Monday, May 29, 2017

కొయ్య తోటకూర తో పప్పు

కొయ్య తోటకూర తో పప్పు
ఆలూరి కృష్ణ ప్రసాద్

ప్రియమిత్రులందరికీ... ఈ రోజు మన మిత్రులందరికీ కొయ్య తోటకూర తో పప్పు తయారు చేసుకునే విధానము గురించి తెలియ చేస్తున్నాను.
మనకు తోటకూర లో రెండు రకములు వస్తాయి.
మొదటిది పెరుగు తోటకూర.
అంటే చిన్న చిన్న మొక్కలు గా వస్తాయి.
రెండవది కొయ్యతోటకూర లేదా చిలక తోటకూర అని కూడా పిలుస్తారు.
ఈ చిలుక తోటకూర గుబురుగా చిన్న ఆకులతో చిన్న చిన్న కొమ్మలుగా పెరుగుతుంది .
కొయ్య తోటకూర ఎలా ఉంటుందో ఫోటో పెట్టాను.
ఫోటోలో చూడండి.
ఈ కొయ్య తోటకూర తో ముఖ్యంగా పప్పు బాగుంటుంది.
అది కూడా కందిపప్పు తోనే బాగుంటుంది.
కొంతమంది కొయ్యతోటకూరతో పులుసు కూర కూడా చేసుకుంటారు .
కానీ గోంగూర , తోటకూర , పాలకూరతో పులుసు కూర చేసుకున్నంత రుచిగా ఈ కొయ్య తోటకూర పులుసు కూర అన్పించదు .
ఇంక కొయ్య తోటకూర తో పప్పు తయారు చేసుకునే విధానము .
కావలసినవి.
కొయ్య తోటకూర -- షుమారుగా ఒక పది రూపాయలకు అర కిలో కూర వస్తుంది.
కందిపప్పు --- 200 గ్రాములు
ఉల్లిపాయలు -- పెద్దవి మూడు
పచ్చిమిర్చి --- ఆరు
చింతపండు -- షుమారుగా చిన్న నిమ్మకాయంత
కారం -- 2 టీ స్పూన్లు
ఉప్పు -- తగినంత
పసుపు -- కొద్దిగా
పోపుకు కావలసినవి.
నూనె --- మూడు స్పూన్లు .
మెంతులు -- ఒక స్పూను
ఆవాలు -- ఒక స్పూను
జీలకర్ర - అర స్పూను
మినపప్పు - ఒక స్పూను
ఇంగువ -- తగినంత
తయారీ విధానము.
ముందుగా కొయ్య తోటకూర శుభ్రంగా కడుక్కొని ముదురు కాడలు తీసేసు కొవాలి.
ఆకుతో ఉన్న చిన్న లేత కాడలు ఉంచుకోవాలి.
ఆకును సన్నగా తరుగు కోవాలి.
ఉల్లిపాయలు తొక్క తీసి మామూలు సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి .
చింతపండు లో ఈనెలు, గింజలు తీసి చాలా కొద్దిగా నీళ్ళ తో తడిపి ఉంచుకోవాలి.
చింతపండు రసం తీయక్కర లేదు.
ఆ పళంగానే పప్పులో వేసుకోవచ్చు .
కందిపప్పు ఒక గిన్నెలో పోసి ఒకసారి కడిగి తగినన్ని నీళ్ళు పోసి , స్టౌ వెలిగించి స్టౌ మీద పెట్టుకోవాలి.
ఎప్పుడు పప్పు లో ముందు ఉప్పు వేయకూడదు .
ఆ విధంగా ముందు ఉప్పు వేస్తే పప్పు అసలు ఉడకదు .
పప్పు మూడువంతులు ఉడికాక ( అంటే చేత్తో కందబద్ద పట్టుకొని చూస్తే మెత్తగా అవ్వాలి ) తగినన్ని నీళ్ళు ఉన్నాయేమో చూసుకుని వరుసగా తరిగి ఉంచుకున్న కొయ్య తోటకూర, పసుపు , పచ్చిమిర్చి ముక్కలు , ఉల్లిపాయ ముక్కలు , నానబెట్టిన చింతపండు వేసి మూతబెట్టి కొయ్య తోటకూర , పప్పు బాగా మెత్తగా ఉడికే దాక ఉంచండి.
మనం పోసిన నీళ్ళు సరిపోక పోతే కొద్దిగా పోయండి.
పప్పు , కూర , మరియు ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా కలిసి పోయేలా ఉడికాక , ఇప్పుడు సరిపడ ఉప్పు , రెండు స్పూన్ల కారం వేసి గరిటతో బాగా కలియ బెట్టండి .
దించాక స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి వరుసగా మెంతులు , ఎండుమిర్చి , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ వేసి తాలింపు వేసి పప్పులో కలుపుకోండి .
అంతే కమ్మని ఇంగువ వాసనతో ఘుమ ఘమ లాడే కొయ్య తోటకూర పప్పు అన్నం లోకి , మరియు చపాతీలలోకి సిద్ధం.
మేము సాధారణంగా ఆకు కూర పప్పుల పోపులో కరివేపాకు వేయము .
మీ కిష్టమైతే వేసుకోండి.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి