Saturday, January 6, 2018

పులగం

ఆలూరుకృష్ణప్రసాదు .

పులగం  తయారీ  విధానము .

ఉపవాసం అంటే  కటిక ఉపవాసం ఏమీ తినకుండా ఉండి కడుపు  మాడ్చుకుని  శోష  వచ్చి పడిపోయి  కొత్త ఆరోగ్య  సమస్యలను సృష్టించుకోవడం  కాదు .

మధ్యాహ్నము  వేళలలో  నీరసపడకుండా  ఆ కాలంలో  పెద్దలందరూ  పులగం  తినే వారు .

చాయపెసరపప్పు తో   కలసిన  ఈ అన్న పదార్ధము  శరీరానికి  అవసరమైన  శక్తిని  ఇస్తుంది .

ఇది  శాస్త్ర  సంబంధితమైన ఉపవాస సమయంలో  తీసుకో తగ్గ ఆహార పదార్ధముగా  పెద్దలు  తెలియ చెప్తారు .

ఈ పులగం  తయారీ విధానము  ఇంచు మించుగా  తమిళనాడు  వారు    ప్రతి రోజు ఉదయపు ఫలహారముగా  చేసుకునే  పొంగల్  ను  పోలి  ఉంటుంది .

ఇక  పులగం  తయారీ  విధానము  గురించి  తెలుసుకుందాం .

పులగం.

కావలసినవి .

బియ్యం --  ఒక గ్లాసు
చాయపెసరపప్పు  --  పావు గ్లాసు .

ఈ రెండు  కలిపి ఒక గిన్నెలో  పోసుకుని ఒకసారి కడిగి తగినన్ని  నీళ్ళు పోసి   ఒక పావుగంట  సేపు  నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత  స్టౌ మీద పెట్టుకుని  మరీ  మెత్తగా  కాకుండా  వండుకోవాలి .

స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు  నెయ్యి వేసుకుని  నెయ్యి బాగా కాగగానే  పది మిరియాలు , అరస్పూను  జీలకర్ర ,  మూడు రెమ్మలు  కరివేపాకు , పది జీడిపప్పు  పలుకులు  వేసి  వేయించుకుని  పోపు వేగగానే  అందులోనే  ఉడికించిన  పులగమన్నము , తగినంత  ఉప్పు వేసుకుని  గరిటెతో  బాగా కలుపుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  పులగం  అన్నం  సిద్ధం.

దీనిలోకి  ఆదరువుగా  అయిదు పచ్చిమిర్చి , ఒక కట్ట కొత్తిమీర , ఉసిరి కాయంత చింతపండు , తగినంత  ఉప్పు మరియు  కొద్దిగా  బెల్లం  వేసుకుని  మిక్సీ లో వేసుకుని  ఆ తర్వాత ఆ పచ్చడిలో  నేతితో పోపు పెట్టుకుంటారు.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి