ఆలూరుకృష్ణప్రసాదు .
మైసూర్ మసాలా దోశె.
కావలసినవి .
మినపప్పు -- అరకప్పు
బియ్యము --- రెండు కప్పులు
అటుకులు -- పావుకప్పు
మెంతులు --- అరస్పూను
ఉప్పు -- కొద్దిగా
నూనె -- 100 గ్రాములు.
తయారీ విధానము .
బియ్యము , మినపప్పు , మెంతులు సరిపడా నీళ్ళు పోసి ఆరు గంటల సేపు నానబెట్టు కోవాలి.
అటుకులు పై మూడింటిని గ్రైండ్ చేయబోయే పది నిముషాలు ముందు నాన బెట్టు కోవాలి .
ఇప్పుడు నానబెట్టిన బియ్యము , మినపప్పు , మెంతులు మిశ్రమము , మరియు నానబెట్టిన అటుకులు కూడా కలిపి గ్రైండర్ లో కొద్దిగా నీళ్ళు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .
ఈ పిండిలో దోశెలు వేసుకునే ముందు కొద్దిగా నీళ్ళు మరియు కొద్దిగా ఉప్పు వేసి దోశెలు వేసుకునే విధముగా సిద్ధం చేసుకోవాలి.
మసాల దోశె కూర తయారు చేసుకునే విధానము.
కావలసినవి.
బంగాళాదుంపలు -- మూడు
ఉల్లిపాయలు -- రెండు
పచ్చిమిర్చి -- 5
కొత్తిమీర -- తరిగినది అర కట్ట .
ఉప్పు --- తగినంత
కరివేపాకు -- రెండు రెమ్మలు
పోపునకు.
ఎండుమిర్చి -- 3 ముక్కలుగా చేసుకోవాలి.
మినపప్పు -- స్పూను
ఆవాలు -- అర స్పూను
తయారీ విధానము .
ముందుగా బంగాళాదుంపలు నాలుగు ముక్కలుగా తరుగుకుని కుక్కర్ లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచి చల్లారగానే బంగాళాదుంపల పై చెక్కు తీసుకుని మెత్తగా చేసుకుని విడిగా వేరే ప్లేటులో ఉంచుకోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి ముక్కలు , మినపప్పు , ఆవాలు మరియు కరివేపాకు వేసి పోపు వేగగానే ఉల్లిపాయల ముక్కలు , తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి మూతపెట్టి బాగా మగ్గనివ్వాలి .
తర్వాత ఉడికిన బంగాళాదుంపలు , కొద్దిగా పసుపు , తగినంత ఉప్పు వేసి బాగా మగ్గనిచ్చి కొత్తిమీర కూడా వేసుకుని దింపుకోవాలి.
దోశెలపై వేసుకునే పొడి .
పది ఎండుమిరపకాయలు , ఇష్టమైన వారు అయిదు వెల్లుల్లి రెబ్బలు నూనెలో వేయించుకుని కొద్దిగా పసుపు మరియు కొద్దిగా ఉప్పు వేసుకుని మిక్సీ లో పొడిగా చేసుకోవాలి ,
ఈ పొడి ఒక కప్పులో తీసుకోవాలి .
ఇప్పుడు స్టౌ వెలిగించి పెనం పెట్టి పెనం పైన నూనె రాసి పెనం బాగా వేడెక్కగానే దోశె వేసి దోశె పైన అంతా కొద్దిగా వెన్న రాసి , కారం పొడి కూడా రాసి , రెండు స్పూన్లు కూర పెట్టుకుని దోశె పైన కొద్దిగా నూనె వేసి బాగా కాల నివ్వాలి.
ఇదే పద్ధతిలో మిగిలిన దోశెలను కూడా వేసుకోవాలి .
ఈ మైసూర్ మసాలా దోశెలు వేడి వేడిగా కొబ్బరి చట్నీ మరియు అల్లం చట్నీతో సర్వ్ చేసుకోవాలి .
0 comments:
Post a Comment