిండిలో  వేసి  చేత్తో  బాగా  కలిపి  ప్లాస్టిక్   కవర్ల  మీద  చిన్న  చిన్న  సైజులో  వడియాలు   పెట్టుకోవాలి .

ఇప్పుడున్న   ఎండల  కయితే  ఒక్క రోజులోనే  ఎండి పోతాయి .

అవసరమయితే  రెండో  రోజున    కూడా  ఎండ  బెట్టకుని  ఒక  Container  లో  పోసుకోండి .

మీకు  మినపగుళ్ళతో  చిన్న వడియాలు  సిద్ధం.

మేము  ఈ  వడియాలు  ,  ఊరు  మిరపకాయలు  , గుమ్మడి  వడియాలు  వేయించుకుని  వేడి  వేడి  అన్నంలో  నెయ్యి  వేసుకొని   ఈ వడియాలు  కలుపుకు  తినేస్తాము .

చాలా  రుచిగా   ఉంటాయి .

ఫోటో   ---  ఈ  సంవత్సరం   మేము  పెట్టుకున్న  వడియాలు .

సంబంధించిన  రెసిపీ మరియు ఫొటోలు నా స్వంతం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి