Tuesday, May 12, 2020

కందిపచ్చడి & చింతపండు పచ్చడి.

ఆలూరుకృష్ణప్రసాదు 

సూపర్  కాంబినేషన్  ప్రాచీన  వంటకములు.

కందిపచ్చడి  &  చింతపండు  పచ్చడి.

కందిపచ్చడి.

ఆలూరుకృష్ణప్రసాదు .

రెసిపీ చాలా ఈజీ.

పన్నెండు  ఎండుమిరపకాయలు , కప్పున్నర  లేదా  (  షుమారు 150 గ్రాములు  ) కందిపప్పు ,  స్పూను  జీలకర్ర  బాండీలో నూనె వేయకుండా కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకుని , చల్లారగానే ఈ వేయించినవి ,  పావు స్పూను లో సగం  పచ్చి ఇంగువ  మరియు సరిపడా ఉప్పువేసి వాటిని మిక్సీ లో వేసుకుని  కొద్ది  కొద్దిగా  నీళ్ళు పోసుకుంటూ మరీ మెత్తగా  కాకుండా కొంచెం పప్పులు  తగిలే  విధముగా  మిక్సీ  వేసుకోవాలి .

అంతే  ఎంతో రుచికరమైన షుమారు వంద సంవత్సరాల పైగా  చరిత్ర కలిగిన తాతమ్మల నాటి  కందిపచ్చడి సర్వింగ్ కు సిద్ధం.

 ఇంక  ఈ పచ్చడిలో  అదనంగా చింతపండు , వెల్లుల్లి , కరివేపాకు ,  నేతితో పోపు లాంటి అదనపు   వన్నీ మీ  అభిరుచి ప్రకారము మీకు ఇష్టమైన  విధముగా  వేసుకోవచ్చును.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము  తయారుచేయు  విధానము  మరియు  ఫోటో  తయారు చేయు  సమయమున  తీసినది.

********************************

ఆలూరుకృష్ణప్రసాదు .

చింతపండు   పచ్చడి  .

సాధారణంగా   పెసరట్లు , దోశెలు ,  ఇడ్లీలు , గారెలు  మరియు  భోజనము  లోకి  అందరం  అల్లం   పచ్చడి  చేసుకుంటాము .

అలాగే   ఇప్పుడు  మామిడి  అల్లం  కూడ  బాగా  దొరుకుతోంది  కాబట్టి   చాలామంది  మామిడి  అల్లం  పచ్చడి  కూడా  చేస్తారు .

ఈ  రెండింటికన్నా  ప్రాచీనమైన   పచ్చడి  చింతపండు   పచ్చడి .

లోగడ  పెద్ద వాళ్ళందరూ   చింతపండు   పచ్చడినే  అన్ని సందర్భాలలోనూ చేసేవారు .

ఈ  చింతపండు  పచ్చడి  ఫ్రిజ్ లో  పెట్టక పోయినా  వారం  రోజులు  నిల్వ  ఉంటుంది .

చింతపండు   పచ్చడి తయారీ విధానము .

కావలసినవి .

చింతపండు   ---  పెద్ద   నిమ్మ కాయంత . షుమారుగా  60 గ్రాములు.
పసుపు  --  పావు స్పూను  .
ఉప్పు ---  తగినంత 
బెల్లం  --  చిన్న ముక్క . షుమారుగా 30 గ్రాములు.

పోపునకు .

ఎండుమిరపకాయలు   ---  15
మెంతులు  ---   పావు స్పూను  
ఆవాలు  ---   అర  స్పూను 
ఇంగువ   ---   కొద్దిగా 
నూనె  ---   నాలుగు   స్పూన్లు 

తయారీ  విధానము  .

ముందుగా   చింతపండు  రెబ్బలుగా  విడదీసి  పావు  గ్లాసు  వేడి  వేడి  నీటిలో  తడిపి  ఉంచుకోవాలి .

రసం  తీయనవసరం  లేదు .

ఆ  తర్వాత స్టౌ మీద బాండి  పెట్టి  నూనె  మొత్తము  వేసి ,   నూనె  బాగా  కాగగానే  వరుసగా  మెంతులు , ఎండుమిరపకాయలు వేయాలి . మెంతులు  వేగగానే  ఆవాలు  మరియు  ఇంగువ   వేసి  పోపు వేగగానే   స్టౌ  ఆపివేయాలి .

పోపు  చల్లారగానే  మిక్సీ  లో  ముందుగా  ఎండుమిరపకాయలు , పసుపు మరియు తగినంత  ఉప్పు     వేసి   మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

ఆ తర్వాత  తడిపిన  చింతపండు  నీళ్ళతో సహా , వేగిన  పోపు  మరియు  చిన్న   బెల్లం  ముక్కతో   సహా  మిక్సీ లో వేసి  మెత్తగా మిక్సీ వేసుకోవాలి. 

నీళ్ళు  పోయకుండా  గట్టిగా    విడిగా గిన్నెలోకి తీసుకోండి .

అంతే  ఇడ్లీ  , దోశెలు , పెసరట్లు , గారెలు  మరియు  భోజనము  లోకి  కూడా  ఎంతో  రుచిగా   ఉండే   చింతపండు  పచ్చడి  సర్వింగ్  కు  సిద్ధం .

మా  ఇంట్లో  ఈ చింతపండు  పచ్చడి చేసినప్పుడు  దీనికి  కాంబినేషన్ గా  కందిపచ్చడి  చేసుకుంటాము.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము  తయారు చేయు  విధానము   మరియు  ఫోటో  తయారు చేయు  సమయమున  తీసినది.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి