Tuesday, May 12, 2020

వేరు శనగపప్పు పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

వేరు శనగ పప్పు పచ్చడి.

(  పల్లీ  పచ్చడి.  )

తయారీ విధానము .

ఒక  50 గ్రాములు  వేరు శనగపప్పు  బాండీలో  నూనె లేకుండా  వేయించుకుని    చల్లారగానే  పై పొట్టు  తీసేసుకోవాలి.

తిరిగి  స్టౌ  మీద  బాండీ  పెట్టుకుని  మూడు  స్పూన్లు  నూనె వేసుకుని  నూనె కాగగానే  నాలుగు ఎండుమిరపకాయలు , మూడు స్పూన్లు  పచ్చిశనగపప్పు  వేసుకుని  పోపు  దోరగా వేయించుకోవాలి.

ఆ పోపులోనే  వేయించిన వేరు శనగ గుళ్ళు , ఆరు  పచ్చి మిరపకాయలు , మరియు  కొద్దిగా  పసుపును  వేసుకుని ఒక  అయిదు  నిముషాలు  పాటు  వేయించు కోవాలి .

చిన్న నిమ్మకాయంత  చింతపండు   కొద్దిగా  నీటిలో  తడుపుకుని  ఉంచుకోవాలి.

ఇప్పుడు మిక్సీ లో  వేయించిన  పోపు  మొత్తము , తడిపిన  చింతపండు మరియు  తగినంత  ఉప్పును  వేసుకుని  కొద్దిగా  నీళ్ళు  పోసుకుని పచ్చడి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

ఆ తర్వాత  పచ్చడిని  వేరే గిన్నెలోకి  తీసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  పోపు గరిటె  పెట్టుకుని  రెండు  స్పూన్లు  నెయ్యి  వేసుకుని , నెయ్యి  బాగా కాగగానే  రెండు  ఎండుమిరపకాయలు  ముక్కలుగా తుంచి , ముప్పావు  స్పూను  చాయమినపప్పు , అర స్పూను ఆవాలు , కొద్దిగా  ఇంగువ  మరియు రెండు రెమ్మలు  కరివేపాకును  వేసి  పోపు  వేయించుకుని ,  ఆ పోపును  పల్లీ  పచ్చడిలో  కలుపుకోవాలి.

ఇడ్లీ , దోశెలు , గారెలు  లోకి  చేసుకునే  కొబ్బరి పచ్చడి , వేరుశనగ గుళ్ళు  పచ్చళ్ళల్లో  నూనె తో పోపు  వేసే కన్నా  నేతితో  పోపు  వేస్తేనే  పచ్చడి  చాలా  రుచిగా  ఉంటుంది.

అంతే .  ఎంతో  రుచిగా ఉండే పల్లీ  పచ్చడి ఇడ్లీ, దోశెలు  మరియు  భోజనము  లోకి  సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము  తయారు చేయు విధానము  మరియు  ఫోటో  తయారు  చేయు  సమయమున  తీసినది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి