Thursday, August 31, 2017

మద్రాసు చెట్టినాడు సాంబార్

ఆలూరుకృష్ణప్రసాదు .

మద్రాసు  చెట్టినాడు సాంబార్ .

కావలసినవి .

కందిపప్పు  ---  ఒక గ్లాసు
చింతపండు  --  40  గ్రాములు
ఆనపకాయ /  సొరకాయ   --పావుకిలో  పై చెక్కు  తీసి ముక్కలుగా  తరుగుకోవాలి .
ములక్కాడలు  --  రెండు . ముక్కలుగా  తరుగు కోవాలి.
బెండకాయలు  --  8  ముక్కలుగా  తరుగు కోవాలి.
టమోటోలు  --  రెండు  ముక్కలుగా  తరుగు కోవాలి.
వంకాయలు  --  రెండు  నీళ్ళలో  ముక్కలుగా  తరుగు కోవాలి
పచ్చిమిర్చి  --  6  నిలువుగా   చీలికలు గా  తరుగు కోవాలి
కరివేపాకు  --  మూడు  రెమ్మలు
కొత్తిమీర   --  ఒక కట్ట
పసుపు  --  కొద్దిగా
ఉప్పు  ---  తగినంత
బెల్లం  --  కొద్దిగా  

పోపుకు .

ఎండుమిరపకాయలు  --  మూడు
ఆవాలు -- అర స్పూను
మెంతులు  ---  పావు  స్పూను
జీలకర్ర  --  పావు  స్పూను
ఇంగువ  --  కొద్దిగా
నూనె  --  రెండు స్పూన్లు

సాంబారు పొడి  కొలతలు .

ఎండుమిరపకాయలు  --  20
శనగపప్పు   -- ఒక  కప్పు
మినపప్పు   --  అరకప్పు
బియ్యము  --  మూడు స్పూన్లు
ధనియాలు  --  మూడు  స్పూన్లు
మిరియాలు  --  స్పూనున్నర
ఇంగువ   --  పావు  స్పూను

పై  దినుసులన్నీ  బాండీలో  నూనె  లేకుండా  వేయించి  మిక్సీ లో  మెత్తగా   పొడి  వేసుకుని  ఒక  సీసాలో  భద్ర పరచుకోవాలి .

ఈ పొడి  ఒక  పది  హేను  సార్లు  సాంబారు  పెట్టుకొనడానికి  ఉపయోగిస్తుంది .

తయారీ  విధానము .

చింతపండు   రెండు గ్లాసుల  వేడి నీటిలో  ఒక పదిహేను  నిముషములు  నానబెట్టి  రసం తీసుకోవాలి .

కుక్కర్  లో  తగిన నీళ్ళు పోసి ఒక  గిన్నెలో   కందిపప్పు   మరియు సరిపడా  నీళ్ళు పోసి  మూతపెట్టి  నాలుగు  విజిల్స్  వచ్చే వరకు   రానివ్వాలి .

తరువాత  మూత తీసి  పప్పును  గరిటతో  మెత్తగా  యెనుపుకోవాలి .

అందులో  చింతపండు  రసము , పసుపు,  తగినంత ఉప్పు ,  చిన్న బెల్లం  ముక్క, తరిగిన  పచ్చిమిర్చి  ముక్కలు , ఆనపకాయ ముక్కలు ,  బెండకాయ ముక్కలు ,  వంకాయ  ముక్కలు , ములక్కాడ ముక్కలు , టమోటో  ముక్కలు అన్నీ  వేసి  మరో  గ్లాసు నీళ్ళు  పోసి  ఒక  ఇరవై నిముషాలు  పాటు  స్టౌ మీద  ముక్కలన్నీ  ఉడికే వరకు  ఉంచి  బాగా  తెర్లనివ్వాలి.

తరువాత  మూడు స్పూన్లు  సాంబారు పొడి  తెర్లుతున్న సాంబారులో  వేసి  మరో  అయిదు  నిముషాలు  ఉంచి  దింపి  పైన   తరిగిన  కొత్తిమీర   వేసుకుని  మూత పెట్టుకోవాలి.

తర్వాత  స్టౌ మీద  పోపు గరిట పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి  నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు , మెంతులు , ఆవాలు , జీలకర్ర , ఇంగువ మరియు  కరివేపాకు  వేసి  పోపు వేసుకుని  సాంబారులో  వేసుకుని  గరిటతో  బాగా  కలుపుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే  తమిళనాడు సాంబార్  ఇడ్లీ, వడలు , పూరీలు , చపాతీలు  మరియు  భోజనము  లోకి  సర్వింగ్  కు  సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి