Tuesday, May 12, 2020

బియ్యపు రవ్వతో బెల్లం‌ పాయసము

ఆలూరుకృష్ణప్రసాదు .

బియ్యపు  రవ్వతో  బెల్లం  పాయసము.

ముందుగా  ఒక గ్లాసు బియ్యమును బాండీలో వేసుకుని వేయించు కోవాలి.

చల్లారగానే  మిక్సీ లో వేసుకుని  రవ్వ లాగా వేసుకోవాలి.

పిండి జల్లెడతో జల్లించి  పిండి  విడిగా  తీసుకోవాలి.  రవ్వను మాత్రమే పాయసానికి  ఉపయోగించాలి.

ఒక పచ్చి కొబ్బరి  చిప్పను తీసుకుని  పచ్చి కొబ్బరి తురుముతో  మెత్తగా  తురుము కోవాలి.

ఒక  గిన్నెలో అరలీటరు పాలు పోసుకుని పొంగు వచ్చే దాకా పాలను కాగనివ్వాలి.

రవ్వను ఒకసారి నీటితో కడిగి  కాగుతున్న పాలల్లో  రవ్వను మరియు పచ్చి కొబ్బరి  తురుమును  వేసుకుని  రవ్వను  మరియు కొబ్బరి తురుమును పాలల్లో బాగా  ఉడకనివ్వాలి .

అవసరమైతే  ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకోవాలి.

ఒక 150  గ్రాముల బెల్లం  తీసుకుని  మెత్తని పొడిగా  చేసుకోవాలి.

పాలల్లో  రవ్వ  మెత్తగా ఉడకగానే  దింపి  అందులో  మెత్తని  బెల్లం  పొడి మరియు ముప్పావు స్పూను  యాలకుల పొడిని  వేసి  గరిటెతో  బాగా  కలుపుకోవాలి.

స్టౌ  మీద  బాండీ  పెట్టుకుని  నాలుగు స్పూన్లు  నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే  పది జీడిపప్పు పలుకులు మరియు పది బాదం  పలుకులు  వేసుకుని  బాగా వేయించుకుని  పాయసములో కలుపు కోవాలి.

పాలల్లో  రవ్వ ఉడుకుతున్నప్పుడు  బెల్లం  పొడి  వేస్తే  పాయసము  విరిగి పోతుంది. అందువలన దింపగానే  వేడి మీద వేసుకుని  మెత్తని  బెల్లం  పొడి  కలపాలి.

అంతే. ఎంతో  రుచిగా  ఉండే  రవ్వతో బెల్లం  పాయసము  సర్వింగ్ కు  సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారు చేయు విధానము .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి