Monday, February 5, 2018

బెండకాయలతో రుచికరమైన మజ్జిగ పులుసు .

ఆలూరుకృష్ణప్రసాదు .

బెండకాయలతో  రుచికరమైన మజ్జిగ  పులుసు .

కావలసినవి .

పెరుగు  --  అర లీటరు
బెండకాయలు  --  లేతవి  పావు కిలో .
పచ్చిమిరపకాయలు  --   ఆరు నిలువుగా  చీలికలు  చేసుకోవాలి .
కరివేపాకు  --  మూడు  రెమ్మలు
కొత్తిమీర  --  ఒక కట్ట
ఉప్పు   --  తగినంత

ముందుగా   స్పూనున్నర  పచ్చిశనగపప్పు , చిన్న అల్లం  ముక్క , పావు  స్పూను  ఆవాలు  ఒక  గిన్నెలో  వేసుకుని  మునిగే  వరకు  నీరు పోసి  ఒక గంట  సేపు  నానబెట్టుకోవాలి .

తర్వాత   నీరు  వేరుగా  వడకట్టుకుని   మిక్సీ లో  నానబెట్టిన  పచ్చిశనగపప్పు , ఆవాలు ,   అల్లం  ముక్క , చిన్న  పచ్చి కొబ్బరి ముక్క  ముక్కలుగా  చేసుకుని వేసుకోవాలి.

రెండు పచ్చిమిర్చి ,   వేసి కొద్దిగా  విడిగా  తీసి  ఉంచిన  నీరు  పోసుకుంటూ   మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఒక గిన్నెలో   మొత్తము  పెరుగు  వేసుకుని  తగినన్ని  నీరుపోసుకుని  కవ్వముతో  మజ్జిగ  చేసుకోవాలి .

నీరు  మరో  రెండు గ్లాసుల  నీళ్ళు పోసుకోవాలి .

అందులో  తరిగిన  పచ్చిమిరపకాయలు , కరివేపాకు , తగినంత  ఉప్పు , రుబ్బిన  ముద్ద అందులో  వేసుకుని  గరిటతో  బాగా  కలుపుకోవాలి .

లేత  బెండ కాయలు  ముక్కలుగా  తరుగు కోవాలి .

స్టౌ  మీద  బాండీ  పెట్టి   రెండు  స్పూన్లు  నూనె వేసి  బెండకాయ ముక్కలను  వేసి  ముక్కలను  బాగా  మగ్గనివ్వాలి .

చల్లారగానే  ముక్కలను   మజ్జిగలో  కలుపుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి  నూనె  బాగా కాగగానే  మూడు ఎండుమిరపకాయలు  ముక్కలుగా చేసి , కొద్దిగా  మెంతులు , పావు స్పూను  జీలకర్ర , పావు స్పూను  ఆవాలు  కొద్దిగా  ఇంగువ మరియు కరివేపాకు  వేసుకుని  పోపు  వేగగానే  మజ్జిగ లో  వేసుకుని  గరిటెతో బాగా కలుపుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  ఈ మజ్జిగ  పులుసును  పెట్టి  పొంగకుండా , విరగకుండా  గరిటెతో  బాగా కలుపుతూ  పదిహేను నిముషాల పాటు  తెర్లనిచ్చి  , కొత్తిమీర  కూడా వేసుకుని దింపుకోవాలి.

ముందుగా  మరగనిచ్చి  తర్వాత పోపు పెడితే  పులుసు విరిగే  ప్రమాదం ఉంది .

అంతే  వేడి వేడి  మజ్జిగ  పులుసు సర్వింగ్  కు సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి