Saturday, April 14, 2018

గోంగూర పండుమిరపకాయ పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

గోంగూర  ఆకు  మరియు  పండు మిరపకాయలతో పచ్చడి.

కావలసినవి .

గోంగూర  --  మూడు  కట్టలు
పండుమిరపకాయలు --  150  గ్రాములు .
చింతపండు  --  50  గ్రాములు .
మెంతిపిండి --  రెండు స్పూన్లు .
ఉప్పు  --  తగినంత
పసుపు  --  స్పూను
ఉల్లిపాయలు  --  మూడు .

పోపునకు .

ఎండుమిరపకాయలు  --  4  ముక్కలుగా చేసుకోవాలి .
నూనె -- 150  గ్రాములు .
చాయమినపప్పు  --  స్పూనున్నర .
ఆవాలు  --  స్పూను .
ఇంగువ  --  తగినంత

తయారీ  విధానము .

ముందుగా  పండు మిరపకాయలు  ఒకసారి  కడుగుకుని ,  తొడిమలు  తీసుకుని  పొడి గుడ్డతో  తుడుచుకుని  నీడలో  ఒక అరగంట సేపు  ఆరబెట్టుకోవాలి .

తర్వాత  మిక్సీ లో  పండుమిరపకాయలు , చింతపండు , పసుపు , కొద్దిగా  పచ్చిఇంగువ మరియు  సరిపడా  ఉప్పు వేసుకుని  పచ్చడి మెత్తగా  వేసుకోవాలి .

ఉల్లిపాయలు  సన్నని  ముక్కలుగా  తరుగు కోవాలి .

గోంగూర  కట్టలు  ఇసుక లేకుండా  శుభ్రంగా  కడిగి , ఆకులు  వలుచుకుని  పూర్తిగా  తడి పోయేవరకు  నీడలో  ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి . 

ఆ తర్వాత  బాండీలో  నూనె  వేయకుండా  వేయించుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండి  పెట్టి   మొత్తము  నూనె పోసి  నూనె  బాగా కాగగానే  ఎండుమిరపకాయల ముక్కలుగా చేసి , చాయమినపప్పు , ఆవాలు, ఇంగువ వేసి  పోపు  వేగగానే  సన్నగా  తరిగిన  ఉల్లిపాయ ముక్కలు  వేసి  ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చే వరకు  వేయించుకోవాలి .

ఒక అయిదు  నిముషములు  పోపు  చల్లారనివ్వాలి .

ఇప్పుడు   మిక్సీ లో  వేయించి సిద్ధంగా  ఉంచుకున్న   గోంగూర ,  రోటిలో దంపిన   పండుమిరపకాయల  ముద్ద , మెంతి పొడి మరియు సరిపడా  ఉప్పు  వేసుకుని  ఈ రెండు  బాగా  కలిసే వరకు  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఆ తర్వాత  ఈ  మిశ్రమాన్ని  వేయించి  సిద్ధంగా  ఉంచుకున్న  ఉల్లిపాయల లో వేసుకుని   గరిటెతో  బాగా  కలుపుకోవాలి .

కొంతమంది    మొత్తము  పచ్చడిలో ఉల్లిపాయలు  ముందు వేయించి  వేయకుండా అవసరమైన మేరకు పచ్చడి  తీసుకుని   ఉల్లిపాయలు వేయించి కలుపుకుంటారు .

మరి కొంతమంది పచ్చి ఉల్లిపాయలు , నాలుగు  పచ్చిమిరపకాయలు  మరియు పది వెల్లుల్లి  రెబ్బలు మిక్సీ లో  వేసి  ఈ పచ్చడి  కూడా కలిపి  మిక్సీ  వేసుకుంటారు .

వెల్లుల్లి  ఇష్టమైన వారు అలా కూడా చేసుకోవచ్చును .

తర్వాత  వేరే జాడీలోకి కాని  లేది కంటైనర్  లోకి  గాని తీసుకుని భద్రపరుచుకోవాలి .

ఈ పచ్చడి  మనం చేసుకునే విధానమును పట్టి షుమారు వారం నుండి  రెండు వారముల వరకు  నిల్వ ఉంటుంది .

గోంగూర ఆకు మరియు పండు మిరపకాయలతో  చేసిన  ఈ పచ్చడి  వేడి వేడి అన్నంలో  మరి కాస్త నెయ్యి వేసుకుని  తింటే  అద్భుతమైన  రుచిగా  ఉంటుంది .

మంచి గోంగూర  (  అంటే  పులుపు  లేనిది )  మరియు  కొండ గోంగూర  ( అంటే  పుల్లని  గోంగూర  )  రెండు  రకములు  మార్కెట్  లో అమ్ముతారు .

ఈ పచ్చడి తయారీకి   పుల్లని  గోంగూర  చాలా రుచిగా  ఉంటుంది .

ఒకవేళ పుల్లని  గోంగూర  దొరకని  పక్షంలో  మంచి గోంగూరతో  కూడా  చేసుకోవచ్చును .

అప్పుడు  మరో  25  గ్రాములు  చింతపండు  వేసుకోవాలి .

హామీ పత్రం .

సంబంధిత రెసిపీ  మరియు ఫోటో  నా స్వంతం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి