Sunday, June 25, 2017

పరుప్పు రసం

తమిళ  బ్రాహ్మణుల  పరుప్పు  రసం .
ఆలూరు కృష్ణప్రసాదు .

మేం  చెన్నై   లో   నాలుగు  సంవత్సరాలు  ఉన్నాము .
మేం  అక్కడ  ఉన్నప్పుడు  మేం  ఉన్న  కాలనీ  లో  తమిళ  బ్రాహ్మణులు   ఈ  తమిళుల  పరుప్పు రసం  ఎలా  చేసుకోవాలో  మాకు  నేర్పించారు .
తమిళం  లో  పరుప్పు  అంటే  పప్పు  అని  అంటారు . రసము  ను  చారు  అని కూడా  పిలుస్తారు .
కాబట్టి  మన భాష లో  చెప్పాలంటే  దీనిని  పప్పు చారు  అని   అనవచ్చు .
కాని  ఈ  పరుప్పు  రసం  మనం చేసే  విధానానికి   వారు  చేసే  విధానానికి   చాలా  వత్యాసం  ఉంది .
ఇందులో  మిరియాలు  , ధనియాలు , జీలకర్ర   మొదలైన  ఓషధ  విలువ కలిగిన  పదార్ధములు  కలుస్తాయి  కనుక   ఆరోగ్యానికి   మరీ  ముఖ్యంగా  జీర్ణ శక్తి  వృద్ధి చెందడానికి   చాలా  మంచిది .
పరుప్పు  రసము  తయారు  చేయు విధానము .
కావలసినవి  .
  
చింతపండు  ---  40  గ్రాములు

పచ్చిమిర్చి    ----   3
కరివేపాకు   --  మూడు రెమ్మలు.
కొత్తిమీర   --  ఒక  చిన్న కట్ట
టమోటో లు  --  2
  
నెయ్యి  ---  నాలుగు   స్పూన్లు

పసుపు   ---  కొద్దిగా
ఉప్పు   ---   తగినంత .
కందిపప్పు   ---  అర  కప్పు .
రసము  ముద్దకు  కావలసినవి .
ఎండుమిరపకాయలు   ---  3  
కందిపప్పు   ---    రెండు  స్పూన్లు .
ధనియాలు  --  రెండు స్పూన్లు .
మిరియాలు  ---  ఒక  స్పూను 
జీలకర్ర   ---  అర  స్పూను 
కరివేపాకు   ---  రెండు  రెమ్మలు .
ఇంగువ  ---  కొద్దిగా .

ముందుగా   చింతపండు   విడదీసి  గ్లాసు  నీళ్ళల్లో  పది నిముషాలు  నానబెట్టుకుని పల్చగా రసం  తీసుకుని అందులో  మరో  గ్లాసు  నీళ్ళు  పోసుకోవాలి .
టమోటో  లు  కొద్దిగా   నీళ్ళు  పోసి  ఉడికించుకుని  పై  తొక్క తీసుకుని   వేరేగా  ఉంచుకోవాలి .
టమోటో  లు  ఉడికించిన  నీళ్ళు    రసము  గిన్నెలో   పోసుకోండి .
అందులో  పసుపు ,  తరిగిన   పచ్చిమిర్చి  ,  తగినంత  ఉప్పు , రెండు  రెమ్మలు  కరివేపాకు   , అర స్పూను   పంచదార  వేసుకుని   పక్కన  ఉంచుకోవాలి  .
అర  గ్లాసు  కంది పప్పు  సరిపడా  నీళ్ళు  పోసి  కుక్కర్  లో మూడు  విజిల్స్  వచ్చే వరకు  ఉంచి  మెత్తగా   ఉడికించి , చల్లారి  మూత  రాగానే  గరిటతో  మెత్తగా  యెనుపు కోవాలి .
రసము  ముద్ద  తయారీ  విధానము .
స్టౌ  మీద  బాండీ  పెట్టి  రెండు  స్పూన్లు   నెయ్యి  వేసి  నెయ్యి   కాగగానే  వరుసగా   ఎండుమిర్చి  , కందిపప్పు  , ధనియాలు , మిరియాలు , ఇంగువ , జీలకర్ర  ,  మరియు  రెండు  రెమ్మలు  కరివేపాకు  వేసి  పోపు  వేయించుకోవాలి .
పోపు  చల్లారగానే  ఇవ్వన్నీ  మిక్సీ  లో  వేసి  కొద్దిగా   నీళ్ళు  పోసి   మెత్తగా   ముద్దలా  వేసుకోవాలి .
చివరగా  ఉడికిన  టమోటో లు కూడా  ఆ ముద్దలో  వేసి  మెత్తగా   మిక్సీ   వేసుకుని   వేరే  గిన్నెలో కి  తీసుకోవాలి .
ఇప్పుడు   స్టౌ   మీద   చింతపండు   రసము  ఉప్పు  మొదలైనవి  వేసిన  గిన్నె   పెట్టి  రసము  బాగా  తెర్లుతున్నప్పుడు , ఉడికించి  ఉంచుకున్న   కందిపప్పు   మరియు  వేరేగా  ఉంచుకున్న   రసము  ముద్ద కూడా  వేసి  బాగా  తెర్లనిచ్చి  దింపుకోవాలి .
ఆ తర్వాత   స్టౌ  మీద  బాండీ  పెట్టి   రెండు స్పూన్లు  నెయ్యి  వేసి  నెయ్యి  బాగా  కాగగానే    రెండు  ఎండుమిర్చి  ముక్కలుగా  చేసి , మెంతులు , ఆవాలు , జీలకర్ర  , ఇంగువ  మరియు  కరివేపాకు  తో  పోపు పెట్టు కోవాలి .
తర్వాత  పైన  కొత్తిమీర   వేసుకోవాలి .
అంతే  ఇడ్లీ లోకి , పూరీ , చపాతీలలోకి ,  వడల లోకి  మరియు  భోజనము   లోకి  ఎంతో  రుచికరమైన  తమిళ  బ్రాహ్మణ  పరుప్పు  రసము  సర్వింగ్   కు  సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి